Sunday, September 2, 2012

జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు - పనిచేసే విధానము


పంచ జ్ఞానేంద్రియములు : 
మన దేహంలో  బాహ్యవస్తు జ్ఞానాన్ని గ్రహించడానికి ఐదు జ్ఞానేంద్రియాలున్నాయి.
శబ్దాన్ని గ్రహించడానికి చెవులూ,
శీతోష్ణములను(స్పర్శ) గ్రహించడానికి చర్మము(త్వక్కు),
రుచులను లేక రసమును గ్రహించడానికి జిహ్వ(నాలుక),
రూపమును గ్రహించడానికి కనులు(చక్షువు),
వాసనలను(గంధము) గ్రహించడానికి ముక్కు(ఘ్రాణము) ఉన్నాయి.
ఇవన్నీ సూక్ష్మాంశాలు. జ్ఞానేంద్రియమొక్కొక్కదాన్లో, ఒక మహాభూతపు అంశ మాత్రమే ఉండటం వల్ల, చెవి చూడలేదు, కన్ను వినలేదు. ఈ అయిదు జ్ఞానే౦ద్రియాలు తెచ్చే విషయాలను గ్రహించటానికి అంతః కరణంలో వీటన్నిటి  సత్వా౦శాలూ ఉంటాయి. సత్వాంశాలైదూ కలసి అంతఃకరణం ఏర్పడుతుంది. అంతఃకరణం మనస్సు, బుద్ది అని రెండు విధాలుగా వృత్తి భేదంచేత చెప్పబడుతోంది.

కర్మేంద్రియాలు :
వాక్కు, చేయి, పాదము, గుదము, గుహ్యము అనేవి కర్మే౦ద్రియాలని  చెప్పబడతాయి. ఇవి కూడా సూక్ష్మంశాలే. మాంస వికారాలు కావు.
వాక్కు మాట్లాడతాం.
పాణి (చేతులు) తీసుకుంటాం.
పాదము   ఇటూ అటూ పోవడం.
గుదము(పాయువు) త్యజించడం.
గుహ్యము ( జననేంద్రియం/ ఉపస్థ) ఆనందించడం.
ఇలా వీటి చేత కర్మలు చెయ్యబడటం చేత, వీటిని కర్మేంద్రియాలని చెబుతాం. పంచ మహాభూతాల యొక్క ప్రత్యేక రజో౦శముల నుండి - వరుసగా ఆకాశం నుండి వాక్కు, వాయువు నుండి పాణి, అగ్ని నుండి పాదము, జలము నుండి పాయువు, పృథ్వి నుండి ఉపస్థ ; ఇలా కర్మేంద్రియాలు  ఏర్పడ్డాయి.
                 
పంచ మహాభూతాల యొక్క ప్రత్యేక సత్వాంశాలనుంచి  జ్ఞానేంద్రియాలేర్పడుతుంటే, వీటి  ప్రత్యేక రజో౦శాల నుంచి   కర్మేంద్రియాలేర్పడుతున్నాయి. పంచభూతాల రజో౦శాలన్నీ కలసి ప్రాణమేర్పడుతుంది. దీనికే ముఖ్య ప్రాణమని పేరు. ఈ ముఖ్య ప్రాణం చేసే పనుల భేదాన్నిబట్టి; ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అని పంచ ప్రాణాలుగా చెబుతారు.

ఇంద్రియాలెలా పని చేస్తాయంటే :
ఉదాహరణకు శ్రవణే౦ద్రియాన్ని తీసుకుంటే చెవి శబ్ద తరంగాన్ని, దాని కేంద్రంలో చేర్చే బాహ్య అవయవం లేక ఉపకరణం. దీనికి లోపల అంతరింద్రియంగా శబ్దకేంద్రం మెదడులో ఉంటుంది. ఈ అంతరింద్రియం మనస్సుతో సంబంధం కల్గి ఉండాలి. మనస్సు  కర్ణే౦ద్రియంతో సంబంధ పడకపోతే, అంతరింద్రియమూ దాని వెలుపల గల చెవీ శబ్ద  తరంగాన్ని స్వీకరించినా, ఆ శబ్దం లేక ధ్వని అనుభవంలోకి రాదు.

మనస్సు ఈ అనుభవాన్ని ఇంకా కొంత  దూరం తీసుకుపోయి బుద్ధికి నివేదిస్తుంది. అపుడు బుద్ది తనకు చేరిన విషయం ఇట్టిది అని నిర్ణయం చేస్తుంది. కాని అప్పటికీ కార్యం పూర్తి కాదు. బుద్ది ఈ అంశాన్ని జీవాత్మకు నివేదిస్తే, జీవాత్మ తన నిర్ణయాన్ని ఏంచెయ్యొచ్చో, ఏంచెయ్యకూడదో తెలుపుతుంది. అపుడా ఆజ్ఞను తిరిగి అదే క్రమంలో మొదట బుద్ధికి, ఆక్కడ నుండి మనస్సుకు, అటునుండి కేంద్రానికీ  తీసుకుపోబడుతుంది. ఆ తర్వాత, ఆ కర్మే౦ద్రియం దాని వెలుపలి ఉపకరణానికి చేరుస్తుంది. అపుడు గాని ఆ అనుభవం పూర్తి కాదు. అలాగే మిగిలిన విషయాల జ్ఞానమూ మనకు తెలిసేది అని గ్రహించాలి.

3 comments:

  1. చక్కటి విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  2. anrd గార్కి,
    ధన్య వాదములు
    సూర్యచంద్ర గోళ్ల.

    ReplyDelete
  3. ధన్యవాదాలు🙏💕

    ReplyDelete