Tuesday, June 12, 2012

యోగదర్శనం (1) – ఆస్తిక దర్శనం

కపిల ముని బోధించినది నిరీశ్వర సాంఖ్యం అయితే యోగాచార్యుడైన పతంజలి ఇరువది నాలుగు తత్వాలతోను, ఈశ్వరుడిని కూడా అంగీకరిస్తాడు. సాంఖ్య దర్శనం జ్ఞానాన్ని ముఖ్యంగా బోధిస్తే , ఈ వివేక జ్ఞానం కలగడానికి సాధనాలను యోగ దర్శనం ప్రతిపాదిస్తుంది. చిత్తంలో ఎప్పుడూ ఏవో భావాలు కల్గుతూనే ఉంటాయి. వాటిని చిత్తవృత్తులు అంటారు. ఆ చిత్తవృత్తులను పూర్తిగా అరికట్టడమే యోగం. యోగాన్ని సాధించడానికి అవసరమైన యమ నియమాలనే సాధనాలను యోగ దర్శనం బోధిస్తుంది. వైరాగ్యం మొదలైన వాటి ద్వారా చిత్తాన్ని శుద్ది చేసుకొని , ఏదొక వస్తువు  గాని, రూపం మీద గాని చిత్తాన్ని స్థిరంగా నిలపడం చేత చిత్త వృత్తులు అరికట్టబడతాయి. ఇలా ధ్యానం చెయ్యడానికి పరమేశ్వరునిపై చిత్తం నిలిపి యోగాన్ని సాధిస్తే ముక్తి లభిస్తుందని యోగ దర్శనం చెబుతుంది.

ప్రతీ వస్తువూ లేక విషయమూ సృష్టిలో అణువుల తోనే ఏర్పడింది. తిరిగి ఆ అణువులలోనే లయమవ్వాలి. అలాగే ప్రతీదీకూడా తిరిగి మార్పుచెందేదే. ఈ నియమం బాహ్య ప్రకృతిలోనే గాకుండా అంతర ప్రకృతిలోనూ ఉండేదే. మనస్సుకూడా దేన్లోనుంచి పుట్టిందో తిరిగి దాన్లోనే లయమవుతుంది. అదేవిధంగా మనకు మూలం పరమాత్మ కాబట్టి మనం కొరుకున్నా,కోరుకోకపోయినా ఈశ్వరుడు అనే మన సహజ స్థితిని పొందక తప్పదు.

మనసెపుడూ తన సహజశుద్దావస్తను చేరడానికి ప్రయత్నిస్తుంటుంది. కాని ఇంద్రియాలు దాన్ని బయటకు లాగుతూ ఉంటాయి.  మనస్సును నిగ్రహించి ఆత్మలో లయం చేసి అంతర్ముఖం చెయ్యడం యోగానికి మొదటి మెట్టు. ఇలా ప్రశాంతమైన మనస్సున్నపుడు మనం అత్మస్వరూపులమై ఉంటాం. ఈ యోగావస్థలో; తనస్వరూపంలో పురుషుడు సాక్షిగా ఉంటాడు. ఇతర సమయాలలో మనో వృత్తులతో సమాన స్వరూపాన్ని పొంది ఉంటాడు.

చిత్తానికి - క్షిప్త౦, మూఢ౦   , విక్షిప్త౦, ఏకాగ్ర౦ , నిరుద్ధ౦  అని అయిదు స్థితులున్నాయి. క్షిప్త స్థితిలో మనస్సు బహిర్ముఖమై ఒక దాని పిదప మరొకటి , ఇలా  అనేక విషయాలపై ప్రసరిస్తుంది.మూడావస్థలో  నిర్లిప్తంగా జడమై ఉంటుంది. విక్షిప్త అవస్థలో ఒకోసారి నిలకడగాను, మరోసారి నిలకడలేకను ఉంటూ అది బాహ్యవిషయాలనుంచి ఉపసంహరించుకొనే ప్రయత్నంలో ఉంటుంది.అందుచేత క్షిప్త, మూఢ  , విక్షిప్త అవస్థల్లో రజో, తమో గుణాల్లో చిక్కుకొని ఉండటం వల్ల యోగం సాధ్యం అవ్వదు.అభ్యాసం చేస్తూ ఉండగా సత్వగుణం మిగిలిన వాటికన్నా అధికమైనపుడు మనస్సు  ఒకే  విషయంపై ఏకాగ్రమవుతుంది. నిరుద్ధావస్థలో - మనస్సు ఏ విషయం మీదా గాకుండా తనలోనే లీనమై ఉంటుంది. మనస్సు తన ఆధీనంలోనే ఉంటుంది. ఏకాగ్ర స్థితినుంచి సమాధి స్థితికి కొనిపోయే స్థితే నిరుద్ధావస్థ. అదే ముక్తి లేక కైవల్యం.

చిత్తంలో ఎప్పుడూ ఏవో భావాలు కల్గుతూనే ఉంటాయి. ఇవి జ్ఞానేంద్రియాలు తెచ్చే విషయాల వల్ల కల్గుతాయి. వీటిని చిత్తవృత్తులు అంటారు. ఈ చిత్త వృత్తులను  ప్రమాణము , విపర్యయము , వికల్పము, నిద్ర, స్మృతి అని అయిదు విధాలుగా విభజించ బడ్డాయి.
ప్రమాణం - ఇంద్రియ విషయాల్లో మనకు కలిగే రెండు ప్రత్యక్ష అనుభవాలు పరస్పరమూ విరుద్ధం కాకపోతే , దాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా అంగీకరిస్తాం.  ప్రమాణం మళ్ళీ ప్రతక్షము, అనుమానము, ఆప్తవాక్యము అని మూడు రకాలు. మనకు ఏర్పడే విషయానుభవంలో భ్రమకు తావు లేనపుడు అది ప్రత్యక్ష ప్రమాణం.

దూరంగా మనకు కన్పించే పొగను చూసి, అక్కడ అగ్ని/ నిప్పు ఉందని గ్రహించడం వంటి జ్ఞానాన్ని అనుమాన ప్రమాణం అంటాం.

తత్వ దర్శులైన యోగుల ప్రత్యక్ష అనుభవమే ఆప్త వాక్యం.

విపర్యయం - లేనివస్తువు రూపంలో అది ఉన్నట్లు కల్గే మిధ్యా జ్ఞానమే విపర్యయ వృత్తి.  ఉదాహరణకు ముత్యపు చిప్పను చూచి అది వెండి అని భ్రాంతి  చెందటం వంటి జ్ఞానం.

వికల్పం - ఒక శబ్దం వినిపించింది అని అనుకుందాం. అది వినిపించగానే ఆ శబ్దం ఏమై ఉంటుందా అని ఆలోచించకుండా  ఫలానాది అని వెంటనే ఒక నిశ్చయానికి వచ్చేస్తాం.  ఇది శబ్ద జ్ఞానంతో అనుసరించే వృత్తి వికల్పం. ఇది చిత్త దౌర్బల్యానికి లక్షణం. వికల్పం అంటే ఇది.

నిద్రావృత్తి - ఇది తమోగుణ లక్షణం. నిద్రించినపుడు చిత్త వృత్తులు లేకపోతే ఎలాంటి   అనుకూల/ప్రతికూల  అనుభవాలూ కలుగవు. కాని నిద్రనుండి లేచిన తర్వాత 'నేను నిద్రించాను' అనే జ్ఞానం మనకు ఉంటుంది. ఆ నిద్రానుభవం స్మరణ మాత్రమే .  కలగని అనుభవాలని స్మరించడం కూడా కుదరదు. కాని నిద్రించాను అనే స్మృతి మనకు ఉంటుంది. అంచేత నిద్రావస్థలో  కూడ చిత్తంలో వృత్తులు ఉంటాయి. నిద్రావృత్తి అభావాన్ని ఆశ్రయించి ఉంటుంది. స్మృతి కూడ మరో చిత్త వృత్తే.

స్మృతి - ప్రమాణాల వల్ల అనుభవించిన విషయాలు జ్ఞాపకం రావడం స్మృతి వృత్తి.
నిద్ర అనే విచిత్ర వృత్తివల్ల చిత్తంలో స్మృతి వృత్తి కల్గుతుంది. అదే స్వప్నం. జాగ్రదావస్థలో స్మృతి వృత్తే నిద్రలో స్వప్నంగా రూపు దిద్దుకుంటుంది. 



No comments:

Post a Comment