Wednesday, August 29, 2012

ప్రపంచము లేక జగత్తు ఏర్పడ్డ విధానం-5


3) సృష్టి క్రమమును తెల్పు మరో పద్ధతి

ఇది త్రిశిఖి బ్రాహ్మణంలో ఉందని అంటారు. దీని ప్రకారం అవ్యక్తంగా ఉన్న ప్రకృతి యందు, సత్వ రజస్తమో గుణములు సామ్యావస్థలో ఉంటాయి. బ్రహ్మమునకు సృష్టి చెయ్యాలనే సంకల్పం కలగగానే, ఈ గుణములు హెచ్చు తగ్గులై సామ్యావస్థను కోల్పోతాయి. ఇది ఆత్మ సాన్నిధ్యం వల్ల జరుగుతుంది. ముందుగా మహత్తు ఏర్పడి అది  అనేకములు కావలెనని తలచగా, అనేకములై నేను నేనను భావముతో అహంకారముగా అయ్యింది. ఆ తర్వాత పంచతన్మాత్రలు ఏర్పడ్డాయి. సాత్విక అహంకారము నుండి మనస్సు, దశేంద్రియములు కలిగాయి. తామస అహంకారము నుండి పంచ మహాభూతములు కలిగాయి. ఈ విధంగా పది ఇంద్రియములు, పంచ తన్మాత్రలు, పంచ మహాభూతములు, మనస్సు బుద్ది అహంకారముఅనేవి  ప్రకృతితో కలసి ఇరువది నాలుగు తత్వములు ఏర్పడ్డాయి. ఈ ఇరువది నాలుగు తత్వాలలో మణుల యందు, దారము గ్రుచ్చబడినట్లు; పురుషుడు ఆత్మగా కలసి ఉన్నాడని చెబుతారు.
  
సాంఖ్యుల ప్రకారము మూల ప్రకృతి నుండి ముందుగా మహత్తత్వము(బుద్ది), దానివల్ల అహంకారము కలుగగా; సత్వగుణాధిక్యత గల అహంకారము నుండి మనస్సు, జ్ఞానేంద్రియములు కలిగినవంటారు. రజోగుణ ప్రధానమైన ఆహం కారము నుండి కర్మేంద్రియములును, తమోగుణ ఆధిక్యము గల అహంకారము నుండి శబ్దాది పంచ తన్మాత్రలు, వాటి నుండి పంచ మహాభూతములు పుట్టినవి. ఇలా ఇంద్రియములు పది, తన్మాత్రలు పంచభూతములు కలసి పది, మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, మనస్సు కలసి ఇరవైనాలుగు తత్వాలు ఏర్పడతాయని చెబుతారు.

{అహంకారం యొక్క సాత్విక భాగం నుండి మనస్సు, పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడతాయని కొందరు చెబుతారు. కొందరు కర్మేంద్రియాలు కూడ సాత్విక అహంకారం నుంచే ఏర్పడ్డాయని చెబుతారు. అంటే రాజసిక అహంకారం నుంచి ఏమీ ఏర్పడక సాత్విక తామసికాలను వాటి కార్యాచరణకు పురికొల్పుతుందని చెప్తారు}. ఇలా భిన్నాభిప్రాయాలు ఉండటం వల్ల మనకు తెలియ వలసిన దేమంటే; ఈ ఇరవైనాలుగు తత్వాలూ ప్రకృతి నుంచే ఏర్పడ్డాయి. వీటికి స్వతంత్రమైన ఉనికి లేదు. ఇవి నశించే స్వభావం కలిగి ఉండేవి. శాశ్వతాలు కావని. 
                                                                    ప్రపంచము లేక జగత్తు ఏర్పడ్డ విధానంసమాప్తం)     

  

No comments:

Post a Comment