Thursday, February 21, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-4

మనస్సులో అనేక వాసనలు నిక్షిప్తమై ఉంటాయి. అవి మనం చేసే కర్మలవల్ల ఏర్పడతాయి. అజ్ఞాన స్వరూపమైన కారణశరీరమే వీటికి మూలం. ఒక కర్మ చెయ్యడానికి పూర్వం అది ఆలోచనారూపంగా ఉంటుంది. ఆలోచన కలగడానికి ముందది బీజరూపంగా అంటే కోరికగా/ వాసనగా మనస్సులో దాగి ఉంటుంది. ఇలా బీజరూపంలో ఉండే వాసన/ కోర్కె ఆలోచనగా మారి క్రియారూపాన్ని పొందుతుంది. మనకు అనేకమైన కోర్కెలు కలుగుతుండటం తెలిసిన విషయమే. ఐతే ఆ కోరికలలో కొన్ని తీరవచ్చును, మరికొన్ని తీరక పోవచ్చును. కోరిక తీరితే ఆ విషయం మీద ఆసక్తి నశిస్తుంది. కొన్ని కోర్కెలు తీరవు, లేదా ఉన్నకోర్కె తీరినా ఇంకా ఆశ చావదు. ఉదాహరణకు కామం అనే తృష్ణ. అలా తీరని కోరికలు, ఆలోచనలు మనస్సు మీద ఒక చిహ్నాన్ని ఏర్పరచి వాసనా రూపంలో కారణశరీరంలో ఉంచబడతాయి. వాసనలే ఒకవ్యక్తి మరణానంతరం భౌతికశరీరం పంచభూతాల్లో కలసిపోయినా వాసనలు మాత్రం బీజరూపంలో కారణశరీరపు అవిద్యావరణంలో నిలిచి ఉంటాయి. తగిన అనుకూల పరిస్థితులు కలిగినప్పుడు అవి మనస్సులోనికి వ్యాపించి ఆలోచనా రూపాన్ని పొంది కార్యాచరణకు ప్రేరేపించుతాయి. అపుడు కర్మ చెయ్యబడుతుంది.

కారణశరీరమంటే ఆత్మ చుట్టూ ఆవరించి ఉండే త్రిగుణాత్మకమైన అవిద్యాకవచం. ఆవరణమంటే ఉన్నవస్తువును లేదనుకునేటట్లు చెయ్యడం. విక్షేపశక్తి అంటే లేనివస్తువును ఉన్నట్లుగా కల్పించడం. మనస్సు సత్వాంశములతో ఏర్పడినదని యిదివరలో చెప్పుకున్నాం. అంటే స్వతఃగా పరిశుద్ధమైనది. మనస్సులోనికి  ఒక ఆలోచన రాగానే కారణశరీరం యొక్క విక్షేపశక్తివల్ల మంచి గుణములైన దయ ప్రేమ అనురాగము భక్తి అనేవాటితో గాని, చెడ్డ గుణములైన స్వార్ధము అసూయ ద్వేషము కోపము కామము అనేవాటితో గాని కూడి ఆ ఆలోచన మలినమై క్రియారూపాన్ని దాల్చేప్పుడు మంచి భావనతోగాని చెడ్డ భావనతోగాని కర్మ ఆచరించబడుతుంది. 

మనంచేసే ప్రతీ పనికీ ఫలితం ఉండితీరుతుందని కర్మ- బంధము అనే భాగంలో చెప్పుకున్నాం. అంచేత మనం చేసే కర్మకు ఆయాభావాలను అనుసరించి ఫలితాలు ఉంటాయి. చేసే కర్మలకు అహంకారం జోడించబడి నేను చేస్తున్నాననే భావంతో చెయ్యడం వల్ల ఆ కర్మల ఫలితాన్ని చేసినవాడే అనుభవించాలి. ఇలా మనం ఎన్నో కర్మలను చేస్తున్నాం కాబట్టి వాటి ఫలితాలను అనుభవించడానికి ఈ జన్మ చాలదు. అందుకే ఈ స్థూలశరీరం నశించాక జీవుడు మరొక శరీరం పొంది/ మరొక జన్మనెత్తి వాటిని అనుభవించవలసి వస్తోంది. ఇలా కర్మలుచేస్తూ, జన్మలెత్తుతూ సంసారంలో సుఖదుఃఖాలను జీవుడు పొందుతుంటాడు. అనేక జన్మల నుండి వచ్చే కర్మలను సంచితములని, ఈ జన్మలో మనకు అనుభవానికి వచ్చేవి ప్రారబ్దకర్మలని, ఇప్పుడీజన్మలో క్రొత్తగా చేసే కర్మలు ఆగామి కర్మలని చెబుతారు.

వాసనలే ఒకవ్యక్తి మరణానంతరం అతడికి కలిగే గతిని నిర్ణయించే అద్భుతశక్తి. మరణానంతరం భౌతికశరీరం పంచభూతాల్లో కలసిపోయినా వాసనలు మాత్రం బీజరూపంలో కారణశరీరపు అవిద్యావరణంలో నిలిచి ఉంటాయి. మనస్సు సూక్ష్మద్రవ్యం కాబట్టి త్వరగా నశించదు. దీన్ని ప్రాణం వేరొక చోటుకు తీసుకొనిపోయి క్రొత్త శరీరాన్ని అచ్చటి ద్రవ్యాలతో రూపొందిస్తుందని చెప్పబడింది. మరణ సమయాన  ఆఖరిక్షణంలో మనసున మెదిలే ఆలోచనతో మనిషి ప్రాణాన్ని పొందుతాడు. ప్రాణం ఉదానం తోడ్పాటుతో అతడిని తాను కోరిన చోటుకు తీసుకుపోతుంది. ఇలా వివిధ లోకాల్లోకి , శరీరాల్లోకి సూక్ష్మశరీరమే ప్రయాణం సాగిస్తుంది. ఇలా సూక్ష్మశరీరంలో ఉండే మనస్సే కోరికలకు మూలమై బంధానికి కారణమవుతుంది.





No comments:

Post a Comment