Saturday, July 14, 2012

భక్తి మార్గం (5)


భక్తి యోగంలో మరికొన్ని విషయాలు.
సంసార సాగరాన్ని దాటించడానికి పుణ్య క్షేత్రాలు , మహాత్ములు, సద్గుణాలు తోడ్పడతాయి. దాటించేదాన్ని తీర్థం అంటారు.  ఒక్కొక్క ఋషియొక్క తపోమహిమ చేత తీర్థం అయింది. అంచేత తీర్థ యాత్రలలో తాత్కాలికంగా అయినా యాత్రికుడి హృదయాన్ని ఆ తపోవిశేషం ఆకర్షిస్తుంది. ఆ బీజం క్రమాభివృద్ధి చెందటమే తీర్థ యాత్రా ఫలం. ఈ ఫలం ఆ తీర్థం యొక్క మహాత్మ్యం తెలిసినపుడే కల్గుతుంది. దానికి తోడుగా విశ్వాసం ఉండాలి. 

ఆత్మ మరొక అత్మవల్ల ప్రేరణ పొందుతుంది. ఇలాంటి ప్రేరణ శక్తి ఎవరిలో నుంచి ప్రసరిస్తుందో అతడే గురువు. దాన్ని గ్రహించేవాడు శిష్యుడు అని పెద్దలు చెబుతారు. అంతరంగంలో జిజ్ఞాస ఉదయిస్తే , జ్ఞానప్రదాత ఐన గురువు కన్పిస్తాడు. గురువును కలసి నపుడు తత్వజ్యోతి  తన మీద , కాంతి ప్రసరింప చెయ్యడం మొదలైనట్లు తన ఆత్మకు సహజంగానే తెలుస్తుందని అంటారు . వేద శాస్త్రవేత్త, పాపరహితుడు, కామగంధ దూరుడు , బ్రహ్మవేత్తలలో మేటి ఐన వాడే  నిజమైన గురువు.  సాధకుని కళ్ళు తెరిపించేవాడు గురువు. 
భక్తిలో బాహ్యశౌచం అంతగా పాటించడం సాధ్యం కాపోతే అంతరశౌచాన్నిఆచరించటం శ్రేయస్కరం.
భక్తి వైరాగ్యం – స్వాభావిక మైనది. దివ్యమైన జ్యోతిముందు చిరుదీపాలన్నీ ఎలా వెలవెలా పోతాయో, అలా భక్తి తేజం ముందు విషయసుఖాలు అణచి వేయబడతాయి. దీన్లో ఏ నిరోధమూ, ప్రయత్నమూ అవసరం లేదు. ఉన్నవాటిని భగవో న్ముఖం చెయ్యడమే భక్తుని పని . 

మనస్సు కాయిక,వాచిక, మానసిక భక్తుల మూడిట్లోను పనిచేస్తుంది. మనసు పనిచెయ్యకుండా మిగిలిన రెండూ ఉండలేవు. గోపికల క్రీడలన్నీ వారి మానసిక సంబంధమైనవే . శరీరంతో సంబంధాలు లేవు. యోగ ప్రభావంతో వారి మనస్సులు కర్మబందాలన్నిటినీ వీడి ఈశ్వరాధీనాలై, ఆయన ఆడించినట్లు ఆడాయి. ఇలాంటి  ఆటలో గుణ దోషాలుండవు. దేహాభిమానం ఉన్నంతవరకే నాది, నీది అనే తేడాలు. అది నశిస్తే తానెవరు ? పరుడెవరు? అంతా ఒక్కటే కదా!  గోపికలకు కృష్ణుడు తమ హృదయాల్లో ఉన్నాడు. సదా తన్మయత్వంలో ఉండేవారికి కాయిక వ్యాపారానికి అవకాశమే లేదు. అందునా గోపికలకు అలాంటి సుఖభావం బొత్తిగా లేదు. కృష్ణునికి సౌఖ్యం కూర్చడమే వారి స్వధర్మంగా భావించారు. పరాభక్తిలో అహంకార మమకారాలకు తావు లేదు. ఇది అత్మకున్న పరిపూర్ణత అనుభవంలోకి వచ్చే స్థితి.

భక్తుడు ద్వందాతీతుడు. అంచేత సుఖ దుఖాలుండవు.
సమర్పణ , ఆకర్షణల మధ్య ఉండే అడ్డంకులను తొలగించుకోడానికి చేసే ప్రయత్నమే సాధన అంటే.
దేశ, కాల ,పాత్రలను బట్టి ఒక కాలంలో ఉండే ఆచారాలు మరొక కాలంలో అంగీకరించరు.
పూజ, ధ్యానం, జపం, సంకీర్తనం , సేవ, దాన ధర్మాలు , తీర్థ యాత్రలూ ఒకటి మార్చి మరోటి చేస్తూండాలి.
పరమార్ధం ఒక్కటే అయినా , దాన్ని వివిధ రూపాల్లో, వారి బుద్ధిశక్తిని బట్టి చూస్తుంటారు. ఈ పరమార్ధం విషయంలో ఎవరికి ఏది ప్రియమని నమ్ముతారో , వారిని అలాగే కొనసాగ నివ్వాలి. భక్తియోగం యొక్క ఆశయం బ్రహ్మానుభవమే. 

No comments:

Post a Comment