Thursday, December 27, 2012

మాయాస్వరూపము - 3





ఈ సందర్భంలో వేదాంత పంచదశి ఏమి చెబుతోందో చూద్దాం. "శుద్ధసత్వప్రధానమైన ప్రకృతిని మాయ అంటారు. అందు ప్రతిఫలించిన బ్రహ్మమును ఈశ్వరుడు అంటారు. ( ఇక్కడ రజస్తమో గుణములు నిద్రాణమై ఉండగా సత్వగుణ ప్రధానమని చెప్పబడింది). ప్రతిఫలించుట అనగా మాయ యొక్క ఉపాధిని పొందటం.
రజస్తమోగుణములు చైతన్యవంతమైనపుడు రజస్తమోగుణములతో కూడినసత్వమును మలినసత్వము లేక    అవిద్య అని అంటారు. ఈ మలినసత్వప్రధానమైన ప్రకృతిని ఉపాధిగా జేసుకొన్న బ్రహ్మము, జీవుడని పిలువబడుతున్నాడు".

తమఃప్రధానమైన ప్రకృతిని ఉపాధిగా స్వీకరించిన బ్రహ్మము, జగత్తుగా వ్యవహరించబడుతోంది.
ఈశ్వరుడు సృష్టించవలెనని చూచుట లేక ఇచ్చించుటయే ఆజ్ఞ. అట్టి ఈశ్వరాజ్ఞను నిమిత్తముగా చేసుకొని తమః ప్రధానమగు ప్రకృతినుండి సూక్ష్మపంచభూతములు( పంచ తన్మాత్రలు) ఏర్పడినవి.  ప్రతీతన్మాత్ర యందూ మూడుగుణాలు ఉంటాయి. వీటి సత్వాంశలనుండి యిదివరలో జగత్తు ఏర్పడ్డ విధానంలో చెప్పుకున్నట్లుగా పంచ జ్ఞానేంద్రియముల సూక్ష్మతత్వములు , అంతఃకరణచతుష్టయము ఏర్పడగా, రజోగుణ అంశాలనుండి పంచకర్మేంద్రియాల సూక్ష్మతత్వములు , పంచప్రాణములూ ఏర్పడతాయి. ఇలా పందొమ్మిది సూక్ష్మతత్వాలతో సమిష్టి సూక్ష్మశరీరం ఏర్పడుతోంది. అంతఃకరణం మనస్సు బుధ్ధి అనే రెండు తత్వాలను మాత్రమే తీసుకొంటే పదిహేడు సూక్ష్మతత్వాలతో కూడిన సూక్ష్మశరీరం ఏర్పడుతోంది. 

ఇక మిగిలిన తమోగుణవిభాగాల(పంచతన్మాత్రల నుంచి) నుంచి పంచీకరణం అనే ప్రక్రియ ద్వారా స్థూలసృష్టి అంటే జగత్తు అందలి జీవులు, సమస్త లోకములు, అందలి జీవులుఅనుభవించడానికి తగిన వస్తువులు/ పదార్ధాలూ ఏర్పడ్డాయి. ఇలా పంచీకరణం తర్వాత పంచమహాభూతములతో కలసి ముందు చెప్పుకున్న పందొమ్మిది తత్వాలతో కలసి ఇరవై నాలుగు తత్వాలతో స్థూల శరీరాలు ఏర్పడ్డాయని శృతి చెబుతోంది. ఇంతదాకా బ్రహ్మమును గురించి, సృష్టికి బ్రహ్మమునకూ ఉన్న సంబంధం గురించీ టూకీగా తెలుసుకోడానికి ప్రయత్నం చేశాం. ఆ సంబంధమే మాయ అని చెప్పుకున్నాం కూడ. అయితే ఇప్పుడు మాయను గురించి తెలుసుకోడానికి ప్రయత్నిద్దాం.

వేదాంతశాస్త్రంలో బ్రహ్మమే ఈజగత్తుకు అభిన్న నిమిత్త, ఉపాదాన కారణమని చెప్పబడింది. సృష్టికోసం అవినాశి, నిర్గుణుడైన బ్రహ్మమూ,  సగుణము అసత్యము అయిన ప్రకృతిఅనబడే మూలమాయ పరస్పరము తోడుపడి ఉన్నాయి. ప్రకృతి, బ్రహ్మమునకన్న వేరు గాకపోయినా కల్పితభేదం కనబడుతోంది. నిరాకార, నిర్గుణ బ్రహ్మమునందు సగుణ, సాకార రూపమైన మాయ ఎలా కలిగింది అనేదానికి అద్వైతులు చెప్పిన ఒక దృష్టాంతము – రజ్జువునందు  సర్పభ్రాంతి కలిగినట్లు, మాయ బ్రహ్మమునందు భాసిస్తోంది అని అంటారు. శుద్ధబ్రహ్మమునందు కలిగిన ప్రధమచలనమే మూలమాయ లేక మూలప్రకృతి. ఇది సృష్టికిపూర్వం అస్పష్టంగా, సూక్ష్మంగా గుణసామ్యమున అభిన్నమైన విక్షేపశక్తిగా ఉండేది. ఇలా తనను ఆశ్రయించి ఉన్న మాయయందు బ్రహ్మ చైతన్యము ప్రతిఫలించి , సృష్టి కొరకు అనేక విధములగుదునని సంకల్పించి నామ రూపాత్మకమగు జగత్తును సృష్టించెను. ఇట్లు ప్రతిఫలించిన బ్రహ్మ చైతన్యము ‘అహం’ స్ఫురణ రూపమున నానాత్మ కల్పనా సామర్ధ్యముతో  “చిచ్ఛక్తిగా” చెప్పబడినది.




Thursday, December 20, 2012

మాయాస్వరూపము -2



జగత్తు యొక్క సృష్టికి కారణమని చెప్పు మాయ, సాంఖ్యులు చెప్పే ప్రధానం అని పేరు కల్గిన మాయ కాదు. సాంఖ్యులు చెప్పే  మాయ నిత్యమైనది, సత్యమైనది, స్వతంత్ర మైనదని వారు అంటారు. కాని అద్వైతులు చెప్పే మాయ స్వతంత్రమైనది కాదు. అది పరమేశ్వరుని అధీనంలో ఉంటుంది. బ్రహ్మమందలి ఈ మాయాశక్తి, సృష్టి జరుగునపుడే వ్యక్తమవుతుంది. కాబట్టి బ్రహ్మముయొక్క ఈ సృజనాత్మక శక్తియే మాయ అనబడుతోంది. మాయయే జగత్తుయొక్క సృష్టి స్థితి లయములకు కారణమవుతోంది. ఎందుకంటే బ్రహ్మము దేనికీ కారణం కాదు. అద్వితీయమైన ఏకైక పదార్ధమది. అలాగే బ్రహ్మమునకు వేరొక కారణం కూడ లేదు. 

బ్రహ్మమునందు ఇమిడియున్న మాయ సృష్టి లయములు చెందుతున్నా, బ్రహ్మమునకెట్టి సంబంధమూ లేక నిర్లిప్తంగా స్వయం ప్రకాశమై ఉంటుంది. బ్రహ్మమును ఆధారముగా చేసుకొని, మాయాశక్తి  ప్రపంచ వికారముల ననేకములను కల్పిస్తుంది. మాయకు బ్రహ్మమున కన్న వేరే ఉనికి లేదు. మాయ నశించు స్వభావం కలది. ప్రపంచం రూపంలో కన్పిస్తోంది కాబట్టి లేదని చెప్పలేం. నిజానికి స్వయంగా ఆధారమును వదలితే, దానికి ప్రత్యేకమైన ఉనికి లేదు కాబట్టి ఉందనీ చెప్పలేం. అంటే మాయ సత్తు కాదు. అసత్తు కాదు. అంచేత అనిర్వచనీయం అని చెప్పబడింది. ఒకప్పుడు ఒకవిధంగాను, మరొకపుడు మరోవిధంగాను కనిపిస్తుంది కాబట్టి దీన్ని మాయ అన్నారు. ఇది మోహింప జేస్తుంది/ లేక భ్రమను కలుగజేస్తుంది. ఎలాగంటే అవివేకంవల్ల సత్యమును అసత్యముగాను, అసత్యమును సత్యముగాను భ్రమింప జేస్తుంది. దీనికి తమస్సు / అవిద్య/ అవ్యక్తము / ప్రకృతి / ప్రళయము అని అనేక నామములతో  పిలువ బడుతోంది. 

అద్వైతులు చెప్పే ప్రకృతికి బ్రహ్మమునకన్న భిన్నమైన ఉనికి లేదు. బ్రహ్మము నిష్క్రియుడు/ అకర్త. కర్తృత్వం లేదు కాబట్టి సృష్టిని జరుపలేడు. బ్రహ్మమున్న చోటుననే ఇమిడియున్నమాయను మూల ప్రకృతి  అంటారు. ఈ ప్రకృతి జడము. అంటే చైతన్యము లేనిది. అంచేత మూల ప్రకృతి కూడ సృష్టి చెయ్యలేదు.  మూలప్రకృతి సత్వ రజ స్తమో గుణములతో కలసి ఉండటం చేత త్రిగుణాత్మకము అంటారు.  బ్రహ్మము చైతన్య స్వరూపుడని చెప్పబడింది. బ్రహ్మము యొక్క చైతన్యము తనయందు  ఏకదేశమై యున్న చైతన్యరహితమైన మాయలోనికి వ్యాప్తి చెందినపుడు,  మాయ చైతన్యవంతమై సృజనాత్మకశక్తిని పొంది సకల చరాచర ప్రపంచాన్నీ  సృష్టిస్తోంది.(బ్రహ్మమున్న చోటుననే ఇమిడి యుండుటను ఏకదేశమందు ఉండుట అంటారు).

బ్రహ్మమునందు ఒకభాగముననే మాయ ఆవరించి సృష్టి స్థితి లయములు చేయుచుండగా తక్కిన మూడు భాగములూ స్వయం ప్రకాశములని శృతి చెబుతోంది (వేదాంత పంచదశి 55ద్వితీయ ప్రకరణం). త్రిగుణాత్మకమని చెప్పబడ్డ మూలప్రకృతి లేక మాయయందు, రజస్తమోగుణములు నిద్రాణమై యున్నట్లు భావిస్తే అది సత్వగుణ ప్రధానమై ఉందని చెప్పుకోవచ్చును. అంటే మాయలో ఏవిధమైన చలనమూ లేకుండ సృష్టికి ముందు ఉండేదని తెలుస్తోంది. శుద్ధ సత్వగుణ ప్రధానమైన మాయలోనికి బ్రహ్మచైతన్యం ప్రవేశించి, రజస్తమో గుణాలను చైతన్యవంతం చెయ్యడం వల్ల త్రిగుణాత్మకమైన అవిద్య ఏర్పడుతోంది. అంటే చైతన్యవంతమైన మాయ  సృష్టికార్యం నిర్వహించడానికి సన్నద్ద మైనదని చెప్పుకోవచ్చును.





Friday, December 14, 2012

మాయాస్వరూపము -1



అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు, పరమేశ్వరుడు, శుద్ధ చైతన్యము , జీవ పరమాత్మల భేదము, అవిద్య (మాయ), మాయా చైతన్యాల సంబంధమూ , ఈ ఆరూ అనాదులని చెబుతారు. ప్రపంచంలో సృష్టి , మొదలైనవి పరిశీలిస్తే ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఒక క్రమపద్ధతిలో జరగాలంటే సర్వనియామకుడైన వాడొకడున్నాడని అంగీకరించాలి. అలా కాకుండా, స్వభావంచేతనే సృష్టి జరుగుతోందని అంటే, దాన్లో ఒక పద్ధతీ, నియమమూ ఉండకూడదనేది స్పష్టమవుతుంది. 

నామ రూపాలచేత విడిగా కనిపించే అనేకమంది కర్తలతోను, కర్మఫలాలను అనుభవించే భోక్తలతోను, ఊహించడానికి కూడ శక్యంగాని విధంగా సృష్టి రచనావిధానం తెలియబడుతోంది.  బ్రహ్మసూత్రాల్లో  “జన్మాద్యస్య యతః “ - అంటే ఈ జగత్తుయొక్క జన్మ- స్థితి - ప్రళయములు దేనివల్ల కల్గుతున్నాయో, అది బ్రహ్మము అని చెప్పబడింది. సృష్టి అంటే యిదివరలో లేనిది, ఇప్పుడు కల్పించబడి కన్పించేదని స్థూలంగా అనుకోవచ్చు. “సృష్టికి పూర్వం బ్రహ్మమొక్కటే ఉండెను. మాయలచేత బహురూపమైన బ్రహ్మ ప్రత్యక్షమైనది. దీనికి కారణం ఏదీ లేదు. కార్యం కూడ ఏదీ లేదు. ద్వితీయ వస్తువేదీ లేదు. ఈ ఆత్మయే బ్రహ్మ. సర్వమునూ అనుభవించేది, తెలుసుకొనేదీ” అనే వాక్యాలు   ఛాందోగ్యోపనిషత్తు యందు చెప్పబడ్డాయి.

నిర్గుణుడు , నిర్వికారుడు , నిష్క్రియుడుగాను చెప్పబడ్డ బ్రహ్మమునుండి, ఈ జగత్తు ఎలా ఏర్పడినదనేది విచారించాలి. జీవుడు, పరమేశ్వరుడు, శుద్ధచైతన్యము, అవిద్య (మాయ) , జీవ పరమాత్మల భేదము, మాయా చైతన్యముల సంబంధమూ  అనాదులని చెప్పబడ్డాయి. అంటే ఇవన్నీ ఎప్పుడు మొదలయ్యాయో తెలియ శక్యం కాదు. కల్పాంతంలో జరిగే బ్రహ్మ ప్రళయమందు , సమస్త జీవరాసులూ తమతమ కర్మవాసనలతో ప్రకృతిలో లీనమవుతాయి. అలా తనలో  సమస్తమునూ ఇముడ్చుకొన్న ప్రకృతి; ఈశ్వరుని యందు లీనమవుతుంది. అంటే  ప్రళయమున  సమస్తవిశ్వమూ, అందలి ప్రాణకోట్లు ఈశ్వరునియందు బీజప్రాయంగా  ఉంటాయి. తిరిగి కల్పారంభంలో జీవులు వాటి  వాటి  కర్మానుసారంగా , వాటి వాసనలను బట్టి జన్మలను పొందుతాయి. ఇలా కల్పానికే ఆది/ ఆరంభం ఉన్నది గాని సృష్టికి ఆది లేదని పెద్దలు చెబుతారు.

అవిద్యారూపమైన బీజశక్తిని ‘అవ్యక్తము’ అని అంటారు. అది పరమేశ్వరుడిని ఆశ్రయించి యున్న మాయారూపమైన మహానిద్ర. దీన్లో సంసారులైన జీవులంతా స్వరూపజ్ఞానం లేకుండా నిద్రపోతున్నారు. శాస్త్రాల్లో అంటే భగవద్గీత, భాగవతం, పురాణాలు మొదలైన వాటిలో మాయ  పరతత్వాన్ని ఆచ్ఛాదించి, వాస్తవంలో లేని ప్రపంచాన్ని ఉన్నట్లుగా చూపిస్తుందని చెప్పబడింది. ఉదాహరణకు ఒక ఇంద్రజాలికుడు ఉన్నాడనుకొందాం. అతడు మన కళ్ళముందే ఏవోవో వస్తువులను సృష్టిస్తుంటాడు. ఆ వస్తువులను సృష్టించేశక్తికి ఆశ్రయం ఇంద్రజాలికుడు. చూసే వాళ్లకి ఇంద్రజాలకునిశక్తి అక్కడ ఉండే యదార్ధ స్వరూపాన్ని కప్పివేసి, లేని వస్తువును ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇంద్రజాలకుని శక్తిలాగే, మాయాశక్తి , పరమాత్మలో ఉండే అద్భుతశక్తిగా చెప్పవచ్చును. మాయాశక్తి పరమాత్మ అధీనంలో ఉంటుంది. అంచేత తన యిష్టం వచ్చినట్లు దాన్ని ప్రవర్తింప జేయడం, ఉపసంహరించడం కూడ చెయ్యగలడు. జీవులంతా మాయకు లోబడిన వారే. కాని పరమాత్మ దీనికి అతీతుడు. 

ఈ ప్రపంచమంటే పేర్లు, ఆకారాలు, కర్మలూ మాత్రమే. ఇలా కన్పించే విశ్వానికి  ‘వ్యాకృతము’ అని పేరు. ఈ వ్యాకృతం యొక్క పూర్వావస్థకు అంటే సృష్టి ఏర్పడక మునుపు,  బీజరూపంలో ఉన్న ప్రపంచానికి బీజశక్తి/ అవ్యక్తము/ లేక ప్రకృతి అని మాయకు గల కొన్ని పేర్లు. ప్రకృతియే మాయ అని శ్వేతాశ్వరోపనిషత్తు చెబుతోంది. అయితే జగత్తుకు కారణం మాయ . సృష్టికి పూర్వం మాయ ఎక్కడ ఉందీ అంటే, బ్రహ్మము నందే ఉందని అనుమాన ప్రమాణమున ఊహించాలి. ఈ ఊహకు ఉదాహరణగా మాయావి యొక్క శక్తిని ప్రస్తావించుకున్నాం. ఇప్పడు మరొక ఉదాహరణను పరిశీలిద్దాం. అగ్నిని తాకితే చెయ్యి కాలి బొబ్బలు ఏర్పడతాయి. చెయ్యి కాలడమనే కార్యానికి పూర్వం, కారణమైన దాహకశక్తి ( దహించేశక్తి ) అగ్నియందు ఉందని చెప్పడానికి ఆధారం లేదుకదా! బొబ్బలు ఏర్పడిన తర్వాతే అగ్నికి దహనశక్తి ఉందని తెలుస్తుంది. అగ్నికిగల ఈశక్తి అగ్నికంటే వేరనిగాని, ఆ శక్తియే అగ్ని అనిగాని చెప్పడానికి వీల్లేదు.

అలాగే మాయాశక్తి కూడ బ్రహ్మము నందున్నట్లు ఊహించ వచ్చు. అంటే కార్యమైన జగత్తు గమ్యంగా గలదని ఉద్దేశ్యం. అగ్నియొక్క దాహకశక్తియే అగ్నికానట్లు , మాయకూడ బ్రహ్మము కాజాలదు. అది బ్రహ్మమునకన్న వేరని కూడ చెప్పలేం. మాయాశక్తి కార్యమే జగత్తు. మాయ తనకార్యమైన ఈ జగత్తునకన్న, తనకు ఆధారమైన బ్రహ్మమునకన్ననూ  విలక్షణమైనది. బ్రహ్మము నందు జగత్కల్పన జరిగినపుడు జగత్తునుచూసి మాయ ఇట్టిదని అనుకొంటాం.

శక్తి, శక్తిగలవానికన్న భిన్నముగా ఉండదు. అంటే శక్తి తన ఉనికికోసం మరొక సద్వస్తువు మీద ఆధారపడే ఉంటుంది. కాని సద్వస్తువు తన ఉనికికై శక్తిమీద ఆధారపడవలసిన పనిలేదు. అంచేత శక్తి స్వతంత్రమైనది కాదు. సృష్టికి పూర్వం ఆ శక్తియొక్క కార్యం లేనే లేదు. అంచేత రెండవ సత్తను అంటే సత్పదార్ధమును అనుమానించ లేము. కాబట్టి అద్వయ సత్తయే సత్యమని భావము. ఆ శక్తి బ్రహ్మమునందు అంతటా లేదు. ఒక భాగముననే ఉండి, మిగిలిన మూడు భాగములూ స్వయం ప్రకాశములని శృతి చెబుతోంది. అనగా మాయ బ్రహ్మము యొక్క ఒక అంశమును మాత్రమే ఆవరించి ఉందనేది స్పష్టం. నిజానికి  బ్రహ్మమునందు అంశములు లేకపోయినా,  మిగిలిన మూడు భాగములని చెప్పడం  సృష్టియొక్క అల్పత్వం తెలియజేయడానికే.


Thursday, December 6, 2012

బ్రహ్మము-2

వ్యవహారంలో ప్రపంచంలో ఉండే అన్నివస్తువులూ; దేశము, కాలములచేత పరిమితమవుతాయి. వ్యక్తిగతంగా మానవుడు దేశంతోను, కాలంతోను పరిమితుడు గనుక ; అన్ని కోరికలను, అనుభవాలనూ ఒకేసమయంలో గాక, ఒకదాని తర్వాత మరొకటి మాత్రమే పొందటం సాధ్యమవుతుంది. కాని బ్రహ్మము దేశ కాలాలకు అతీతుడు. అన్ని కాలములూ, అన్ని దేశములూ బ్రహ్మం లోనివే. ఇలా దేశ కాలాలచేత పరిమితం కాదు గనుక బ్రహ్మము అనంతము అని చెప్ప బడింది. బ్రహ్మవిద్యచేత పొందే బ్రహ్మస్వరూపం గురించి, తైత్తిరీయోపనిషత్తు బ్రహ్మానందవల్లి ప్రధమానువాకం నందు “సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ”  అని చెప్పబడింది.

బ్రహ్మము ఏకరసము , అద్వితీయము, వస్తువు కానిది అవ్వడం చేత లక్షణాలను చెప్పలేం. అందుకే శృతిలో  బ్రహ్మము  అవాజ్ఞ్మానసగోచరమని చెబుతూ, అరుంధతీన్యాయంగా జిజ్ఞాసువుకు తెలియజేయడానికి ప్రపంచంలో ఉండే వస్తువుల్లాంటిది కాదంటూనే, సత్యత్వాదిలక్షణాలు  చెప్పబడ్డాయి. ( అరుంధతీ న్యాయమంటే అరుంధతీ నక్షత్రం చూపదలచుకునేవాడు, దాని దగ్గరేఉన్న ఒక పెద్దనక్షత్రాన్ని; అదేఅరుంధతి అనిచూపి, తర్వాత అదికాదు నిజమైన అరుంధతి అనిచెప్పి, నిజమైన అరుంధతిని ఏవిధంగా చూపుతాడో, అలాగే ఈ సత్యత్వాది లక్షణాలు చెప్పబడ్డాయి).

లోకవ్యవహారమంతా కర్త, కర్మ, క్రియల రూపంలోనే జరుగుతోంది.
చూసే వాడు / ద్రష్ట /జ్ఞాత / ప్రమాత,
చూడబడేది / దృశ్యము / జ్ఞేయం / ప్రమేయం,
చూడటం అనే ప్రక్రియ / దర్శనం /జ్ఞానం / ప్రమ. 

లోకవ్యవహారంలో చూసేవాడు, చూడబడేది, చూడటం అనే ప్రక్రియ – అంటే  త్రిపుటి ఉంటుంది.  బ్రహ్మము సర్వవ్యాపకము కాబట్టి, చూసేవానికన్న భిన్నంగా ఉండదు. బ్రహ్మాన్నిగురించిన జ్ఞానం ఉన్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు. అంటే బ్రహ్మముతో తాదాత్మ్యం చెందుతాడు గనుక అపుడిక జీవుడు మిగలడు. అట్టి అనుభూతివల్ల బ్రహ్మమున, త్రిపుటి ఉండదు/ ఉండలేదు.

ప్రపంచంలో ఉండే ప్రతీవస్తువూ 1) ఉండటం, 2) పుట్టడం 3) మరణించడం 4) పెరగటం 5) క్షీణించడం 6) మార్పు చెందటం అనే ఈ ఆరువికారాలకు లోనవుతుంది. కాని బ్రహ్మము ఈ షడ్భావవికారములు లేని శాశ్వతమైన పదార్ధముగా చెప్పబడింది. 

ఒకచోట ఉండి మరొకచోట లేకపోవడం గాని, ఒకప్పుడుండి మరొకప్పుడు లేకపోవడం గాని, ఒక వస్తువునందుండి మరొక వస్తువునందు లేకపోవడమనేది గాని ఉండదు. ఇలా పరిచ్చేదము కానిది గనుక బ్రహ్మము సర్వవ్యాపకము అని చెప్పబడింది.

నాశనము లేనిదగుటచే అవినాశి లేక సత్తు లేక సత్యస్వరూపమనియు,
జడము కానిది గనుక చిత్తు లేక చిద్రూపము లేక చైతన్యమనియు,
అద్వితీయమగుటచే నిరుపమానము అనియు,
మనస్సు లేనిదగుటచే  సంకల్ప వికల్పములు లేనిదనియు,

అవిభాజ్యము, అపరిమితము, అఖండము, సర్వస్వతంత్రము, స్వయం ప్రకాశము  మరియు దుఃఖము లేనిదగుటచే బ్రహ్మము ఆనందమయము అనియు చెప్పబడినది. బ్రహ్మము అనుభూతి చెందేదే గాని సాధించి పొందబడేది కానిదగుటచే అసాధ్యమనియు, బ్రహ్మము ఇట్టిది, అట్టిది అని చెప్పుటకు వీలులేనిదగుటచే అనిర్వచనీయమనియు చెప్పబడినది. ఏకైక సత్యస్వరూపమైన బ్రహ్మమునందు భాగములు లేనందున నామరూపములు లేవు. అట్టి బ్రహ్మము లేక బ్రహ్మజ్ఞానము శుద్ధసత్వ ప్రధానమైన మనస్సు చేతనే పొందబడును. బ్రహ్మమూ ఆత్మా ఒక్కటేనని శృతి చెబుతోంది. ఇలా ఇవన్నీ వివిధ ఉపనిషత్తులు చెబుతూ చివరికి ఏజ్ఞాని బ్రహ్మ స్వరూపము తెలియబడదని భావించు చున్నాడో వాడే దానిని చక్కగా తెలిసిన వాడు . ఎవడు బ్రహ్మ స్వరూపము తెలిసినట్లు భావించు చున్నాడో వాడు బ్రహ్మమును తెలియని వాడని  కేనోపనిషత్తు చెబుతోంది.