Thursday, January 17, 2013

మాయాస్వరూపము – 6


ఉపాదానము మూడు విధములు. అవి వివర్తము, పరిణామము , ఆరంభకము.  వీటిలో పరిణామము, ఆరంభకములకు భాగములు ఆవశ్యకం అవుతాయి. అంచేత బ్రహ్మమునకవి అన్వయించవు.

ఆరంభక ఉపాదానకారణ మంటే :- కార్యమునకన్న భిన్నంగా ఉండేది. అంటే ఒక పదార్ధం నుంచి మరోపదార్ధం ఉత్పత్తి అవ్వడం. ఉదాహరణకు- నూలు పోగులనుంచి వస్త్రం తయారవ్వడం వంటిది.

పరిణామ ఉపాదానకారణం :- కారణం యొక్క మరొక స్థితి , కార్యరూపంగా ఉండటం. అంటే కారణం ఒక అవస్థ నుంచి మరొక అవస్థను పొంది కార్యం అవడాన్ని పరిణామము అంటారు.

ఉదాహరణలు –
పాలు పెరుగుగా మారడం  – దీన్లో పూర్వ రూపం నశిస్తుంది. పాలు పెరుగుగా పరిణామం చెందినపుడు ఆధారమైన పాలు ఇక లభించవు.
మట్టి రూపాంతరం చెంది కుండ అవ్వడం, బంగారం ఉంగరం అవ్వడం.  వీటిలో మట్టికుండ, స్వర్ణపు ఉంగరము లందలి  మట్టి, స్వర్ణము నశింపక కావల్సినపుడు లభిస్తాయి. అంటే ఆధారము నశించదు.  కుండ పగిలినపుడు మట్టి కన్పించదు కాని పెంకులు కన్పిస్తాయి. పెంకుల పొడిలో మట్టి ఉంటుంది. ఇది బంగారం విషయంలో స్పష్టంగా కన్పిస్తుంది. బంగారపు ఉంగరం విరిగినా, కరిగినా బంగారమే మిగులుతుంది.
పాలు పెరుగుగా మారినపుడు, పరిణామం చెందటంవల్ల తిరిగి పూర్వరూపాన్ని పొందలేవు. కాని మట్టి మొదలగు వానియందు పరిణామము, వివర్తము కూడ ఉంటాయి.

వివర్త ఉపాదానకారణం అంటే :- కార్యం కారణానికన్నా భిన్నం కాకపోయినా భిన్నంగా కన్పించడం. ఇక్కడ నిజంగా అవస్థలో మార్పు లేకపోయినా ఉన్నట్లుగా భాసించడాన్ని వివర్తము అంటారు. ఉదాహరణకు - త్రాడు పాముగా  కనిపించడం వంటిది.
కనుక అంశములు లేని బ్రహ్మమునందు జగత్తు వివర్తమని చెప్పబడినది. ఇంద్రజాలకుని శక్తివలె ఆ వివర్తమును కల్పించేది మాయాశక్తి. శక్తి శక్తిగలవాని కన్న భిన్నంగా శక్తి లేదు. అంటే శక్తీ, శక్తిమంతుడూ కలిసే ఉంటాయి. అయినా శక్తీ, శక్తిమంతుడూ ఒక్కటి కాదు. అలాగే మాయ భిన్నము, అభిన్నమూ కూడ కానిదగుటచే అనిర్వచనీయమని ప్రతిపాదించ బడినది. 

కార్యమైన కుండ ఏర్పడటానికి పూర్వం ఆశక్తి మట్టియందు నిగూఢమై ఉండేది. కుమ్మరి  కట్టె , చక్రము మొదలైన వాటి సహాయంతో మట్టియే ‘కుండ’ అనే వికారము చెందినది. మట్టినుండి వియోగము కల్గితే అది కన్పించదు  గనుక ఆకుండ మట్టికన్న భిన్నముకాదు . కాని అభిన్నముకూడ కాదు. ఏలననగ  మట్టిముద్ద దశలో  కుండ కన్పించదు గనుక. మట్టిపై పనిచేసి కుండను చేయు శక్తి,  కార్యముకన్నను, ఆశ్రయమగు మట్టికన్నను భిన్నము. గనుక ఆశక్తిని అచింత్యము, అనిర్వచనీయము అని చెప్పబడినది. అందుచేత శక్తిచే కల్పించబడిన ఘటము , దానిని కల్పించు శక్తివలెనే అనిర్వచనీయము. కార్యము వ్యక్తమైనపుడు ఆశక్తికి ఘటమని పేరు. కార్యము వ్యక్తము కానపుడు శక్తి అని అంటాం. ఇలా మాయామయములవడంచేత వికారములన్నీ మిధ్య అనీ , వికారములకు ఆధారమైన మట్టివంటి వస్తువు మాత్రమే  సత్యమని శృతి చెబుతోంది. ( చాన్దోగ్యోపనిషత్తు 6.1.4).

వ్యక్తము, అవ్యక్తము అనేవి పూర్వ, పర కాలభేదం వల్ల మారుతుంటాయి. కాని ఆధారం అనేది సర్వకాలాల్లోనూ ఉంటుంది కాబట్టి అదే సత్యము. మట్టి దాని కార్యం వ్యక్తమవ్వడానికి పూర్వము , తర్వాత కూడ ఒకేరూపముగా ఉంటుంది. దానికి తత్వం ఉండటంవల్ల, నాశనం లేకపోవడం వల్ల అది సత్యమైన వస్తువని చెప్పబడుతుంది.




3 comments:

  1. చక్కటి విషయములను తెలియజేసారు.

    ReplyDelete
  2. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
    సూర్యచంద్ర గోళ్ల.

    ReplyDelete