Monday, October 8, 2012

కుండలిని - 1



కుండలిని  
ఉమ్మెత్త పూలను ఒకదానిపై మరొకటి పైముఖముగా పేర్చి, దారం గుచ్చితే  ఎలా ఉంటుందో; అలా వికసిస్తున్న  పద్మాలలా కుండలిని కన్పిస్తుంది.  ఇది శిరస్సు నుండి మేరుదండము మధ్యగా క్రిందిలోకాలకు  ప్రవహిస్తుంది. దీన్నే  వజ్రము లేక సుషున్ను అంటారు.  దీన్లోనే  సహస్రారమునుండి మూలాధార చక్రము వరకు పనిచేసే  కేంద్రాలుంటాయి.

మనస్సులో  మనకు మనమే ఊహలు పుట్టించుకోడం లేదు.  ఊహలు తట్టడమనేది  పరమాత్మ వశాన ఉంటుంది. మనకు అనువైన సంకల్పాలను  కల్పించి, క్రమేణా పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగించేది యోగ మాయ.  జీవులు సుఖానుభవాలను  సాధించే  ఆశతో, సంఘర్షణ వల్ల దుఖపడుతూంటారు.  ఆహారము, నిద్ర, వస్త్రము, గృహమనేవి  తప్ప మిగిలినవి  సుఖములు కాదనే విషయాన్ని  జీవితంలో సంఘటనల ద్వారా నేర్పించేది మాయ.  కాబట్టి మాయను గుర్తించి,  దాని నారాధించే వారికి అది యోగ మాయ అవుతుంది. కుండలినీ శక్తిని ఉపాసించే వారిని,  ఆమె ప్రేమ అనే  అమృత ధారలతో తడుపుతూ, జన్మ రాహిత్యాన్నికలుగ జేస్తుందని యోగులు చెబుతారు.

కుండలినీ యొక్క ఆధార పద్మము సుషున్నూ నాడికి ప్రవేశద్వారము. ఇది వెన్నెముక క్రింది భాగమున గుదస్థానము నకు పైన ; నోరు/వక్త్రము  అధోముఖమై ఉంటుంది. మూలప్రకృతి సూక్ష్మ లోకాలనుంచి  స్థూల లోకాలలోకి దిగి రావడానికి, ఈ మూలాధార చక్రమే ద్వారము. చిక్కుడు చెట్టు చిక్కుడు గింజయందున్నట్లు; జీవుని శరీరము యొక్క అంశ, దీన్లో ఉంటుంది.

మనశరీరంలో మూలాధారం మొదలుకొని బ్రహ్మరంధ్రము వరకు వెన్నెముక నందు వెదురు బొంగువలె బ్రహ్మదండము ఉంది .  దీన్లో  కాలువలా ఉండు సన్నని రంధ్రముగా గల మార్గము నందుండే  సుషున్నూ నాడిలో, ఆరు చక్రములు కలవని యోగులు వారి అనుభవంతో చెబుతారు. చక్రములు అంటే నాడీ సముదాయంగా చెప్పుకోవచ్చు. సుషున్నూ లోపల కుండలినీ శక్తి తామర కాడలో దారం వంటిదని చెప్పబడింది.

గుదము(పాయువు) నకు పైన, శిశ్నము(లింగము)నకు రెండంగుళాల క్రింద అధోముఖముగా(క్రింది ముఖముగా) కోణము గల త్రిభుజం నందు మూలాధార చక్రం ఉన్నట్లు చెబుతారు. ఆ మూలాధారం మొదలు శిరస్సు మధ్యభాగము నందుండు  సహస్రార కమలమున గల బ్రహ్మరంధ్రము వరకు సుషున్నూ నాడి వ్యాపించి ఉంది. ఇది అన్ని నాడులకన్న శ్రేష్టమైనది. ఈ సుషున్నూ నాడికి ఇరువైపులా ఇడ, పింగళ అనే నాడులున్నాయి. ఎడమవేపున ఇడా నాడి, కుడి వేపున పింగళ నాడి ఉన్నాయి. కుడి ముక్కున సంచరించే శ్వాసకు 'పింగళ' అని, ఇదే బ్రహ్మము లభించు దేవయాన మార్గమని అంటారు.  సుషున్నుకు ఎడమవేపున పయనించే శ్వాసను 'ఇడా' అనియుదీన్ని ఇడానాడి అనీ అంటారు. ఇది ప్రకృతిని ఆశ్రయించి ఉంటుందనీ, దీని గమనమును చంద్రమండల యానముగా చెబుతారు. దీన్ని పితృయాన మార్గంగా చెబుతారు.

అజ్ఞానుల యందు సుషున్నూ రంధ్రము మూసుకొనియు, జ్ఞానులందు విచ్చుకొనియు ఉంటుంది. ఇడా, పింగళ , సుషున్నూ నాడులు మూడూ భ్రూమధ్యమున కలుస్తాయి. ఆ ప్రదేశాన్ని త్రివేణీ సంగమముగా చెబుతారు. ఇడా పింగళ నాడులు నాసికాగ్రంతో ఆగి పోతాయి. కుండలినీ శక్తిని క్రియాయోగమున ప్రాణాయామంతో పూరక, కుంభక , రేచకములను అనుసంధానం చేసి సుషున్నూలో ఉండే కుండలినీ శక్తిని ఊర్ధ్వగతిని పొందింప చెయ్యడం వల్ల బ్రహ్మ గ్రంధి, విష్ణు గ్రంధి, రుద్ర గ్రంధి అనే గ్రంధి త్రయం భేదించ బడుతోంది. ఈ మూడు గ్రంధులూ కలసి హృదయ గ్రంధి అంటారు. దీని భేదనమే ముక్తిగా చెప్పబడుతోంది. ఈ సుషున్నూలో ఉండే చక్రములను 1) మూలాధారము 2) స్వాధిష్టానము 3) మణి పూరకము 4) అనాహతము 5) విశుద్ధి 6) ఆజ్ఞా చక్రము అని అంటారు.

చక్రము అంటే నాడీ కూటమి అని గ్రహించాలి. మూలాధారము నుండి ఆజ్ఞేయము వరకు ఉండే  ఆరు చక్రాలను  కమలములని అంటారు. ఇవి గాక సహస్రారమనేదీ ఉంది. సుషున్ను మూలాధారం నుంచి అజ్ఞేయ చక్రం వరకూ ఉండే ఆరు కమలాలనుండీ సంచరిస్తూ, సహస్రారమనే  సహస్ర దళ పద్మమందు ఓంకార పీఠమున ప్రకాశిస్తుంది.

మూలాధార స్వాధిష్టానములు కలసి బ్రహ్మ గ్రంధి అనబడుతోంది. ఇది  '' కార మాత్రా స్వరూపము. సరస్వతీదేవి శక్తి. దీనికి 'లం'-అనేది  బీజ స్వరూపము. రజోగుణ ప్రధానము, క్రియా శక్తి స్వరూపము. మనోరూపము. మణి పూరక అనాహతములు కలసి విష్ణు గ్రంధి అంటారు. ఇది '' కార మాత్రాస్వరూపముగా ఉంది. మహాలక్ష్మి శక్తి స్వరూపము. స్థితి కారిణి. ఇచ్చాశక్తి రూపిణి. దీనిది 'వం' బీజ స్వరూపము.  సత్వగుణ ప్రధానము. ప్రాణ స్వరూపము.

విశుద్ధి ఆజ్ఞా చక్రములు కలసి రుద్ర గ్రంధి అంటారు. ఇది '' కార మాత్రాస్వరూపము. మహా కాళీ శక్తి స్వరూపము. లయ కారిణి. జ్ఞానశక్తి స్వరూపము. దీనిది  'రం' - బీజ స్వరూపము. తమోగుణ ప్రధానము.
బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంధులు మూడూ కలసి హృదయ గ్రంధి అని చెప్పబడుతోంది. ఇదే లింగదేహము. ఆత్మకు ఉపాధి. హృదయ గ్రంధి యందు ప్రతిఫలించి ప్రకాశించు చైతన్యమే క్షేత్రజ్ఞుడుగా చెప్పబడింది.


No comments:

Post a Comment