Thursday, July 26, 2012

యోగ మార్గము (3)



4) ప్రాణాయామం 
శ్వాసను నియంత్రించటం వల్ల మనస్సు వికారం చెందక ప్రశాంతంగా ఉండి, ధ్యేయ సాధనకు ఉపకరిస్తుంది. ప్రాణాయామానికి  శ్వాస నియంత్రణ కేవలం ఒక సాధన. మన శరీరంలో జరిగే ప్రతి చిన్నపనీ ప్రాణశక్తి/జీవశక్తి వల్లనే. మనోవృత్తి కూడా సూక్ష్మమైన ప్రాణవ్యాపారమే.  ఊపిరితిత్తులను ఈ ప్రాణశక్తి కండరాల చలనరూపంలో కదిలిస్తుంది. నాడులనుంచి కండరాల్లోకి వెళ్లి, కండరాలనుంచి ఊపిరితిత్తులకు చేరి వాటిని కదలించే స్నాయుశక్తే  ప్రాణశక్తి. ప్రాణాయామంలో ఈప్రాణాన్నే నిరోధించి  ప్రాణవ్యాపారాలన్నిటిని  మనవశ౦ చేసుకుంటాం. మనిషి తన శక్తులన్నిటినీ ఏకాగ్రం చేస్తే, శరీరంలో ప్రాణశక్తి వశమవుతుంది. ఇలాంటి చిత్త ఏకాగ్రతను ఎలా పొందాలో చెప్పేదే రాజయోగం. సత్యం తెలుసుకొని అత్మసాక్షాత్కారాన్ని కలిగించే అత్యున్నత స్థితే సమాధిస్థితి.  మానసికశక్తి రూపంలో వ్యక్తమయ్యే ప్రాణాన్ని, మానసిక సాధనతో నిరోధించే ప్రాణాయామ భాగాన్ని రాజయోగం అంటారు.

శ్వాస నియంత్రణ శరీరచలనానికి ఒక క్రమమైన పద్ధతిని ఏర్పాటు చేస్తుంది. దీని వల్ల సంకల్ప బలం కలుగుతుంది. ఈ సంకల్పబల ప్రవాహాన్ని వెన్నుపూస మధ్యలో ఉండే సుషున్నూ నాడిద్వారా కుండలినీశక్తిని మేల్కొలిపి , పైకి ప్రవహించేలా చేస్తే , అతీంద్రియజ్ఞానం కల్గి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కుండలినీశక్తి ఒకో చక్రాన్నీదాటుకుంటూ పైకి వెళుతున్నపుడు మనస్సులో పొరలు తొలగిపోతాయి.

ప్రాణాయామం – చేసే విధానం గురించి 
మేరు దండంలో(వెన్నెముక మధ్యలో) మూలాధారం మొదలుకొని బ్రహ్మరంధ్రం వరకు సుషున్నూనాడి వ్యాపించి ఉంటుంది. దీన్లో కుండలినీ శక్తి ఉంటుంది. సుషున్నూనాడికి  ఎడమప్రక్క ఇడానాడి(చంద్ర నాడి), కుడిప్రక్క పింగళనాడీ(సూర్య నాడి) ఉంటాయి. ముక్కుకు  ఎడమప్రక్క ఇడానాడి , కుప్రక్క పింగళనాడీ అంతమవుతాయి. కాని సుషున్నూనాడి (బ్రహ్మ నాడి) బ్రహ్మరంధ్రాంతం వరకూ వ్యాపించి ఉంటుంది. వెన్నెముక యందు గుద స్థానము మొదలు సహస్రారము వరకు మూలాధారము, స్వాధిష్టానము , మణిపూరకము, అనాహతము, విశుద్ధము , ఆజ్ఞేయము, సహస్రారము అనే ఏడు చక్రాలు ఉన్నాయి. చక్రము అంటే, ఇక్కడ నాడీ కూటమి అనే అర్ధం చేసుకోవాలి. వీటిని గురించి కుండలినీ యోగంలో విపులంగా తెలుసుకుందాం.

విధానం ముందు కుడి ముక్కును బొటన వ్రేలితో మూసి, ఎడమవేపు ముక్కుతో గాలిని మెల్లగా  పీల్చాలి. ఇపుడు చిటికెన వ్రేలు లేదా చూపుడు వ్రేలుతో ఎడమవేపు ముక్కును కూడ  మూసి , లోపల ఉన్న గాలిని క్రిందిభాగాన ఉన్న మూలాధార చక్రాన్ని తడుతున్నట్లుగా భావిస్తూ అక్కడ కొంతసేపు నిలపాలి. తర్వాత బొటన వ్రేలును కుడి ముక్కుపుటం మీద నుంచి తీసి గాలిని మెల్లగా  వదలాలి. ఇపుడు ఎడమవేపు ముక్కును చిటికెన వ్రేలుతో మూసి , కుడి ముక్కు నుంచి గాలిని మెల్లగా  పీల్చాలి. పైన చెప్పినట్లు రెండు ముక్కు పుటాలనూ మూసి లోపలగల గాలి క్రిందనున్న మూలాధారంపై ఒత్తిడి కలుగజేస్తున్నట్లు భావిస్తూ అక్కడ గాలిని కొంతసేపు నిలపాలి. పిదప ఎడమ ముక్కుపై నున్న వ్రేలును తీసి వేసి గాలిని ఎడమ ముక్కు ద్వారా మెల్లగా వదలాలి. ఇలా లోపలికి  పీల్చినపుడు దాన్ని పూరకము అని, లోపల బంధించి నపుడు కుంభకమనీ, బయటకు వదిలేటపుడు రేచకమనీ అంటారు. ఇలా ఎడమ వేపునుంచి గాలి పీలిస్తే దాన్ని కుడి వేపునుంచి బయటకు వదలాలి. అట్లే కుడి వేపునుంచి గాలి పీలిస్తే దాన్ని ఎడమ వేపు నుంచి వదలాలి. పూరకము, కుంభకము, రేచకమూ ఈ మూడు కలసి ఒక ప్రాణాయామం అవుతుంది. పూరించిన వేపునుంచి మరల పూరించ కూడదు. రేచించిన వేపునుంచే పూరించాలి. 

ఈ సాధనకు కాల  నియమాన్నిపాటించాలి. పూరక , కుంభక , రేచకముల నిష్పత్తి 1:4:2 గా ఉండాలని చెబుతారు. అంటే  4 క్షణాలు పూరకమైతే , 16 క్షణాలు కుంభకము , 8 క్షణాలు రేచకము అవుతాయి. అభ్యాసం చేస్తూ ఈ కాల  పరిమితిని పెంచుకోవాలి. ఇప్పటిదాక మనం చెప్పుకున్న దాన్లో గాలిని లోపల కుంభించడం జరిగింది. ఇలా కుంభించడం వల్ల మనలో ఉన్న నాడులన్నీ వాయువుతో నింపబడి దశవిధ వాయువుల చలనాన్ని ప్రేరేపిస్తాయి. అపుడు హృదయ కమలం వికసిస్తుందని విజ్ఞులు చెబుతారు.
ఈ నిష్పత్తినే పాటిస్తూ  పైన చెప్పిన విధంగా శ్వాసనుఒక వేపు నుండి  మెల్లగా పీల్చి మరో వేపు నుండి మెల్లగా వదలి గాలిని స్థంబింప చెయ్యాలి. అంటే రేచించిన పిదప కొంత సమయం పూరించకుండా ఉండటం అన్నమాట. దీన్నే బాహ్య కుంభకం అంటారు. 

నాడీశోధన, ప్రాణయామంలో బాహ్యకుంభకము, మామూలు ప్రాణయామం ఈమూడూ చెయ్యడం వల్ల నాడీశుద్ది కలుగుతుంది. ప్రాణాయామం అభ్యాసం చేసేటపుడు చెమటలు పడుతుంటే అది అధమ ప్రాణాయామంగాను, దేహంలో చలనం కలుగుతున్నట్లయితే అది మధ్యమమనీ , దేహం పైకి లేస్తున్నట్లు అనుభవం చెందితే అది ఉత్తమ ప్రాణయామమని  చెబుతారు. ప్రాణాయామం వల్ల చిత్తవృత్తి నిరోధం కలిగి పర్యవసానంగా కుండలినీశక్తి జాగృతం అవుతుంది. అసలు రాజయోగం అనే పేరు వినగానే మనకు ప్రాణాయామమే  అనేంత ప్రాచుర్యంలోకి వచ్చినది.

ప్రాణాయామంలో కుంభకాన్ని ఎవరంతట వారు చెయ్యకూడదు. యోగపరిజ్ఞానం  తెలిసిన నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే అభ్యాసం చెయ్యాలి అని పెద్దలు అంటారు. ఎడమ వేపునుంచి గాలి పీలిస్తే దాన్ని కుడి వేపునుంచి బయటకు వదలాలి. అట్లే కుడి వేపునుంచి గాలి పీలిస్తే దాన్ని ఎడమ వేపు నుంచి వదలాలి.  పూరించిన వేపునుంచి మరల పూరించ కూడదు. రేచించిన వేపునుంచే పూరించాలి. ఇలా గాలిని మెల్లగా ఒకవేపునుంచి  పీల్చి, పీల్చిన సమయానికి రెట్టింపు సమయాన్ని తీసుకొంటూ, మెల్లగా వదలాలి.  దీన్నీ, నాడీశోధననూ, శ్వాసను గమనించడం వంటివాటిని  ఎవరైనా చెయ్యవచ్చును.





2 comments:

  1. Sir,
    Your effort is laudable. I practiced 'pranayama' for sometime.Really This is a mystic science.One can experience it without any doubt.

    ......Murthy

    ReplyDelete