Thursday, November 29, 2012

బ్రహ్మము-1

బ్రహ్మము-1 
మాయను గురించి తెలుసుకొనేముందు బ్రహ్మము గురించి తెలుసు కోవాలి.
ఇదివరలో ఆత్మ-1 ,ఆత్మ-2 లలో ఆత్మగురించి వ్రాయబడింది. ఆత్మయే బ్రహ్మమని చెప్పుకున్నాం. అంచేత వాటిని ఈ వ్యాసంతో కలిపి చదువుకోవాలి.  

బ్రహ్మము గురించి-

దుఃఖాన్ని దూరం చేసుకోడానికి భగవంతుడిని సేవించాలని/ ప్రార్ధించాలని పెద్దలు చెబుతూంటారు. ప్రతీ వ్యక్తికీ తనతో బాటుగా, కనిపించే బాహ్యప్రపంచం ఉందనేది తెలిసిన విషయమే. పెద్దలు చెప్పడాన్నిబట్టో లేక శృతి ద్వారానో లేక అనుమాన ప్రమాణంగానో పరమాత్మ ఉన్నాడని తెలుసుకొంటారు. ఇలా జీవుడు, జగత్తు, పరమాత్మ ఉన్నారని తెలిసినా, ఈ మూడింటికీ ఉండే పరస్పర సంబంధాన్ని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఏ కొద్దిమందికో ఉండి , దాన్ని తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు.

బాహ్య విషయాలు తెలుసుకునేందుకు ప్రత్యక్షప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్దప్రమాణముల వంటివి ఆయా విషయాలను గూర్చిన యదార్ధజ్ఞానాన్ని కల్గిస్తాయి. కాని ఇవేప్రమాణాలు అలౌకికవిషయాలైన స్వర్గ నరకాలు, పాప పుణ్యాలు, ఆత్మఅనాత్మల గురించి తెలియడానికి ఉపకరించవు. ఇలాంటి విషయాలు తెలియాలంటే శ్రుతిని ఆధారంగా తీసుకోవాలని విజ్ఞులు చెబుతారు. వేదాల పూర్వభాగంలో ఎవరి అభిరుచిని బట్టి వారు ఆచరించడానికి తగినట్లుగా వివిధకర్మలూ, ఉపాసనలూ చెప్పబడ్డాయి. ఈ కర్మకాండ, ఉపాసనలలో భేదదృష్టి అంతర్లీనంగా కనిపిస్తుంది. అలాంటి భేదభావం/ద్వైతభావం తోనే, లోకవ్యవహారమంతా జరుగుతోంది కూడా. 

వేదాల చివరిభాగాలైన ఉపనిషత్తులలో, బ్రహ్మమును తెలుసుకొనే విచారణ చెయ్యబడటంవల్ల వేదాంతమని పిలువబడుతోంది. దేన్ని తెలుసుకొంటే, ఇక తెలుసుకోవలసినదేదీ ఉండదో, ఆకారణం వల్ల వేదాంతమని చెప్పబడింది. మనం వాడుకలో భగవంతుడు లేక దేవుడు అని చెప్పేదాన్ని వేదాంతంలో పరము, పరతత్వము, బ్రహ్మము, పరబ్రహ్మము , పరమాత్మ, నిర్గుణబ్రహ్మము అని చెప్పబడింది. ఈ సంసారసాగరమనే జననమరణాల దుఃఖంనుండి విముక్తి లభించాలంటే, బ్రహ్మమును తెలుసుకోవాలి. అంటే శ్రవణ, మనన, నిదిధ్యాసనలను అభ్యసించి, బ్రహ్మాత్మైక్య అనుభవాన్నిపొందాలి/బ్రహ్మవిద్యను తెలుసుకోవాలి.

బ్రహ్మము  అవాజ్ఞ్మానస గోచరమని శృతి చెబుతోంది. అంటే మాటలచేత గాని, మనస్సు చేత గాని , జ్ఞానేంద్రియముల చేత గాని తెలియబదనిది. అయినా అందరికీ అర్ధమవ్వడానికి నామరూపములు లేని నిర్గుణబ్రహ్మమైన శుద్ధచైతన్యమును  పరుడు, చిత్తు, సత్తు అనే పేర్లతో చెప్పబడినది. ఆ నిర్విశేష బ్రహ్మమును బోధించడానికి వేదాంత శాస్త్రము  నేతి, నేతి – ఇది కాదు, ఇది కాదు అని; సమస్త వస్తువుల స్వరూపమును విచారించి త్రోసివేయగా చివరకు నిషేధింప వీలుకానిది బ్రహ్మమని నిశ్చయము చేయబడినది. ఇది నిషేధపద్ధతి.  ఇది గాక బ్రహ్మము సద్రూపుడు, చిద్రూపుడు, అనంతరూపుడు అని శబ్దప్రయోగములతో చెప్పే పద్ధతిని విధి అని చెబుతారు. ఇలా  విధి , నిషేధములు బ్రహ్మ బోధకు ఉపాయములుగా వేదాంతము నందు  గ్రహించబడ్డాయి.

 
 


Thursday, November 22, 2012

కుండలిని - 8

సహస్రార చక్రము 


ఆజ్ఞాచక్రమునకు మీదుగా కపాలము నందుండును. జ్ఞానసిద్దిపొందిన జీవులను తనయందు ఐక్యముచేసుకొను 'ఓం'కారస్వరూపుడైన పరబ్రహ్మ ఇచ్చట కలడు. ఈ సహస్రారకమలము సహస్రదళములతో కూడి కోటిసూర్యుల ప్రకాశముకల్గి యుండునని చెప్పబడినది. దీనియందు ఎనిమిది దళములు గలవు. ఒక్కొక్క దళమునకు నూట ఇరువదియైదు రేకులు ఉండుటచే, సహస్రదళపద్మమని చెప్పుదురు. ఈ చిద్బిందువే లీనమగు కేంద్రము. ఇందు కేవల సాక్షిమాత్రుడగు పరమాత్మ అధిపతిగా, ప్రణవనాద స్వరూపముగా పాటలవర్ణ రూపమున గలడు. ఇచటగల వర్తులాకార షట్కోణమందు గల కేంద్రబిందు సంజ్ఞయే మనస్సు నిలుపవలయు స్థానము. ముందుగా మనసును విషయములనుండి మరల్చి, ఆజ్ఞాచక్రమున నిలిపి పిమ్మట సహస్రారమున చేర్చుటచే వృత్తిరహితమగును. ఇదే యోగుల గమ్యస్థానము. ఇచట ఇష్టదేవత లేక గురువు పాదపద్మములున్నవని భావింతురు. 'ఓం' కారము నుచ్చరించ వచ్చని చెప్పెదరు. దీనియందు బ్రహ్మరంధ్రము ఉన్నది. ఇటనుండి దేవయాన మార్గమున బ్రహ్మలోకమునకు పోవు ఉపాసకులు నిర్గమింతురు.

ముఖ్య విషయాలు

ధ్యానం :- మన అంతరంగిక ప్రపంచాన్ని గురించి చేసే సాధన.
ఈ సాధన చెయ్యడానికి ముందు గురువును/ లేక  ఇష్టదైవాన్ని గాని ధ్యానంలో సరైన బాటలో   నడిపించమని ప్రార్ధన చెయ్యాలి. ఒక వస్తువుపై మనస్సును కేంద్రీకరింప జేయటమే ధ్యానం అని చెప్పబడుతోంది.
ఆసనం :- స్థిరంగాను, సుఖంగాను ఎక్కువ సమయం ఉండగలిగే ఏ ఆసనాన్నైనా ఎన్నుకోవచ్చు. నియమాలేవీ లేవు. పద్మాసనం, సుఖాసనం, వజ్రాసనం అనువైనవని విజ్ఞులు అంటారు. 
వెన్నెముక :- వెన్నెముక తోబాటు తల, మెడ, చాతీ నిటారుగా ఉండేలా ఆసనంలో ఉండాలి.
ముద్ర :- ఒకటి - బొటన వేలికొన చూపుడు వేలి కొనతో కలిపి  మిగిలిన మూడు వ్రేళ్ళనూ నిటారుగా ఉంచి అరచేతిని  చాచాలి.     
రెండు :- చూపుడువేలికొనను బొటనవేలి మధ్య అంటే మొదటి కణుపుతో కలిపి ఉంచాలి.
మూడు :- చూపుడువేలికొనను బొటనవేలి రెండవ కణుపుతో కలిపి ఉంచాలి. సాధారణంగా మొదటి రెండు చక్రాల ధ్యానానికీ మొదటి ముద్రను, తర్వాతి రెండు చక్రాల ధ్యానానికీ రెండవ ముద్రను, ఆపై చక్రాల ధ్యానానికి మూడవ ముద్రను చెప్తారు. (ఈ విధంగా నేను నేర్చుకున్నాను). ఇలా ముద్రలను మార్చడానికి సందేహం ఉంటే అన్ని చక్రాల ధ్యానానికీ మూడవ ముద్రను నిర్ద్వందంగా ఉపయోగించ వచ్చును.
మూలాధారంతో చక్రధ్యానం మొదలు పెడితే అన్నిచక్రాల ధ్యానము, ఒకదాని తర్వాత మరొకటి  క్రమంగా   చెయ్యడానికి సుమారుగా ఐదు నిమిషాలు ఒకో చక్రానికీ పడుతూ, మొత్తం పూర్తయ్యేసరికి నలభైఐదు నిమిషాల నుండి యాభై నిమిషాలదాకా పట్టవచ్చు. సహస్రారం పూర్తయ్యే సరికి ఒకవిధమైన ఆనందానుభూతి కల్గుతుంది. ఆ అనుభూతిని కొనసాగించడానికి కళ్ళు అలాగే మూసి, శవాసనంలో కొంత సేపు ఉండాలని చెప్తారు. 
శ్వాసను గమనించు :- కళ్ళు మూసుకొని శ్వాస వేగం తగ్గేదాకా గమనించుతూ ఉండాలి. క్రమంగా శ్వాస నిమిషానికి 14 సార్లు కంటే తగ్గాలి.  
ధ్యానంలో శ్వాసను గమనిస్తుంటే అది క్రమంగా భ్రూమధ్యంలోకి చేరుకొని, ఆలోచనారహిత స్థితిలో చక్కటి శారీరిక, అత్మానుభూతులను గమనిస్తాం. ధ్యానం అనవసరపు ఆలోచనా పరంపరలను ఆపుతుంది. అపుడు దివ్యచక్షువు ఉత్తేజమై ఇతరలోక దృశ్యాలు కనిపిస్తాయని చెబుతారు.



Thursday, November 15, 2012

కుండలిని - 7


ఆజ్ఞాచక్రము 


భ్రూమధ్యమున గల రెండు దళముల పద్మము. మాణిక్య వర్ణము గలది . ఇది మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారములనే  అంతఃకరణమునకు స్థానము. కంఠస్థానమున మనస్సు చెప్పబడినా,ఇంద్రియ వ్యాపారములు చేయుటకు మనస్సు ఆజ్ఞాచక్రమునకు వచ్చును. అందువల్ల మనస్సునకుగల సంకల్ప వికల్పములు ఈ పద్మమునకు రెండు దళములుగా చెప్పబడినవి. ఇది చిచ్చక్తికి స్థానము. ఇచట చిచ్చక్తితో కూడిన మాయాధిష్టాన చైతన్యస్వరూపుడగు మహేశ్వరుడుండు స్థానము.

అజ్ఞాచక్రము రెండు దళములు  గల పద్మము. కనురెప్పల పైభాగమున నుండును . దీనివల్ల  బుద్ది మేల్కొని ముముక్షత్వము , సత్యదర్శనము కల్గును. జీవుల విషయాలోచనలు ఇందే కల్గుచున్నవి. ఇట్టి ఆలోచనలనుండి క్రమముగా  ఆలోచనలులేని స్థితిలోనికి మారును. ఇందు స్త్రీపురుష లక్షణములు కలసియున్నవి.  లింగబేధ మేర్పడుటకు ముందున్నస్థితి. సృష్టికి ఇదే కారణముగా ఉన్నది. అంతర్యామియైన పరమాత్మ నుండి ఆయన శక్తి వేరై రాగా, అట్టి శక్తియందు మరల పరమాత్మయే ప్రవేశించుచున్నాడు. ఇదియే సృష్టికి మొదటి కారణము. ఇదే భౌతికలోకమున దాంపత్యమై, జీవుల భౌతికదేహముల కలయికద్వారా కామమనుపేర ఉపాసించ బడుచున్నది.  కామభావమువల్ల కల్గు తన్మయత్వము తెలియకుండగనే ఉపాసించబడి, స్త్రీపురుష ఐక్యతగా పరిణమించు చున్నది. కొంతకాలమునకిది కామవాసన లేని ప్రేమగా మార్పుచెంది నిర్మలమగు ప్రేమ అగును. ఇదే జీవికి, జీవికి నడుమ నుండవలసినది.





దీనికి "ఓం"కారము బీజాక్షరము. దీనిని స్థిర చిత్తముతో ధ్యానించుచు, తనయందు ఉచ్చ్వాస నిశ్వాసములను నడుపుశక్తిని గమనించవలెను. అపుడు ఓం కారము అప్రయత్నముగా ఉచ్చరించబడి అంతర్యామి అయిన పరమాత్మ ఓం కారరూపమున మేల్కొనును. ఇట్టి నిరంతర ధ్యానమువలన మనస్సు నిర్మలమై సూక్ష్మస్థితిని పొందును.  '' కార, '' కార , '' కారముల నుండి 'ఓం' కారమను ప్రణవము పుట్టుచున్నది.

ఆజ్నేయచక్రము యొక్క బీజాక్షరం- 'ఓం' .  వైలెట్ (ఊదా)రంగు గల రెండు దళముల పద్మం. దీనికి కుడివేపున సూర్యుడు, ఎడమ వేపున చంద్రుడు. మధ్యలో బూడిద రంగుగల శివలింగము ఉండును.


Thursday, November 8, 2012

కుండలిని - 6

కుండలిని - 6


విశుద్ధము
విశుద్ది- ఆకాశ సంబంధమైనదగుటచే  కంఠస్థానమున చెప్పబడినది. శ్రోత్రేంద్రియ సంబంధ మైనది. జాగ్రత్తు, స్వప్నము, సుషుప్తి, తురీయము అను  అవస్థల యందు తెలియదగు స్థితులకిది స్థానము. ఈ స్థితులే షోడశ దళములుగా చెప్పబడిన పద్మము పరాశక్తికి స్థానము. వర్తులాకారమున నీల వర్ణమున నుండు ఈ కమలమున వేణునాదము తెలియ నగును.  ఇచ్చట సప్త స్వరములు పుట్టుటచే శబ్ద సంబంధము వల్ల వాక్కునకు స్థానము. దీనియందు పరిశుద్దుడగు ప్రత్యగాత్మ యగు జీవుడు ఉండును.

విశుద్దిచక్రము పదహారు దళములతో కూడిన పద్మముగా  క౦ఠమునందు గలదు. మనస్సునకు పుట్టుక స్థానము. ఇది శరీరమందు ఆకర్షణ వికర్షణలు ఇంద్రియముల ద్వారా కల్గుచోటు. "హం" దీని బీజాక్షరము. దీనివల్ల విజ్ఞానము , శాస్త్ర పరిజ్ఞానము మేల్కొనును. ఇంద్రియ నిగ్రహము గలవానికి ఇది మోక్ష ద్వారము. దీనిని ధ్యానించువాడు రాగ శోకముల నుండి విముక్తుడగును. తనయందున్న శ్వాసపై మనస్సు లయమైనవాడు అంతర్యామిని దర్శించి, అతని కరుణచే తన  శరీరము నిలబడియున్నదని గుర్తించి, ఆ శ్వాసయందు తన మనస్సుచే శరణాగతి చెందును. శరణాగతి వల్ల శరీరముతో బంధము తెగిపోవును.





విశుద్ది బీజాక్షరం- హంగ్. పదహారు దళములు కల్గిన నీలిరంగు పద్మం. మధ్యలో నీలిరంగు గల చంద్రవంక. ఈ చంద్రవంక క్రింది భాగంలో పసుపు పచ్చని జ్యోతి. కంఠమూలమున నుండును. గొప్ప ప్రకాశవంత మైనదగుటచే విశుద్ధి అని చెప్పబడినది.