Wednesday, September 4, 2013

జ్ఞానయోగము- సాధన (6)


ఉపరతి :-

శమదమాలను నిరంతరం అభ్యసిస్తూంటే, మనస్సు ఎలాంటిపనీ చెయ్యని ప్రశాంతస్థితిలో ఉంటుంది. ఇలా మనస్సు ఆలోచనారహితంగాను, నిశ్చలతస్థితిలోనూ ఉండటాన్ని ఉపరతి అంటారు. ఇది ఏకాంతంగా ఉండే శూన్యస్థితి. ఇంకా ఆత్మసాక్షాత్కారం అవ్వలేదు.

వైరాగ్యంలో కోరికలపట్ల ఏహ్యభావమూ విసుగూ వాట్ని నిర్మూలించుకోడమూ ఉంటాయి. కాని ఉపరతిలో కోరికలు ఉండవు కాబట్టి విసుగు/రోత అనేది ఉండదు. ప్రశాంతమైన స్థితే ఐనా, ఉపరతిలో ఆనందం లేదు. దీన్లో బాహ్యమైన ఆలంబనలు ఉండవు. అంటే అన్నిటినీ పూర్తిగా విడిచినట్లన్నమాట. అలా అన్నిటినీ విడవటమే సన్యాసం. సాధకుడి కర్మఫలాలు పూర్తిగా నశించినప్పుడే, పరమాత్మ అతడిని సమాధానస్థితికి తెచ్చి మహావాక్యోపదేశం .....ఇలా ముందుకు నడిపిస్తాడు.

తితిక్ష :-

అన్నిబంధాలనుండీ విశ్రాంతి కలిగే ఉపరతి తర్వాత తితిక్ష (ఓర్పు ) కోసం సాధన చెయ్యాలి. ఇక్కడ తర్వాతని చెప్పినా, ఇదివరలో చెప్పుకున్నట్లు సాధనలో అన్ని అంగాలను కలిపే అభ్యసించాలి. ఉపరతిలో తీవ్రసుఖంగాని, తీవ్రదుఃఖంగాని సంభవిస్తే ఉన్నస్థితిలో చలనం కలుగుతుంది. అందుకే ఓర్పు/సమభావన/సహనం అనేదాన్ని సాధనతో పొందాలి. జరిగేది జరిగేతీరుతుందనే భావన దృఢమైనపుడు మనం ఎట్టి మనో వికారాలకూ లోనవ్వం. కర్మఫలంవల్ల మంచి జరిగినా, చెడుజరిగినా వాటిని త్రోసివెయ్యక వాటిపట్ల సమభావంతో ఉండటమే సాధన. ఇదే తితిక్ష. ఇలా ద్వందాలకు అతీతంగా ఉన్నపుడు ఇక మిగిలేది ఆత్మయే.


శ్రద్ధ :-

ఇది మొదటినుండీ చివరిదాకా ఉండాల్సిందే. సాధన ముందుదశలో  శాస్త్రాలమీద గురువాక్యాలపైనా నమ్మకం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు తర్కానికి అందని విషయాలు ఉంటాయనే భావన ఉంటుంది గనుక. ప్రస్తుతం ఉపరతి, తితిక్ష తర్వాత అంటే సాధనలో పురోగతి సాధించాకా, దేన్ని సాధించాలో దాన్ని పొందవచ్చుననే భావంతో ఉంటాడు. ఇదీ ఒకరకమైన అహంకారమే. అంచేత సాక్షాత్కారమయ్యే దాకా శ్రద్ధ ఉండాలని చెబుతారు. పరతత్వం బుద్ధికి లొంగదు. గురువు సూచించిన మార్గంలో పయనిస్తూ, ప్రత్యక్షంగా సత్యదర్శనం చేయాలనే పట్టుదల ఉండాలి. 

ఎప్పుడూ శ్రద్ధ ప్రక్కనే అశ్రద్ధ ఉంటుంది. అలాంటి అశ్రద్ధను జయించడమే శ్రద్ధ అనబడుతోంది. శ్రద్ధపై విజయం లభిస్తేనే సమాధాన స్థితి పొందటం జరుగుతుంది. సాధనలో పతనం చెందకూడదంటే అభ్యాసం కొనసాగాలి. జ్ఞానమార్గంలో పయనించడం పదునైన కత్తిమీద నడవడం వంటిదని విజ్ఞులు చెబుతారు. అందుకే శ్రద్ధతో ముందుకు సాగుతూంటే దానికి అనుగ్రహం తోడవుతుంది.

నిత్యానిత్య వివేకంతో ఆత్మే నిత్యమైనదని అనుకుంటాడు గాని దృఢమైన నమ్మకం ఏర్పడదు. విచారణ, గురూపదేశం, శాస్త్రపఠనం – వీటివల్ల ఆత్మ ఒకటుందనే భావన ఉంటుంది. ప్రాపంచికవిషయాలన్నీఅనిత్యాలని అనుభవమూ అవుతుంది. ఐనా సచ్చిదానందమైన ఆత్మపట్ల గట్టి నమ్మకం ఇంకా కలుగదు. సమబుధ్ధి వల్ల దేన్ని త్యజించాలో తెలుసుకుని శమదమాలను ఆచరణలో పెడతాడు. కొంతకాలానికి మనస్సు శూన్యంగా ఉండే ఉపరతి కలుగుతుంది. కాని ఆత్మానుభవం ఇంకా కాలేదు. కాని ముందునుండీ చూఛాయగా ఆత్మానందం ఉంటుంది. అంచేత సాధన శ్రద్ధతో కొనసాగాలి. బుద్ధికి అతీతమైన శాస్త్రవిషయాలపైనా, గురువు చెప్పిన మాటలనూ సందేహించక విశ్వాసంతో ఉండాలని చెప్పబడింది. అలా ఉన్నప్పుడే సత్యం అవగతమవుతుంది.







No comments:

Post a Comment