Monday, June 25, 2012

అద్వైతం

ఆస్తిక దర్శనాలన్నీ జీవాత్మ, పరమాత్మ, జగత్తు లను గురించి  చర్చించి ఈ మూడిటికీ పరస్పరం ఉండే సంబంధాన్నే తెలిపాయి.  ఇవన్నీ మానవుడి  దుఖాన్ని తొలగించుకొని మోక్షం పొందటాన్ని  ధ్యేయంగా చెబుతున్నాయి. నాస్తిక దర్శనాలు కూడ దుఖం పోగొట్టుకొనేందుకే ఉద్దేశించబడ్డాయి . జీవుడు /పురుషుడు/ జీవాత్మను గురించి దాదాపు  అందరూ ఒప్పుకుంటారు. పరమాత్మ ఉన్నాడని కొందరు, లేదని కొందరు చెప్పడం జరిగింది. కనిపించే దృశ్య ప్రపంచంలోనే భిన్నాభిప్రాయాలు . కొందరు బ్రహ్మము కారణమంటే , మరికొందరు ప్రధానం కారణమని అలా వేర్వేరు ఆభిప్రాయాలను ఇదివరలో దర్శనాలు  శీర్షికలో చెప్పుకున్నట్లుగా వెల్లడించారు. 

బ్రహ్మము ఉందని చెప్పేవారిలో భేదాప్రాయాలు ఉండటం వల్ల వీరిలో అద్వైతులూ , ద్వైతులూ , విశిష్టా ద్వైతులని ముఖ్యంగా ప్రచారంలోకి రావడం జరిగింది. శంకరులు భగవద్గీత, ముఖ్యమైన పది ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలకూ భాష్యం వ్రాసి అద్వైత వేదంత సాంప్రదాయాన్ని స్థాపించారు. వేదాంతం అంటే అద్వైత వేదాంతమే అన్నంతగా బహుజన ప్రాచుర్యంలోకి వచ్చింది. వీరు చెప్పేది బ్రహ్మ ఒక్కటే సత్యం. జగత్తు మిధ్య. జీవుడు బ్రహ్మము కన్న వేరైనవాడు కాదు. అంటే విశ్వంలో ఉన్నది ఒక్క ఆత్మ మాత్రమే. జీవాత్మలన్నీ బ్రహ్మము యొక్క అంశాలే గాని వేరుకాదు.

వీరు బ్రహ్మమును రెండు విధాలుగా చెప్పేరు. నామరూపాలతో అనేక ఉపాధులతోను కూడిన బ్రహ్మము - సగుణ బ్రహ్మము   లేక అపర బ్రహ్మము .  ఈ అపర బ్రహ్మమే  జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయాలకు కారణం. నామరూపాత్మకంగా కన్పించే జగత్తు అవిద్య వల్ల ఏర్పడిన అధ్యాస . ఇది చీకటిలో వంకర టింకరగా పడిఉన్న త్రాడును చూసి పాము అనుకున్నట్లు అన్నమాట. దీన్ని అధ్యాస / అధ్యాసారోపణ అంటారు. ఇది అవిద్యవల్ల ఏర్పడుతోంది. వివేకంతో చూస్తే అపవాదు తొలగిపోయి సత్యం తెలుస్తుంది.
రెండవది -ఏ ఉపాధులూ లేని బ్రహ్మము - నిర్గుణ బ్రహ్మము  లేక పర బ్రహ్మము  .

జీవులు చైతన్య స్వరూపులు. స్వచ్చమైన ఎరుకతో ఉంటారు . నిత్య, శుద్ధ, బుద్ధ , ముక్తులైనప్పటికీ అంతఃకరణంతో తాదాత్మ్యం చెందటం వల్ల తామే కర్త, భోక్త అనుకుంటారు. శంకరులు  మరణానంతరం కలిగే క్రమ ముక్తిని ( అంటే మరణించిన పిదప కలిగే దేవయానం , బ్రహ్మలోక ప్రాప్తి తర్వాత కలిగే ముక్తి ) అంగీకరిస్తారు. అయినా సద్యో ముక్తి / జీవన్ముక్తి  జ్ఞానంవల్ల లభిస్తుందని చెబు తారు. బ్రహ్మము తనలో ఉండే మాయా శక్తివల్ల జగత్తును సృష్టించినట్లుగా శంకరులు చెబుతారు. ఏదైనా ఒకరి శక్తి అనేది తన కంటే భిన్నం కాదు. అలాగే బ్రహ్మం తన మాయా శక్తి చేత జగత్తు యొక్క సృష్టిని జరిపారని చెబుతారు.

తర్వాత కాలం వారిలో వల్లభాచార్యుల వారు శుద్ధ అద్వైత తత్వాన్ని ప్రతిపాదించారు. వీరు అనేదేమంటే శంకరులు బ్రహ్మం కంటే మాయ ఉందని అంగీకరించడంవల్ల అది ‘కేవల అద్వైతం’ అనబడుతోంది అని.

    








No comments:

Post a Comment