Friday, October 26, 2012

కుండలిని - 4


మణిపూరకము

 
దారమున కూర్చబడిన మణివలె ఉండుటచే, దీనికి మణిపూరకమని పేరు. వాయుప్రేరణ కల స్వరూపము కల్గి, నాభి స్థానమున, దశదళములతో నుండు పద్మముగా చెప్పబడినది. దీనియందు  జీవుడు పాప పుణ్యములచేత నియమించ బడ్డవాడై, బ్రహ్మమును తెలుసుకోనంత వరకూ తిరుగుచునే ఉండును. లింగము యొక్క పైభాగమునను, నాభికి క్రిందను పక్షి గ్రుడ్డువంటి ఆకారమున నుండుదాని యందు , డబ్భైరెండు వేల నాడులు పుట్టి, ఇవి ప్రాణ వాహినులై శరీరమంతా వ్యాపించి ఉన్నాయి. పది దళములతో కూడిన మణిపూరకము పసుపు పచ్చని రంగు కలది. అగ్నికి స్థానమగుటచే నేత్ర సంబంధము చెప్పబడినది. నేత్రేంద్రియ సంబంధముచే తెలియబడు రంగులూ, రూపములయిన పొట్టి, పొడుగు, లావు, సన్నము; పుట్టుట, చచ్చుట, క్షీణించుట, వృద్దిచెందుట, సుఖదుఃఖములు, బాల్య యౌవన కౌమార వార్ధక్యములను అవస్థలూ కలిపి దశ విధములైన రూపములని తెలియ నగును. దీనికి అధిపతి లక్ష్మీదేవితో కూడిన విష్ణువు. అగ్ని సంబంధ మగుటచే, ఇచ్చట అగ్ని, భుజించిన సమస్త పదార్ధములనూ జీర్ణము చేయును. చిత్తమునకు స్థానము. ఇచట ఘంటా నాదము వినదగును.
  
శరీర మందలి ద్రవములను , వాటి సాంద్రత, వాటి ప్రసరణలను నిర్వర్తించును. ఉద్రేకావేశములకు పర్యవసానముగా పరితపించుట, దుఃఖించుట , కోపము తెచ్చుకొనుట మున్నగు మార్పులను కల్గించి వానివల్ల పరమాత్మ  జీవునికి మనోవికాసమును కల్గించు చున్నాడు. బాధ, కష్టము అనువాని వల్ల దుఃఖపడుట అను లక్షణమును మనస్సున కల్పించి, దానిని జాలి అను సంస్కారముగా ముద్రించును. ఇలా సంస్కారములేర్పడిన పిదప, సాటివారికట్టి పరిస్థితి కలిగినపుడు తాను పడిన బాధ గుర్తుకు వచ్చి, వాని యందు సానుభూతి , దయ  ఏర్పడును. ఇట్లు ఉత్తమ సంస్కారము లేర్పడు చున్నవి. స్త్రీలయందు మాతృత్వమును చూచి ఆరాధించుట, పూజించుట అనువాటివల్ల కామమను పశులక్షణమును జీవుడు దాటుచున్నాడు. స్వాధిష్టానమందలి శుక్ర తేజస్సు ఊర్ధ్వగతమై మణి పూరకమందు ఆవేశముగా మార్పు చెంది, హృదయ పద్మమునందు ప్రేమగా మేల్కొని, భ్రూమధ్యమందు బుద్దియను మహాతేజస్సుగా ప్రకాశించు చున్నది. నిరంతర ఆలోచనలవల్ల కల్గు మనోవ్యాకులత , సంఘర్షణల నుండి తాత్కాలిక విముక్తి కలిగించుటకు మార్పును కూడ కల్పించుచున్నది. ఈ కేంద్రము  వల్లనే  వాక్కు పుట్టుచున్నది.



ఇది నాభిమూలమున ఉండును. మణిపూరకము యొక్క బీజాక్షరము - రంగ్. పది దళములు కల్గిన పసుపు పచ్చని పద్మం. దాని మధ్య ముక్కుపొడుం/ బ్రౌన్ రంగుతో  తిరగబడినట్లున్న త్రిభుజమూ  దాని మధ్యలో పసుపు పచ్చనిరంగుతో కూడిన ఎర్రనిరంగు గల మంటతో మణిపూరకము ఉంటుందని చెప్పబడినది.



Thursday, October 18, 2012

కుండలిని - 3



కుండలిని - 3


ముందుగా శ్వాసను కొద్దిసేపు గమనిస్తే నెమ్మదవుతుంది. అప్పుడు చక్ర ధ్యానం మొదలు పెట్టాలి. పూర్తిగా గాలి లోపలికి  పీల్చి , గాలిని నెమ్మదిగా బీజాక్షరాన్ని పలుకుతూ వదులుతూండాలి.  ఈ బీజాక్షరాన్ని ఉచ్చారణ చేసే టప్పుడు తుమ్మెద ఝాం కారం చేసినట్లు శబ్దతరంగం (vibration) రావాలని  చెబుతారు. నాలుక వెనుకకు మడతపెట్టి  బీజాక్షరాన్ని చెప్పాలి. ఇక శ్వాస ఉండబట్ట లేకపోతే మళ్ళీ దీర్ఘంగా శ్వాస తీసుకొని ఇదే తంతును మళ్ళీ మళ్ళీ చేస్తూండాలి.  మధ్యలో విరామం తీసుకో కూడదు.

అంచేత ఎంత ఊపిరి పట్ట గలిగితే అంతే అలవాటు చేసుకొంటూ క్రమేపీ పెంచు కోవచ్చు. అలా ఒక్కో చక్రానికి పది లేక పదిహేను పర్యాయాల వరకూ చెయ్య వచ్చు. చక్రధ్యానాన్ని గురుముఖతా నేర్చుకొని చెయ్యాలని చెబుతారు. దీనికి అనువైన స్థలంలో కూర్చోవాలి. ఆసనం స్థిరంగాను, వెన్నెముక నిటారుగాను ఉండాలి. కళ్ళు మూసుకొని పైన చెప్పిన విషయాలను మనస్సులో ఊహించు కొంటూ అంటే పటంలో చూపిన విధంగా నాలుగు దళములు కల్గిన కమలాన్ని , దాన్లో చతురస్రాకారపు స్థలాన్ని , దాన్లో ఎర్రనిత్రిభుజాన్ని, కోణం క్రిందికి  ఉన్నట్లు గాను,ఈ త్రిభుజంలో బూడిద రంగు గల శివలింగం. శివలింగం చుట్టూ మూడున్నర చుట్లు కల్గి పడగ విప్పిన సర్పం ఉన్నట్లూ, బీజాక్షరం చెబుతున్నప్పుడు పాము యొక్క పడగ నెమ్మదిగా పైకి లేస్తున్నట్లుగాను భావించాలి.

స్వాధిష్టానము

సుషున్నూ నాడియందు లింగమునకు క్రింద భాగమున/లింగమూలమున ఉంటుంది. విద్యుల్లతలా ప్రకాశించేదీ, తెల్లనిరంగుతో, అర్ధ చంద్రాకారంలో ఉంటుంది. శుభ్రవర్ణము కలదని చెప్పబడింది. ప్రాణ వాయువునకు ఆధారమగుటచే స్వాధిష్టానమని పిలువబడుతోంది. జలభూత సంబంధమైన ఆరు దళముల పద్మము. జలభూత సంబంధముచే జిహ్వేంద్రియము యొక్క ఆరు రుచులు తెలియబడు తున్నాయి. అవి తీపి, పులుపు, కారము, చేదు, ఉప్పు, వగరు అనే  రస విషయములు స్వాధిష్టానమున తెలియబడు తున్నాయి. సరస్వతీ దేవితో కూడిన బ్రహ్మదేవుడు దీనికి అధిపతి. ఇచ్చట నాదము చిణి చిణి. మూత్ర విసర్జన, శుక్లశోణితముల విసర్జన జలస్థానమున తెలియ నగును. ప్రాణ వాయువునకు స్వస్థానం అవడం చేత ప్రాణమయ కోశానికి ఉపాధి స్థానము.

స్వాధిష్టాన  చక్రము ఆరు దళములు కల్గిన పద్మము. పంచేంద్రియములకు, మనస్సునకు అధిపతిగ  పనిచేస్తుంది. సహస్రారము తప్ప మిగిలిన ఆరు చక్రములకును ఈ కేంద్రమునుండే ప్రాణశక్తి లభిస్తోంది. శరీరమునకు వేడిమిని ఇస్తుంది. తల్లి గర్భమున స్థావరమేర్పడుటకు మూలాధారము కారణముకాగా, పిండమునకు తదుపరి భౌతికముగ వలయు ప్రాణశక్తిని ఇదే ఇస్తోందని అంటారు. స్త్రీ పురుషులలో యౌవ్వనము అంకురించుటకును, వారి భౌతిక దేహములందు మార్పులుకల్గి  శరీర సౌందర్య లావణ్యములు కల్పించి ఒకరిపై ఒకరికి ఆకర్షణను కల్గించుచున్నది. శరీరమునకు విశ్రాంతి వలయునపుడు ఇందలి శక్తియే నిద్రను కల్పించు చున్నది.





దీనికి "వం" అను బీజాక్షరమును ధ్యానించుచు, దీని రూపమును చింతించు వానికి అహంకార, ఆవేశములు ఉద్రేకము పోవును. భావనలు, కల్పనలు పుట్టి కావ్యములల్లుట మొదలగు ప్రవృత్తులు మేల్కొనును. 
స్వాధిష్టానం బీజాక్షరం - వంగ్.  ఆరు దళములు కల్గిన నారింజపండు రంగు/సిందూర వర్ణము గల పద్మము. దాని మధ్య తెల్లని ఆకాశం. దాని అంచున నీలిరంగు రింగ్ ఉంటుంది. బీజాక్షరాన్ని ఉచ్చరించే టపుడు మూలాధారానికి చెప్పినట్లే ఝంకారము, సమయము మొదలైనవి గుర్తుంచుకోవాలి.