Tuesday, June 26, 2012

ద్వైతం


ద్వైత సాంప్రదాయానికి మూల పురుషుడు మధ్వాచార్యుల వారు. వైష్ణవ సాంప్రదాయంలో వీరిది సద్వైష్ణవం అంటారు. వీరి విచారణను తత్వవాదం అని చెబుతారు . మధ్వాచార్యులవారికి  తల్లితండ్రులు వాసుదేవ అని నామకరణం చేసేరు. క్రమంగా ఆనంద తీర్ధుడని, పూర్ణ ప్రజ్ఞ అనీ మద్వాచార్యులని  నామాంతరాలు పొందేరు.
ముఖ్య ప్రాణమైన  వాయువు యొక్క మొదటి అవతారం హనుమంతుడు. రెండవ అవతారం భీముడు .
శ్రీ మధ్వాచార్యుల వారు ముఖ్య ప్రాణం యొక్క మూడవ అవతారంగా చెప్పబడినది.

బ్రహ్మసూత్ర భాష్యం , అనుభాష్యం , న్యాయ వివరణం , అనువ్యాఖ్యానం అని సూత్ర ప్రస్థానంపై భాష్యం రచించేరు. వీటితో బాటు మొత్తం ముప్పై ఏడు రచనలను చేసేరు. వీటన్నిటినీ కలిపి సర్వమూలం అని పిలుస్తారు.
  
వీరి ద్వైతం ప్రకారం జీవాత్మ , పరమాత్మలు వేర్వేరుగా ఉంటాయి. అవి ఎప్పటికీ ఒక్కటి కాలేవు. జీవుడు ఎప్పటికీ నారాయణుడు కాలేడు. ఈ భేదం శాశ్వతంగా ఉంటుంది. 

శ్రుతిలో చెప్పబడిన బ్రహ్మము - హరి లేక  విష్ణువే . నారాయణుడని కూడ పిలుస్తారు. విష్ణువు సర్వ శ్రేష్ఠుడనీ , వైకుంఠం లేక స్వర్గం ఆయన నివాస స్థానం అనీ అక్కడ ఆయన సతి లక్ష్మీ దేవితో ఉంటాడనీ బోధిస్తారు. హరి సర్వ స్వతంత్రుడనీ, ఏ పేరుతో పిలచినా అది విష్ణువునే సూచిస్తుందని అంటారు.

జీవాత్మలూ , జగత్తు కూడ సత్యమైనవే కాని  స్వతంత్రమైనవి కావు. హరి కన్న భిన్నమైనవి. జీవులందరూ హరిపై ఆధారపడి ఉంటారు. జీవులు హరికి సేవ చెయ్యడానికే. పరిపూర్ణమైన భక్తి , సరైన జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది. ముక్తి అంటే బ్రహ్మముతో ఐక్యమవ్వడం కాదు. దుఖం పోయి ఆనందమయ స్థితిని పొందటమే.  
ముఖ్యంగా అయిదు విషయాలను ఎప్పటికీ భిన్నమైనవి అని  చెబుతారు. అవి    
1) జీవుడు ఈశ్వరుడు ఎప్పుడూ భిన్నమైన వారే. ఇక్కడ ఈశ్వరుడు అంటే   బ్రహ్మము లేక  విష్ణువు.
2) జడమైన వాటికి, ఈశ్వరునకు భేదం ఉంది.
3) రెండు జీవులు ఎపుడూ ఒకే లక్షణాలను కలిగి ఉండరు. రెండుజీవులకు మధ్య ఉండే భేదం.
4) జడమైన వాటికీ జీవునకూ  భేదం ఉంది .
5) రెండు జడమైన పదార్దాలకూ భేదం ఉంటుంది.

జగత్తు ఎలా సత్యమో , అలా ఈ భిన్నత్వమూ సత్యమే.
ఇలా ఈశ్వరునికీ జీవుడికీ , జీవుడికీ జగత్తుకీ , ఈశ్వరునికీ జగత్తుకీ ,జీవుడికీ జీవుడికీ , జగత్తులోని విషయాలలోనూ భిన్నత్వం చెప్పటం వల్ల ద్వైతంగా చెప్పబడుతోంది.



No comments:

Post a Comment