Friday, August 23, 2013

జ్ఞానయోగము- సాధన (4)

శమాది షట్క సంపత్తి  

దీన్లో  శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము  అని ఆరుఅంగాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే  జ్ఞానం  కలుగుతుందని విజ్ఞులు చెబుతారు. గతజన్మ వాసనలవల్ల  శబ్ద స్పర్శ రూప రస గంధాలనే ఇంద్రియ విషయాలకోసం, మనస్సు  తహతహ లాడుతుంటుంది. ఈ విషయాలను వివేక వైరాగ్యాలతో  పరిశీలిస్తే, ఇవి  దోషపూరితాలని తెలుస్తుంది.  వీటికై వెంపర్లాడటం ఆత్మజ్ఞానానికి  ఆటంకమని  గ్రహిస్తాడు. అప్పుడు  వీటిని విసర్జించి, అంటే  వీటికి  దూరంగాఉంటూ సాధన కొనసాగిస్తాడు. ఆత్మయే  సుఖశాంతులకు నిలయమని  తెలిసి, మనస్సును  అట్టివాసనలనుండి పుట్టేకోరికలను  నియమిస్తూ, సాధనాభ్యాసాన్ని చేస్తుంటాడు. మనస్సును  నియమించడం శమంలోకి వస్తుంది.

ఇక్కడ మనస్సును, ఇంద్రియాలనూ  ఒకేసారి నిగ్రహించాలి. శమం  మనస్సును నియమించడం  ఐతే దమం  ఇంద్రియాలను  నియమించడం. అంటే  శమ దమాలను  ఒకేమారు  నిగ్రహించాలి. అంటే  ఒకదాని పిదప మరొకటిగా  గాక  రెండిటినీ  కలిపే,  సాధన ఉండాలి. జ్ఞానేంద్రియాలు  తమంత  తాము  పనికి పూనుకోకపోయినా, కర్మేంద్రియాలు  వాటి పనిని, అవి చేస్తూనే ఉంటాయి. జ్ఞానేంద్రియాలు  ప్రాపంచిక విషయాలను గ్రహించి  అనుభవిస్తుంటాయి. వీటివల్లే  జీవుడు మాయా సంసారంలో  చిక్కుకుంటున్నాడు. సాధనలో ఇంద్రియాలను  నియమించే  దమము అవుసరం అందుకే.

కళ్ళూ చెవులూ  మూసుకొని, కాళ్ళూ  చేతులూ బంధించి ఉంచినా, ఇంద్రియాలు  ఏ విషయాన్నీ అనుభవించక పోయినా, మనస్సు  ఏవేవో ఊహించుకొంటూనే ఉంటుంది. అంటే  మనస్సే ఇంద్రియాలను  ప్రేరేపించేదని  తెలుస్తోంది. అందుకే  శమము  ముందుగాను, దమము తర్వాత వస్తాయి. ఐనా రెండిటినీ  ఒకేసారిగా  అభ్యసిస్తూ నిగ్రహించాలి. శమదమాలవల్ల  మనస్సు  ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు  ఆగిపోతే ఆత్మ ప్రకాశిస్తుంది. శమదమాలున్నవాణ్ని  సన్యాసి  లేక యతి అంటారు.

మనస్సులో  ఉత్పన్నమయ్యే  కోరికలను  ఎప్పటికప్పుడు నిరసిస్తూ, త్యజిస్తూ జాగరూకతతో  ఉండటం శమాన్ని, ఇంద్రియాల ద్వారా  విషయాలు లోపలికి  ప్రవేశించకుండా నిగ్రహించడం దమాన్ని సూచిస్తాయి. అంటే  బాహ్యాభ్యంతర  విషయాలవల్ల మనస్సు చలించకుండా జాగ్రత్త పడటం శమదమాలని  చెప్పబడింది. 




No comments:

Post a Comment