Monday, September 17, 2012

త్రిగుణాలు -1


త్రిగుణాలు  
సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే మూడూ త్రిగుణాలుగా చెప్పబడే ప్రకృతి గుణాలు. ప్రకృతిలో ఈ మూడు గుణాలూ  సమతుల్యంగా ఉంటాయి. ఈ మూడు గుణాలలోను హెచ్చు తగ్గులు కల్గినపుడు సృష్టి ఆరంభమవడానికి సంకేతంగా అనుకోవచ్చు.  ప్రకృతి వల్లనే జగత్తు ఏర్పడినప్పుడు, సృష్టిలో ప్రతీ జీవిలోను, పదార్ధంలోనూ ఈ మూడు గుణాలూ ఉంటాయి. ఒక్కో జీవి నిర్మాణాన్ని బట్టి, ఈగుణాలు  వేర్వేరు పాళ్ళల్లో ఉంటాయి.  ఈ మూడు గుణాలు పరస్పరం కలయికతో విభిన్నమైన జీవరాశులు ఏర్పడుతున్నాయి. అలాగని ఈ గుణాలు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవు. పరిస్థితులను బట్టి, ఒకోసారి సత్వగుణమూ మరోసారి రజోగుణమూ మరోసారి తమో గుణమూ ఆధిక్యంలో ఉంటాయి. ఈ మూడు గుణాలలో  ఒక గుణము హెచ్చుగా ఉంటే ,  మిగిలిన రెండూ  తక్కువగా ఉంటుంటాయి. సత్వగుణమంటే జ్ఞానశీలతగాను, రజోగుణాన్ని క్రియాశీలతగాను, తమోగుణాన్ని స్థితిశీలతగాను సామాన్యంగా  చెప్పవచ్చు.

సత్వగుణ కార్యము వల్ల పుణ్యము, రజోగుణ కార్యము వల్ల దుఃఖము, తమోగుణ కార్యము వల్ల అజ్ఞానము కలుగుతాయి. సాధనలో అందుకే ముందు తమోగుణాన్నితగ్గించుకోవాలనీ, సత్వగుణాన్ని పెంపొందించు కొవాలనీ చెబుతారు. ఒక గుణం ఎప్పుడు అధికమవుతుందో అప్పుడు మిగిలిన రెండూ తగ్గుతాయని అంటారు. ఆతర్వాత శుద్ధ సత్వాన్నిపొంది చివరగా దాన్నీ త్యజించి త్రిగుణాతీతంగా అవ్వాలని చెబుతారు. అప్పుడు చిత్తవృత్తులన్నీ అణుగుతాయి. మీ మనస్సు మీరు చెప్పినట్లు వింటుంది. దాంతో గమ్యాన్ని చేర వీలవుతుందని విజ్ఞులు బోధిస్తుంటారు. 

రజోగుణం

క్రియారూపమైన విక్షేపశక్తి రజోగుణ సంబంధమైనది. దీని వల్లనే సమస్త క్రియలూ జరుగు తున్నాయి. రాగము, దుఃఖము అనే మనోవికారాలు కలుగుతున్నాయి. కామము, క్రోధము, లోభము, దంభము, అసూయ, అహంకారము, ఈర్ష్య , మత్సరమనే ఘోర లక్షణాలు రజోగుణ ధర్మములుగా చెప్పబడ్డాయి. రజోగుణము రాగము  లక్షణముగా గలదై ఆశ, మమకారములచేత, కర్మయందు ఆసక్తికలిగించి దేహిని బంధిస్తోంది. రజోగుణము పెరిగినపుడు లోభము, కర్మ ప్రవృత్తి, అశాంతి, భోగలాలసత్వము కల్గుతాయి. ఈ గుణాదిక్యత యందు మరణిస్తే , కర్మయందాసక్తిగల మానవజాతి యందు పునర్జన్మ కలుగుతుందని అంటారు. వీరు యక్షులను, రాక్షసులను ఆరాధిస్తారు. 

ఎక్కువగా ఉప్పు, కారము, పులుపు,  చేదు , ఎక్కువ వేడిగా ఉండి దాహాన్ని, ఉద్రేకాన్ని కల్గించే ఆహార పదార్ధాలు  రాజసునకు ఇష్టము. ఇవి దుఃఖము, శోకము,  రాగములను కల్గిస్తాయి. ఇలాంటి ఆహారం మనస్సును విచలితం చేసి ప్రాపంచిక సుఖాలవేపుకు లాగుతుంది. గ్రుడ్లు, చేపలు, ఉప్పు, కారం, కుంకుమ పువ్వు, పిండి వంటలూ, మసాలా వంటి సుగంధ ద్రవ్యాలు, శరీరాన్ని ఉద్రేక పరచే కాఫీ , టీ , వేడి పాలు వంటివి రాజసిక ఆహారంలోకి వస్తాయి. అతిగా తినేది ఏదైనా రాజసిక ఆహారమే.
 
ఒక ఫలితాన్ని ఆశించి గాని,  ఆడంబరంతోగాని  చేసేది  రాజసిక యజ్ఞం అనబడుతుంది. పుణ్యం కల్గుతుందనిగాని, లేక తిరిగి సహాయం పొందే ఉద్దేశ్యంతోనూ, బాధతోనూ చేసేది రాజసిక కార్యం అనబడుతుంది.

2 comments:

  1. meekoka book present cheddamanukuntunanu. mee address naa mail id ki pampiste..courier chestanu. its about spirituality.

    ReplyDelete