Thursday, April 11, 2013

మనస్సు–కొన్నివిశేషాలు-11

ఉదయం లేవగానే వచ్చే మొదటి ఆలోచన “నేను”. ఇది శక్తివంతమై భయానికి, అనేక కోర్కెలకు, భ్రాంతికీ మూలమై జగత్తు వాస్తవంగా తోస్తుంది. ఈ నేననే అహంకారమే బ్రహ్మమును మరుగుపరుస్తుంది.  ఈ అహంకారాన్ని సమూలంగా నిర్మూలించాలి. ఇది కర్మయోగం, భక్తియోగం లేపోతే ఆత్మవిచారణ వల్ల సాధ్యమవుతుంది. ప్రతీఆలోచనకూ మనం ఒక పేరుపెట్టి ఒక రూపాన్ని ఏర్పరుస్తాం. బలీయమైన ఆలోచనలే కార్యరూపాన్ని దాలుస్తాయి. ప్రతి పనికీ కార్యకారణ సంబంధం ఉంటుంది. ఆలోచనలను అదుపులో ఉంచుకునే నేర్పును సాధించాలి. చెడుఆలోచనలను మంచిఆలోచనలుగా మార్చుకోవడమే సాధనలో ప్రధానాంశం. ఆలోచనలను గమనిస్తే వాటివేగం తగ్గుతుంది. ఒకసారి ఒక్క ఆలోచననే అంకురించ నివ్వాలి. అది ఆలోచనగా రూపుదిద్దుకోవాలి. చిత్తములో లీనమవ్వాలి. పిదప మరోఆలోచనకు తావివ్వాలి. ఆలోచన కార్యరూపం దాల్చి కర్మాచరణకు కారణమవుతుంది. అందుకే నిర్మలమైన ఆలోచనలనే మనస్సులో ఉండేటట్లు చూసుకోవాలి.

ఉదయం మేల్కొగానే నేను అనే ఆలోచన వస్తుంది. పిదప క్రితంరోజు సాయంకాలం జరిగిన బలీయమైన సంఘటనలు ఆలోచనలవుతాయి. వచ్చిన ఆలోచన ప్రకారం పనిచెయ్యాలి. లేకుంటే ఆ ఆలోచన మనల్ని వెంటాడి మనస్సును కలవరపరుస్తుంది. అలా ఒకదాని తర్వాత మరో వాసన, కారణశరీరంనుండి మనస్సులోకి వ్యాపించి, సంకల్పాలను కలుగజేసి కార్యాచరణకు ప్రేరేపిస్తాయి. బ్రహ్మజ్ఞానం వల్ల వాసనలు నిర్వీర్యమవుతాయి. జిహ్వచాపల్యము, ఉపస్థ చాపల్యములను  సాధారణ మనస్సునకు  అదుపు చెయ్యడం కష్టమైనపనే. అహంకారము, కోపము, అభిమానము , రాగము అనేవి జీవుని సృష్టి. సరైన విచారణ లేకపోతే వాసనలు తాత్కాలికంగా అణగి, అనుకూల పరిస్థితులు కల్గినపుడు తిరిగి తలెత్తుతాయి. కాబట్టి వాసనలను కారణశరీరం నుంచి అంకురించేప్పుడే మనం జాగరూకతతో/ఎరుకతో బుధ్ధిసహాయంతో త్రుంచి వెయ్యాలి. దీన్ని వాసనాత్యాగం అంటారు. కోరిక తలెత్తగానే దృఢసంకల్పంతో వివేకాన్ని ఉపయోగించి విషయలోలత్వాన్ని జయించవచ్చు. బ్రహ్మభావన సమస్త కోర్కెలను నాశనం చేస్తుంది. కోర్కెలన్నిటినీ త్యజించినా మనస్సులో సూక్ష్మంగా దాగిఉండి సాధకుడిని అధోగతికి తోసేస్తుంది. అంచేత జాగరూకతతో మెలగాలి. రాగద్వేషాలు మనస్సులోకి రాగానే కర్మాచరణ మొదలైనట్లే.

ప్రాణాయామం మన ఆలోచనలను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల రజో,తమోగుణాలను నిర్మూలించి మనో నైర్మల్యాన్ని కల్గిస్తుంది. ముందుగా శరీరాన్ని, మన మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఎవరి గురించీ చెడు మాట్లాడకుంటే క్రమంగా మనస్సు ఇతరుల చెడును ఆలోచించదు. వ్యర్ధప్రసంగాలను ఆపి, మనస్సును గమనించాలి. మనం ఏమి ఆలోచిస్తే మనస్సు ఆ ఆకృతిని పొందుతుంది. నిర్గుణోపాసకుడు “ఓం”కారంపైన, దాని అర్ధంపైన ధ్యాసను ఉంచాలి. మౌనం పాటిస్తే వాగింద్రియం నియంత్రించబడుతుంది. అపుడు అంతర్ముఖమై మనస్సును సాక్షిగా గమనిస్తే మనలో లోపాలు తెలుస్తాయి. మనస్సును గమనించడమే రాజయోగమంటే.  వైఫల్యాలకు నిరాశచెందక ఎందుకు విఫలమవుతున్నామో తెలుసుకునే ప్రయత్నంతో సరిదిద్దుకొని మళ్ళీ ప్రయత్నించాలి. సాధననొకదాన్ని ఎన్నుకుని దాన్నే కొనసాగనివ్వాలి. ఒకగురువును ఆశ్రయించాలి. 





No comments:

Post a Comment