Friday, October 4, 2013

జ్ఞానయోగము- సాధన (10)


ఇక మూడవ దశలో శ్రవణ మనన నిదిధ్యాసనలనే అంగములు ఉన్నాయి.  
అన్నిటినీ వదలటమే సన్యాసం. ఇలా సాధనచతుష్టయం తర్వాత సన్యాస స్వీకారం ఉంటుంది. జీవన్ముక్తి లభించేదాకా సాధకుడు ముముక్షువుగానే చెప్పబడతాడు. గురువుపట్ల శరణాగతి ఉండాలి. అప్పుడే తన ప్రయత్నంతో బాటు గుర్వనుగ్రహం తోడై సాధనలో పురోగతి చెందుతాడు. శాస్త్రజ్ఞానంతో అనుభవజ్ఞానమూ కలుగుతుంది. వైరాగ్యము, ముముక్షుత తీవ్రంగా లేకపోతే ఆత్మ తన రూపాన్ని చూపదు. ఈ దశలో మనస్సు ప్రశాంత స్థితిలో ఉన్నా, అది భ్రాంతి అనే అనుకోవాలి. సాధనలో ముముక్షుత, వైరాగ్యమూ తీవ్రతరం చేస్తే మనస్సు నియమించబడి, ఉన్నత స్థితిని చేరుకో గల్గుతాడు.

ఈ సందర్భంలో శ్రవణ మననాలను గాకుండా శంకరులు భక్తి ప్రస్తావన తెస్తారు. జ్ఞానమార్గంలో అడుగు పెట్టడానికి ముందు మనస్సు ఏకాగ్రమవ్వడానికి నిష్కామ కర్మ , భక్తి చెప్పబడ్డాయి. అవి  పరోక్షంగా ఉపకరించే బాహ్యాంగ సాధనాలని చెబుతారు. సాధకుడికి ముందునుంచీ భక్తి ఉంటుంది. ఇలా సాధనచతుష్టయం అభ్యసించాకా సన్యాసము, మహావాక్యోపదేశము అవుతాయి. శ్రవణ మనన నిదిధ్యాసనాలతో మార్గం పూర్తవుతుంది. ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కారము,  జీవన్ముక్త స్థితీ ఉంటాయి. బ్రహ్మ సాక్షాత్కారం కలిగేదాకా సాధకుడు ముముక్షువే.

ఇలా మొదటిదశలో – కర్మయోగంద్వారా చిత్తశుద్ధి, భక్తియోగంతో మనస్సు ఏకాగ్రతను పొందడమనేవి జ్ఞానయోగంలో ప్రాధమికాలు. అప్పుడు ఆత్మవిచారణకు పూనుకునే అర్హత వస్తుంది.

రెండవ దశలో – సాధనచతుష్టయం సాధించాలి. దీనివల్ల దుష్టవాసనలు చాలామట్టుకు పెకలించ బడుతాయి.

మూడవ దశలో – సన్యాస స్వీకారము, ఉపదేశము, శ్రవణ మనన నిదిధ్యాసనలు ఉంటాయి. ( విద్యా గురువు వేరు, దీక్షాగురువు వేరుగాను ఉండవచ్చు. లేదా పూర్వాశ్రమంలో గురువే దీక్షాగురువు కావచ్చు).

చివరిదశలో – ఆత్మసాధన. దీన్లో కర్మపరిత్యాగము, బ్రహ్మవిచారణ, ఆత్మసాక్షాత్కారము ఉంటాయి.
క్రింది స్థాయిలో ఏ యోగాన్ని అభ్యసించేవానికైనా భక్తి అవుసరమే. ఈశ్వరుడిపై భక్తినిచూపే భక్తుడే, అంటే క్రింది స్థాయిలో ఉండే భక్తుడే కర్మఫలాలను ధారపోయ్యాలి. అద్వైతజ్ఞానం అందరికీ ఉండాల్సిందే ఐనా అద్వైత సాధన మాత్రం జ్ఞానులకనే చెప్పబడింది.




Thursday, September 26, 2013

జ్ఞానయోగము- సాధన (9)


ముముక్షుత్వం-2


ముక్తి  దేన్నిచేరుకోవాలో అనేదాన్ని గాక, విడచిపెట్టడాన్నిమాత్రం సూచిస్తుంది. లోకాయత దర్శనం తప్ప తక్కినవన్నీ సంసారం నుండి ఎలా విముక్తిని పొందాలనేదే వివరిస్తాయి. బౌద్ధం శూన్యం గురించి, న్యాయశాస్త్రం అపవర్గం గురించీ చెబుతాయి. అంటే దుఃఖరహిత స్థితినే గాని బ్రహ్మానందాన్ని కాదు. సాంఖ్యులు చెప్పే కైవల్యం అనేదీ, ప్రకృతినుండి, మాయాప్రపంచం నుండీ విముక్తేగాని ఆనందస్థితిని గురించి చెప్పలేదు. పతంజలి యోగసూత్రాలలో చిత్తవృత్తులను నిరోధిస్తే సంసారం నుంచి విముక్తి అనే చెప్పడం జరిగింది. ఐతే వేదాంతంలో మోక్షమంటే బ్రహ్మానుభవమే. జీవుడే బ్రహ్మము. దీన్లో సాధన అంతా మాయాబంధాన్ని త్రెంచుకోవడమే. అది తొలగ గానే, ఎప్పుడూ ఉండే సహజమైన ఆనందస్థితిలో ఉంటాడన్నమాట.

ఈ దశదాకా వచ్చిన సాధకుడి మనస్సు చలించకుండా ఉండాలి. మనస్సు చలిస్తే పెద్ద అపరాధం చేసినట్లవుతుంది. తనంత తాను సరిదిద్దుకోనూ లేడు, సమర్ధించుకోనూ లేడు. అంచేత స్వప్రయత్నంతో బాటు గురుకటాక్షం ఉండాలి. శ్రద్ధ సమాధానాల గురించి చెప్పేటప్పుడు బుద్ధితో కలిపారు. ప్రస్తుతం ముముక్షుత్వం ప్రస్తావించేప్పుడు శంకరులు మనస్సుతో కలిపారు. మనస్సు లేదని భావించే దశకు వచ్చేవరకూ; మనసు మంచి విషయాలనే గాక, చెడు విషయాలనూ అనుభవిస్తుంటుంది. అంచేత ముముక్షువు చెడు నుంచి మనస్సును మరల్చాలి. ఎపుడైతే మనస్సు లేదని భావించే దశకు చేరుకుంటాడో, అంటే మనస్సు పూర్తిగా లయమైనప్పుడు ఇక మంచినీ త్యజించ గలగాలి. అంటే మంచీ చెడులను గ్రహించే మనస్సును ఆత్మలో లీనం చెయ్యాలి. ఇంకో విధంగా చెప్పాలంటే మంచీచెడులను ఆలోచించకు.

కర్మలను చేయించడానికి, వాటి ఫలాలను అనుభవింప చేయించేదీ మనస్సే. అవిద్య కూడా మనస్సు పరిధిలో ఉండేదే. అందుకే మనస్సును విడిచిపెట్టాలి. విడిచే ముందు దాన్లో దట్టంగా ఉన్న వాసనలను శుభ్రంచేసి, తెలికయ్యేలా చెయ్యాలి. ముముక్షుత తీవ్రంగా లేకపోయినా, గురువు అనుగ్రహం లేకపోయినా ఆత్మను తెలుసుకోలేరని చెబుతారు. ఇక్కడ గుర్వనుగ్రహం అంటే భగవదనుగ్రహమే. ఈశ్వరుడే గురురూపంలో వచ్చాడని శిష్యుడు భావించాలి. అద్వైత సాధనలో ఉపాసనకు బదులు జ్ఞానాన్వేషణ మాత్రమే ఉంటుంది. ఇంత పరిపక్వ దశకు చేరినా ఇంకా తనకు అర్హత లేదేమో అనే భావనలు కలుగుతుంటాయి. అట్టి భావాలను గట్టి ప్రయత్నంతో గెంటి వేస్తూ, నాకు గుర్వనుగ్రహం ఉంది గనుక  నాఆశయాన్ని నేరవేర్చుకుంటా ననే నిశ్చయానికి వస్తాడు. ఇలా ముముక్షుత్వంతో సాధన చతుష్టయం పూర్తయింది. 





Thursday, September 19, 2013

జ్ఞానయోగము- సాధన (8)

ముముక్షుత్వం 

సాధనచతుష్టయంలో మూడు అంగాల వివరణ పూర్తయ్యింది. ఇప్పుడు ముముక్షుత్వం.
ముముక్షుత్వం అంటే మోక్షంమీద ఆపేక్ష ఉండటం అని యిదివరలో చెప్పుకున్నాం. అసలు మోక్షం మీద ఆపేక్ష ఉండబట్టే ఇంతదాకా సాధన చెయ్యడం జరిగింది కదా! ఇక్కడ దీనిగురించి ఎందుకు చెప్పబడింది అంటే, మోక్షం మీద తీవ్రమైన కోరిక ఉండటం అన్నమాట. తీవ్రమైన కోరిక అంటే, మోక్షం కోసం ఎంతటి కఠినప్రయత్నమైనా చెయ్యడానికి సిద్ధపడిన స్థితినిగురించి ఇక్కడ చెప్పబడింది. తీవ్రమైన కోరికతోను, మనోవేదనతోనూ ఉండే ముముక్షుత్వం. దుఃఖాలు కల్గినప్పుడు తాత్కాలికంగా వైరాగ్యం కలగవచ్చు. ఐతే సుఖాలు కల్గినప్పుడు ఇవి మాయావికారాలనే  దృఢ బుధ్ధి కలిగి అచంచల విశ్వాసంతో సంసారం నుండి బయట పడాలని గురువు సమక్షంలోనో , దైవసన్నిధిలోనో చేసే ఆక్రందన అన్నమాట. 
   
మనోవేదన దేనికీ అంటే, జననమరణాలనే సంసారబంధంలో చిక్కుకున్నట్లు తెలుసుకున్నాడు గనుక దాన్నుండి   బయటపడాలనే తీవ్రమైన కోరిక. అంతేగాని చిన్న చిన్న చిరాకులవల్ల కలిగిన ఆక్రందనవల్ల కాదు. దీన్లో సంసారబంధం నుండి విముక్తి కలిగితే చాలదు. బంధవిముక్తి కలిగాకా జీవుడు కేవలం జడునిగా ఉండకూడదు. స్వస్వరూప అవబోధం కావాలి. అంటే సాక్షాత్కారం / ఆ జ్ఞానంయొక్క ఎరుక కలిగి ఉండాలి. తనను తాను గుర్తించడానికే బంధంనుంచి దూరంకావాలనే కోరిక. మోక్షమనే పదం దేన్ని విడిచిపెట్టాలో సూచిస్తుందే గాని దేన్ని చేరుకోవాలో అనేదాన్ని కాదు. వేదాంతంలో మోక్షం పొందటమంటే  బ్రహ్మానుభవమే. అంటే ఉన్నదాన్ని తెలిసికోవడమే. కొత్తగా సచ్చిదానంద స్థితి రావడం కాదు. జీవుడే బ్రహ్మము. కాని మాయావరణం వల్ల బంధితుడై ఉన్నాడు. అంచేత సాధనలో మాయాబంధాన్ని త్రెంపుకుంటే తన సహజానంద స్థితిలో ఉంటాడన్నమాట.        

అజ్ఞానమే మాయ. ఈ శరీరమే నేను అనుకోవడం మాయాకార్యం. దీనివల్ల అహంకారం ఏర్పడి, తాను పరమాత్మ కన్న భిన్నుడనని జీవుడు భావిస్తాడు. ముందు సూక్ష్మరూపంలో ఉండే ఆహంకారం దేహమంతా వ్యాపించి  శరీరమే తాననే భావన ఏర్పడి, జీవుడు బద్ధుడవుతున్నాడు. విముక్తి యొక్క లక్ష్యం స్వస్వరూపావబోధం. అవబోధం అంటే మేల్కొనడం. అంటే అజ్ఞానమనే చీకటినుండి జ్ఞానోదయం అవ్వడమే ఇక్కడ మేల్కొన్న స్థితి అని చెప్పబడింది. ఈ జ్ఞానం స్వస్వరూపం గురించి. అదే తన సహజానందస్థితి. ఆత్మయే జ్ఞానం కాబట్టి ఆత్మజ్ఞానం 
అన్నమాట. అదే ఎరుక కలిగి ఉండటం అంటే. అట్టి ఎరుకయే ఆత్మ. అజ్ఞానం నుంచి మేల్కోగా, కలిగే జ్ఞానం యొక్క ఎరుకకై  ఉండే తపనయే ముముక్షుత్వ మని చెప్పబడింది. అంటే అజ్ఞానమనే చీకటి తొలగగా తన సహజస్థితిలో ప్రకాశించి ఉండటాన్ని మేల్కొన్న స్థితిగా చెప్పవచ్చు. అలాంటి స్వయంప్రకాశమైన స్వస్వరూపము యొక్క ఎరుకయే ఆత్మ.
 
అదే జీవాత్మ పరమాత్మల అభేదతను గుర్తించడం. అదే ఆత్మసాక్షాత్కారం. అదే నిత్యమైన ఎరుక అన్నా, సస్వరూపాన్ని ఎరుగుట అన్నా రెండూ ఒక్కటే. బంధవిముక్తీ, ఆత్మ సాక్షాత్కారమూ ఒకేసారి జరుగుతాయి. కాబట్టి ఆత్మ జ్యోతిని చూడటమే వేదాంతం యొక్క లక్ష్యం. అట్టి స్వీయానుభవం వల్ల మాయాబంధం తొలగినట్లు గ్రహిస్తారు. ఆత్మాన్వేషణలో మునిగినవారు , వారికి తటాలున ఆత్మదీప్తి కలిగినట్లు చెబుతారు. అందుకే అద్వైతసాధకుడు చివరి దశలో జీవ బ్రహ్మముల ఐక్యతను వివరించే మహావాక్యాలపై దృష్టిని పెడతాడు. ఆ అనుభవం వల్ల మాయబంధం తొలగినట్లు భావిస్తాడు. అందుకే ముముక్షుదశలో సాధకుడు బంధం నుంచి విముక్తి కోరుతాడు. అది దాటి తత్వజ్ఞానం కల్గినప్పుడు తన అసలైన సస్వరూపం తెలుసుకోవడం వల్ల బంధవిముక్తి పొందినట్లే. అంటే పొందినట్లు భావిస్తాడు.