Wednesday, December 25, 2013

జ్ఞానయోగము- సాధన (21)


నిదిధ్యాసన

తొట్రుపడకుండా శ్రద్ధాభక్తులతో సాధన కొనసాగించాలి. శ్రవణ మననాలచేత నిస్సందేహంగా దృఢపడిన అర్ధంపై మనస్సును స్థాపించడాన్ని నిదిధ్యాసనం అంటారు. తత్వం తెలుసుకునే మార్గానికి , శృతి- శ్రవణానికి,
యుక్తి - మననానికీ , అనుభవం - నిదిధ్యాసనకూ ప్రమాణాలని చెబుతారు. సాధనలో గమ్యం చేరడానికి కర్మవాసనలు పూర్తిగా నశించాలి. అవి బలీయంగా ఉంటే సాధనకు ఆటంకం ఏర్పడుతుంది. 

ఇంతకాలం నుండి సాధన చేస్తున్నా, లక్ష్యం చేరుకోగలనా లేదా అని భావన కలగడాన్ని సంశయం లేదా అసంభావన అనబడుతుంది. ఈ ఆటంకం వల్ల అద్వైతసిద్దిమీదే సందేహాన్ని కల్గించి, లక్ష్యం చేరలేనేమో అని, ద్వైతమే సత్యమేమో అనే భావనను కలిగించి, తాను బ్రహ్మమునకన్న భిన్నుడనని అనుకునే విపరీతభావన రెండో ఆటంకంగా ఏర్పడుతుంది. అసంభావన తొలగడానికి మననము, విపరీతభావన తొలగడానికి నిదిధ్యాసనమూ చేస్తూండాలి. వేదాంత వాక్యాలను నిరంతరం మననం చెయ్యడం వల్ల బ్రహ్మ సాక్షాత్కారానికి మార్గం సుగమమవుతుంది. నిదిధ్యాసనం నిరంతరం కొనసాగించడం వల్ల విపరీతభావన తొలగుతుంది.






No comments:

Post a Comment