Thursday, February 28, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-5

మామూలుగా ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. కాని బలీయమైన ఆలోచనలు ప్రతిదినమూ ఉదయం లేవగానే ప్రత్యక్షమవుతాయి. రజోగుణోద్రేకం వల్ల మనస్సు బాహ్యవిషయాల వేపుకు స్వభావసిద్ధంగా పరుగులు తీస్తుంటుంది. మనకోరికలు మనస్సును బహిర్ముఖం  గావిస్తుంటాయి. సత్వగుణం శుద్ధమైనది. మోక్షసాధనకిది అవుసరమైనది. మన ఆలోచనలు మాటలు చేతలు అనాలోచితంగా చేస్తూంటాం. అలాంటి చేష్టలు మనల్నే గాక ఎదుటివారిని కూడ బాధిస్తుంటాయి. ధ్యానాభ్యాసం వల్ల ఇట్టి చేష్టలను తగ్గించుకోవచ్చు. మనస్సేవిధంగా సంకల్పిస్తుందో మనకు అన్నీ అలాగే కనిపిస్తాయి. మన విద్య, అనుభవాలు, పరిసరాలు, వంశ పారంపర్యంగా సంక్రమించే జన్యువులు  మనస్సును ప్రభావితం చేస్తాయి. మనస్సునకుండే ఇచ్చా, క్రియా, జ్ఞాన శక్తులు మూడూ ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి. వీటిని మనం మేల్కొలపాలి.
 
చిత్త వృత్తులంటే ప్రశాంతంగా ఉండే అంతఃకరణంలో ఆలోచన రాగానే , నిశ్చలంగా ఉండే చెరువులో చిన్న రాయివేస్తే తరంగాలు ఏర్పడినట్లుగా ఆ ఆలోచన మనస్సును ప్రభావితం చేస్తుంది. ఇలా మనస్సనే సముద్రంలో వృత్తులనే తరంగాలు అవిద్య వల్ల ఏర్పడతాయి. ఆ వృత్తులతో అహంకారం తాదాత్మ్యం చెందటంవల్ల కర్తృత్వభావం, భోక్తృత్వభావం (నేను చేస్తున్నాను అనేది కర్తృత్వభావం, ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అనేది భోక్తృత్వభావం) కల్గి బంధాన్ని కల్గిస్తున్నాయి. ఉదాహరణకు కోపం వస్తే, నాకు కోపం వచ్చింది అంటాం. అంటే కోపంతో తాదాత్మ్యం చెందటం, అంటే ఆ విషయాకారాన్ని దాల్చుతాం. వాస్తవానికి బంధాన్ని కలిగించేది తాదాత్మ్యం చెందటం వల్లనేగాని ఆ వస్తువుగాని ఆ విషయంగాని బంధం కల్గించడం లేదు.

మనస్సు ఒకవిషయాన్ని ఎలా గ్రహిస్తుందో వేదాంతంలో దృష్టి సృష్టి వాదమని చెప్పబడింది. ఈ వాదం ప్రకారం చూసేవాడు, చూడబడేది ఒక్కటే. సాలీడు తన నోటినుంచి ఏర్పడిన పదార్థంతో గూడును ఎలా ఏర్పరచుకుంటుందో అలా మనం మనస్సు నుంచే జాగ్రదావస్థలో బాహ్యప్రపంచాన్ని ఉత్పన్నంచేసుకొని సుషుప్తిలో దాన్ని తిరిగి మనస్సులోనికి ఉపసంహరించు కుంటుంది మనస్సు. దీన్నిబట్టి గ్రహించేది ఏమంటే ఒక వస్తువనేదంతా మనస్సు యొక్క విషయాకార వృత్తి. దృశ్యమనేది మనస్సు దాల్చిన అవిద్యా స్వరూపం మాత్రమే. బాహ్యంగా ఉండేది ప్రకాశం మాత్రమే. స్పందనయే. కానని దానికి మనస్సే రంగును పులిమి, రూపాన్నిచ్చి వస్తువుగా ఆకారం దాలుస్తుంది.

మనస్సు విషయాలను గ్రహించే మరో విధానం – శరీరంలో ఉండే సూక్ష్మతత్వాలైన తన్మాత్రలకు మనస్సుకూ మధ్య  పరస్పరచర్య (interaction) వల్ల కలిగే స్పందనల వల్ల బాహ్యప్రపంచాన్ని చూస్తున్నాం. ఉదాహరణకు కన్ను అగ్నితత్వంచేత ఏర్పడింది. అలాగే దీన్ని గ్రహించే మనస్సులోని భాగం కూడ అగ్నితత్వంతో ఏర్పడినదే. అలాగ ఒక్కో తత్వంచేత ఏర్పడిన ఇంద్రియజ్ఞానం వాటి వాటితో  సమాంతరంగా ( రేస్పెక్టివే ) మనస్సులో ఉండే తత్వం యొక్క భాగంచేతనే గ్రహించ బడుతోంది. ఇలా గ్రహించిన జ్ఞానం , అంటే పూర్తి ఇంద్రియజ్ఞానాన్ని ఆత్మయే గ్రహిస్తుంది. అంటే ఆత్మ ఆత్మచేతనే తెలియబడుతోంది. అంచేత మనం బాహ్యంగా చూసేది ఆత్మయే.

సాంఖ్య దర్శనంలో అన్ని విషయాలను గ్రహించడానికి పురుషుడే కారణమని చెప్పబడింది. 

ఇలా ప్రాపంచిక విషయాలు తెలియాలంటే  ఇంద్రియాలు, అంతఃకరణము, జీవుడు సరిగ్గా ఉండాలి. ఇంద్రియాలు విషయాన్ని చూస్తాయి. మనస్సు వాటిని కన్పించేలా చేస్తే, అభాసచైతన్యంతో కలసిన బుధ్ధి దాన్ని గ్రహిస్తుంది. శరీరం దృష్ట్యా  శరీరానికి బాహ్యంగా వస్తువు ఉంది. శరీరానికి బాహ్యంగా వస్తువున్నట్లే , నీకన్న బాహ్యంగా శరీరం ఉంది. అంచేత బాహ్యంగా ఉన్న జగత్తు మిధ్య. బాహ్యంగా ఏమీ లేకపోతే అంతర్గతంగాను ఏమీ లేనట్లే. అంచేత బాహ్యము, అంతర్గతము అనేవి మనస్సు కల్పించే భ్రాంతి. ఉన్నదల్లా ఒక్కటే. అదే ఆత్మ.




No comments:

Post a Comment