Sunday, September 16, 2012

వాసనలు

నిర్మలమైన మనస్సు నిశ్చలంగా ఉండే సరస్సు లాంటిది. నిశ్చలంగా ఉండే సరస్సులో ఏ ఒక చిన్న రాయిని విసిరినా, అనేకమైన తరంగాలు కల్గుతాయనేది మనకందరకూ తెలిసిన విషయమే. కొంత సమయం తర్వాత ఆ అలలు శాంతించి సరస్సు తిరిగి నిశ్చలంగా అవుతుంది. కాని దాన్లోకి విసరిన రాయి మాత్రం సరస్సు అడుగు భాగంలో ఉంటుంది.


అలాగే  మన మనస్సు బాహ్య విషయాల వేపుకు పోయినపుడు నిర్మలంగా ఉండాల్సిన చిత్తమనే సరస్సులో; ఆ విషయాకృతిని చెందేపుడు వృత్తులనే తరంగాలు కలుగుతాయి. అప్పుడు మనస్సు వికారాలకు (మార్పు) లోనవుతుంది. సరస్సులో విసిరిన రాయి ఎలా అడుగు భాగాన ఉండే ఉంటుందో, అలా విషయానుభవం గతించినా ఆ విషయానుభవం మాత్రం బీజరూపంలో సంస్కారరూపంగా ఉంటుంది. అలా బీజరూపంలో ఉండే సంస్కారాలనే వాసనలు అని అంటారు. ఈ వాసనలు అనుకూల పరిస్థితులు కల్గినపుడు తలెత్తుతాయి. ఇలాంటి విషయానుభవాలనే వాసనలు, అనేక జన్మల నుండి ఏర్పడినవై చిత్తంలో ఉంటాయి.
          
ఈ వాసనలు/ సంస్కారాలు  మంచివైతే సద్వర్తనమూ, చెడువైతే దుష్టవర్తనమూ కలుగుతాయి. దుష్ట సంస్కారాలను(మలిన వాసనలను) వీటికి వ్యతిరేకమైన వాసనలతో అంటే శుద్ధవాసనలతో అరికట్ట వచ్చని 
పెద్దలు చెబుతారు. ముక్తికి తోడ్పడేవి శుద్ధ వాసనలనీ, సంసారంలో బంధించేవి మలినవాసనలనీ అంటారు.

శుద్ధ వాసనలు – కరుణ, మైత్రి లాంటి  సుహృద్భావాలను కలిగి ఉండటం, వేదాంత శ్రవణము సజ్జన సాంగత్యము మొదలైన వాటిపై అభిరుచి కలిగి ఉండటం వంటివి శుద్ధ వాసనల లోకి వస్తాయి. వీటిని సిద్దావస్థ కలిగే వరకూ వదలి పెట్ట కూడదని అంటారు.

మలిన వాసనలు – సమాజంలో వివిధ మనస్తత్వాలు కలిగిన వ్యక్తులుంటారు. అందరికీ అనుగుణంగా ప్రవర్తించడం లోక వాసనల్లోకి వస్తుంది. జ్ఞాని నిందా స్తుతులకు దూరంగా ఉంటాడు. ధర్మమార్గంలోనే వ్యవహరిస్తాడు. అంచేత లోకులను తృప్తి పరచాలనేది ఉండదు.

శాస్త్రాధ్యయనమనేది బ్రహ్మవిద్యకు ఎంత వరకూ అవుసరమో అంతవరకే చెయ్యాలి. వేదాంత శ్రవణం చెయ్యకుండా కేవలం శాస్త్రాధ్యయనంతో సమయాన్ని గడపటం ఒక వ్యసనంగా మారి, మలిన వాసనలలో చేరుతుంది. కొందరు మడి అనీ, వారాలనీ , పలానా తిధి అనీ ఇలా అనేకమైన వాటిని ఆచరిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటారు. అనుష్టానమనేది వ్యసనంగా ఏర్పడి దాన్లోనే ఉండటం వల్ల ; బ్రహ్మవిద్యకు ప్రతిబంధక మవుతుంది.

మరికొందరు శాస్త్రజ్ఞానం లేనివారు,  శాస్త్రజ్ఞానం ఉన్నచార్వాకులలోనూ ఈ దేహమే నేను అనే భావన ఉండి, ముక్తితో పని లేదనే చెబుతారు. దేహం నశించేది కాబట్టి, దాంతో అన్నీ నశిస్తాయి. అంచేత ఏదో ఎక్కడో లభిస్తుందని ఇప్పుడు సమయం వృధా చేసుకోకూడదని వాదిస్తారు. కొందరు శరీరం బుద్బుద ప్రాయమనేది మరచి,  దేహభ్రాంతి వల్ల శరీర సౌందర్యానికి పాటుబడుతుంటారు. కొందరు పుణ్యనదుల స్నాన మాచరించడం వంటి  శాస్త్ర విహిత కర్మలందే  లగ్నమవ్వడం వల్ల, వారు పావనమవ్వవచ్చే గాని పురుషార్దానికి దూరం అవుతారు. అంచేత ఇవి మలినవాసనలలోకి వస్తాయి.

కొందరు తమకు అపవిత్రత కలిగిందనే భావంతో స్నానాదులను, సంధ్యావందనాదులను అనుష్ఠానం చెయ్యడంచేత ఆ అపవిత్రతను తొలగించు కొంటున్నామనే భ్రాంతితో ఉంటారు. శాస్త్ర, దేహ, లోక వాసనలు బంధ హేతువులుగా చెప్ప బడ్డాయి. ఇవే గాక ఇంద్రియ వాసనలూ బంధహేతువులే. శుద్ధవాసనలతో  మలిన వాసనలను అరికట్ట వచ్చునని పెద్దలు చెబుతారు.
        
          

3 comments:

  1. manchi prayatnam.
    krindi online book kudaa chadavandi.
    http://archive.org/stream/AnuragSagarOfKabir/Anurag-Sagar-Complete#page/n52/mode/1up

    ReplyDelete
    Replies
    1. Mee amoolyamaina salahaaku dhanyavaadamulu.
      meeru cheppina book chaduvuthaanu.
      Suryachandra Golla

      Delete