Thursday, February 14, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-3



ఆలోచనలు మనలనెలా ప్రభావితం చేస్తాయి?
 
జంతువులకు భౌతికపరమైన అనుభవాలేగాని మానవులలా మానసిక స్థితులు తెలియవు. మనకొక విషయం తెలియడమే గాక ఆ విషయం తెలిసిందనికూడ తెలుస్తుంది. ఒక అనుభవం అనుభవమయ్యేకా మాటల్లోనూ వ్యక్తపరచ గలం. అంతేగాక అట్టి అనుభవం నుంచి తనను భిన్నంగా చూడగల్గుతాడు కూడ.  మనస్సు ఇంద్రియజ్ఞానాన్ని ఆలోచనలను కలిగించే అంతరింద్రియంగా చెప్పవచ్చు. మనోమూలం ఇదం జగత్ “ – అంటే ఈ జగత్తునకు మనస్సే మూలమని పెద్దలు చెప్తారు. మనమే మనప్రపంచాన్ని సృష్టించుకొంటున్నాం. మన ఆలోచనావిధానం వల్ల మనం అనుకున్నట్లుగానే ప్రపంచం మనకు కన్పిస్తుంది.

మనస్సు ఇంద్రియాలచేత తెలియబడదు. మాయలాగే నిగూఢమైనది. ఎల్లప్పుడూ మార్పుచెందుతూ ఉంటుంది. అనుభవాలు అభిప్రాయాలు కోరికలు వాసనలు మొదలైనవాటితో సాధారణమైన మనస్సు మలినమై ఉంటుంది. కోపము భయము విస్మయము మొదలైన ఉద్వేగాలతో మార్పుచెందుతూ ఉంటుంది. ఒకవిషయం మీదనుండి మరోవిషయం మీదికి దుముకుతూనే ఉంటుంది. అందుకే ఇలాంటి చంచలమైన మనస్సును కోతితో పోల్చడం జరిగింది. గతంలోకి వర్తమానంలోకి భవిష్యత్తులోనికీ తిరుగుతూండే స్వభావం దీనిది. అహంకారం గుర్తించిన విషయాలనే చిత్తం ఆలోచన చేస్తుంది.  మనస్సే ఒకవిషయాన్ని ఎన్నుకోవడము, దాన్ని గమనించడము తిరస్కరించడం కూడ చేస్తుంది. ఎప్పుడూ క్రొత్తదనాన్నికోరుకుంటుంది. పాతవిషయాలపై ఒకవిధమైన రోతను కల్గించి క్రొత్తవిషయాలను అనుభవించడానికి నిరంతరాన్వేషణ సాగిస్తుంటుంది.

అసలు ఈ భౌతికశరీరం మనస్సు సుఖించడానికి దాని అభీష్టం మేరకేర్పడి, జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచంలో ఉండే వివిధ విషయాల అనుభవాన్ని పొందుతుంటుంది. మన ఆలోచనను అనుసరించి విషయాలు ఏర్పడుతాయి. ఒకేరకమైన ఆలోచన మాటిమాటికీ వస్తే, దాని స్పందనవల్ల అదొక అలవాటుగా మారుతుంది. ఆతర్వాత ప్రయాస లేకుండ యాంత్రికంగా ఆ అలవాటు వాడుకలోకి వస్తుంది. మనస్సు శరీరంతో సన్నిహితమైన సంబంధం కల్గి ఉంటుంది. అంచేత అవి శరీరంపై వాటి ప్రభావాన్ని కలుగజేస్తాయి. మనలో అలజడిని కలుగచేసే ఈర్ష్య, ద్వేషము, కోపము మొదలైన ఆలోచనా స్థితులు శరీరంలో రుగ్మతలను కలుగజేస్తాయని విజ్ఞులు చెబుతారు. ఆలోచన అంటే వచ్చి పోయేది. ఒక ఆలోచన మాటి మాటికీ వస్తుంటే దాన్ని మనం పట్టుకున్నట్లే. అలాంటివే రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ మొదలైనవి. ఈ స్థితులే సందర్భాన్ని అనుసరించి మనలను వాడుకుంటాయి. అందుకే మనలను దుఃఖానికి గురిచేసిన వ్యక్తి ఎదురైతే పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ద్వేషం కల్గుతుంటుంది. ద్వేషమనే స్థితి మనలను వాడుకోడమంటే ఇదే. అందుకే కొన్ని సందర్భాల్లో మన స్పందన ఒకేరీతిగా ఉండటం అనుభవంలోకి వస్తుంది.

ఆలోచన అనేది మనస్సులో కల్గే ఒక సూక్ష్మస్పందన. మనస్సు ఏ వస్తువు/విషయం గురించి విచారిస్తే ఆ ఆకృతిని దాల్చుతుంది. ఆలోచించే విషయం మారితే మనస్సు కూడ మార్పు చెందుతుంటుంది. ప్రతీ ఆలోచనా మనోఫలకంమీద ఒకవిధమైన ముద్రను మిగుల్చుతుంది. దాన్నే సంస్కారము అంటాం. అంటే ప్రతీ అనుభవము, మనోవృత్తీ  సంస్కార రూపంలో చిత్తము అనే గిడ్డంగి (storehouse) లో  నిక్షిప్తమై ఉంటుంది. మనోవృత్తి నుంచి సంస్కారము, సంస్కారము నుండి మనోవృత్తి ఇలా కలుగుతూనే ఉంటాయి. ఈ మనోవృత్తి -  సంస్కారమనే చక్రం అనాదిగా సాగుతోంది. బ్రహ్మసాక్షాత్కారం కల్గితే ఈ వృత్తులు సంస్కారాలూ వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అపుడు జనన మరణాల బంధం నుండి విముక్తి కల్గుతుంది.

సంస్కారాల నుంచి వాసనలు ఏర్పడి కోరికలు కలుగుతాయి. కోరిక బలీయమై తృష్ణగా మారుతుంది. ఆ విషయానందానికి మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. దాన్ని పొందే ప్రయత్నంలో రాగ ద్వేషాలు కల్గుతాయి. ఇలా మన ఆలోచనలూ కోరికలూ సంస్కారాల నుండే కల్గుతాయి. అంచేత దుష్ట సంస్కారాలను తొలగించుకొని మంచి సంస్కారాలను ఏర్పరచు కోవాలి. పిదప సాధనలో అన్ని సంస్కారాలనూ నశింప జేసుకోవాలి. అపుడిక కారణశరీరం కూడ నశించడంచేత తిరిగి జన్మనెత్త వలసిన పని ఉండదు. అదే మోక్షం.




1 comment:

  1. చక్కటి విషయాలను తెలియజేశారు.

    ReplyDelete