Thursday, February 7, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-2



మనస్సు  పనిచేసే విధానము.

మనస్సంటే ఆలోచనల సమూహము. అపంచీకృత పంచమహాభూతముల సత్వాంశములైదూ కలసి మనస్సు / అంతఃకరణం ఏర్పడింది. అంటే ఇది సత్వగుణం ఉండే తత్వం. ఇది జడమైనది. తెలివిలేనిదైనా అధిష్టానమైన బ్రహ్మమునుండి ప్రకాశాన్ని పొంది తెలివిగలదానిలా ప్రవర్తిస్తుంటుంది. మనస్సు ఆత్మ కాదు. పరిచ్చిన్నమయ్యేది. నాశనం చెందే స్వభావం గలది. అంటే బ్రహ్మముయొక్క క్రియాశక్తిచే ఏర్పడిన సూక్ష్మమైన పదార్ధంగా చెప్పవచ్చు. బ్రహ్మమే దీనికి ఆధారం. సూక్ష్మశరీరంలో మనస్సు ఒక భాగము. ప్రాణము సూక్ష్మశరీరాన్ని స్థూలశరీరంతో కలుపుతుంది. అంటే మనస్సు,ప్రాణము ఒకదాంతో మరొకటి సంబంధపడి ఉంటాయి. మనస్సును విడిచి ప్రాణానికీ, ప్రాణాన్ని విడిచి మనస్సుకూ మనుగడ లేదని చెప్పబడింది. మనస్సు ప్రాణానికన్న సూక్ష్మమైనది. మరణంలో భౌతికశరీరాన్ని వదలి పోయేది సూక్ష్మశరీరమే. ఈ సూక్ష్మశరీరమే జననమరణాలనే సంసార చక్రంలో తిరుగుతూ ఉండేది. సూక్ష్మశరీరం/ లింగశరీరం జ్ఞానేంద్రియాలైదు, కర్మెంద్రియాలైదు, పంచప్రాణాలైదు, మనస్సు, బుధ్ధి అనే రెండిటినే తీసుకున్నపుడు మొత్తం పదిహేడు తత్వాలతో ఏర్పడుతుంది. అదే మనస్సు బుధ్ధి ఆనే రెండిటికి బదులుగా  అంతఃకరణ చతుష్టయాన్ని తీసుకున్నపుడు మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారము అనే నాల్గిటినీ కలిపితే పందొమ్మిది తత్వాలతో సూక్ష్మశరీరం ఏర్పడుతుంది.

ఆత్మయొక్క చైతన్యం వల్లే మనస్సు పనిచేస్తోంది. ఛాందోగ్యోపనిషత్తులో మనస్సు ఆహారంయొక్క సూక్ష్మభాగంచేత ఏర్పడుతుందని చెప్పబడింది. కొన్నిరోజులు ఆహారం తీసుకోకపోతే మనస్సు సరిగా పనిచెయ్యదు, ఆలోచించలేదు కూడ. మనం భుజించే ఆహారం మనస్సును ప్రభావితం చేస్తుంది. దీన్నిబట్టి మనస్సు సాత్వికమని, రాజసికమని, తామసికమని ఆయాగుణ వివేకాన్ని కలిగి ఉంటుంది. మాయలాగే మనస్సూ నిగూఢమైనది. న్యాయదర్శనంలో మనస్సు అణుపరిమాణం గలదని చెప్పబడింది. పతంజలి యోగదర్శనంలో శరీరమంత పరిమాణం కలిగి ఉంటుందని చెప్పబడింది. శరీరమంతా వ్యాపించియున్నా మనస్సు గాఢనిద్ర(సుషుప్త్యావస్థ)లో హృదయకమలమునందును,స్వప్నావస్థలోకంఠమునందు, జాగ్రదావస్థలో భ్రూమధ్యమందు(ఆజ్ఞా చక్రము)/ లేక కుడి కంటియందు ఉంటుందని చెబుతారు.

శరీరంలో ఉంటూనే త్రుటికాలంలో బయటకుపోయి మనస్సు విషయాకృతిని దాల్చుతుంది. మనస్సుకు ఆసక్తి ఉంటేనే అలా విషయాలవేపుకు వెళుతుంది. ఆసక్తి లేకపోతే ఎన్నో విషయాలు మనకు చేరువలోనే ఉన్నా మన మనస్సు ఎటో పోవడాన్ని అనేక పర్యాయాలు గమనించే ఉంటాం. అలా బయటకుపోయి విషయాకృతిని దాల్చి మనలోపలికి తెచ్చే విషయం తెలియాలంటే అంతరింద్రియాలు కూడ సవ్యంగా పనిచేస్తుండాలి. ప్రాణం యొక్క చైతన్యశక్తి వల్లనే మనస్సు బయటకు, లోపలికి తిరుగాడుతూ ఉంటుంది. ఇలా మనస్సుకు ఇంద్రియాలతో కలసి వ్యవహరించడమే ముఖ్యమైన పని. జ్ఞానేంద్రియాలతో సేకరించిన విషయాలను బుద్ధికి నివేదిస్తుంది. ఆ విషయాన్ని బుధ్ధి నిశ్చయించి ఇదీవిషయం అనే నిశ్చయాన్ని కలిగిస్తుంది. ప్రకృతితత్వాలతో ఏర్పడిన బుధ్ధికూడ జడమే. ఇదికూడా మనస్సులాగే చైతన్యాన్ని ఆత్మనుంచే పొందుతుంటుంది. అంచేత అన్నిటికీ అధిష్టానమైన ఆత్మయే వీటిని చూసే/గ్రహించే సాక్షిచైతన్యం. విషయాన్ని గ్రహించి, దానికి తగిన ఎలాంటి చర్యచెయ్యాలో బుధ్ధినిర్ణయించిన దాన్ని మనస్సు కర్మేంద్రియాలద్వారా నిర్వహించేటట్లుగా చేయిస్తుంది. అంటే మనస్సు విషయాలను గ్రహించడానికి జ్ఞానేంద్రియాలతోను, విషయాలను నిశ్చయింప జేయడానికి బుద్దితోను, బుధ్ధి నిశ్చయించిన విషయాన్ని అమలుపరచడానికి కర్మేంద్రియాలతోను సంబంధపడి ఉంటుంది. 

ఇలా బ్రహ్మము/ ఆత్మయొక్క చైతన్యశక్తి వ్యాప్తిచేత మనస్సు చైతన్యవంతమై, స్థూలదేహమందలి ఇంద్రియములతో కలసి ఈ జగత్తులోని సమస్త వ్యాపారములూ కొనసాగుతున్నాయి. ఆత్మను సంస్థకు అధిపతిగా పోలిస్తే, బుధ్ధి ఆ సంస్థకు కార్యనిర్వాహకుడు/ మేనేజరుగాను,మనస్సును ముఖ్య గుమస్తాగాను/ హెడ్ క్లార్క్ గాను చెప్పుకోవచ్చు. ఈ ముఖ్యగుమస్తా అనే మనస్సు మేనేజరుజారీచేసే ఆజ్ఞలను పాటించడం, పనివారిచేత పనిచేయించడం అనే రెండు విధాలైన పనులుంటాయి. కర్మేంద్రియాలే పనివాళ్ళు. మాటకన్న మనస్సు అంతర్గతమైతే మనస్సుకన్న బుధ్ధి, బుధ్ధి కన్న అహంకారము, అహంకారమున కన్నఅభాస /జీవచైతన్యము (reflected intelligence) అంతర్గతంగా ఉంటాయి. జీవచైతన్యానికన్న ఆత్మ/కూటస్థము అంతర్గతం. ఆత్మను దాటి ఇంకేమీ లేదు. 





No comments:

Post a Comment