Thursday, June 14, 2012

యోగదర్శనం (3) – ఆస్తిక దర్శనం

పురుష/ జీవాత్మ అవిద్య చేత తాను నిర్మలుడననేది మరచిపోయి, ప్రకృతి విషయాలతో సంబంధమేర్పడి, సుఖ దుఖాది అనుభవాలకు లోనవుతూ ఉంటాడు. సాధనలతో ప్రయత్నం చేస్తే ఈ సంసారమనే జనన మరణ రూపకమై ఉన్న బంధంనుంచి విడివడి మోక్షాన్ని/ కైవల్యాన్ని పొందవచ్చునని చెబుతారు.

తపస్సు , స్వాధ్యాయం , ఈశ్వర ప్రణిదానం అనే ఈ మూడూ కలసి క్రియాయోగం అంటారు.
మనస్సు, శరీరాన్ని వశం చేసుకొని తగిన రీతిలో నిరోధించటం- తపస్సు.
ముక్తి మార్గాన్ని అందించే సద్గ్రంద పఠనం స్వాధ్యాయం. ఇది తన సిద్ధాంతాలని దృఢ పరచుకోడానికే. కర్మలను ఈశ్వరార్పణ చెయ్యడమే ఈశ్వర ప్రణిదానమంటే. చేసే కార్యం ఫలించినా భగ్నమైనా ఫలితాన్ని ఈశ్వరునికే అర్పించి స్వస్థ చిత్తంతో ఉండాలి.

అవిద్య, అస్మిత(అహంకారం), రాగం, ద్వేషం,అభినివేశం (ప్రాణం మీద తీపి) అనే అయిదూ క్లేశాలు. ఇవి సంసార బంధాలు. ఈ క్లేశాలను నివారించి సమాధి స్థితిని కల్గచెయ్యడానికే క్రియా యోగం ఏర్పడింది.

మొదట స్థూల మనోవికారాలను పిదప సూక్ష్మ వికారాలను వాటి వ్యతిరేక భావాలతో నిరోధించాలి.
అవిద్యాది క్లేశాలు కర్మలకు మూల కారణం. మనోవృత్తులు మంచివైనా, చెడువైనా క్లేశాలే. ఆత్మ స్వాతంత్ర్యానికి ప్రతి బంధకాలు. కర్మ పరిపాకం వల్ల జాతి, ఆయువు, సుఖ దుఃఖాలు కల్గు తాయి. పుణ్య పాప కర్మలు ఈ సుఖ దుఃఖాలకు హేతువు. ప్రకృతి దృశ్యాల సంయోగం వల్ల దుఃఖాలు కల్గుతుంటాయి. అంచేత వాటిని వదలాలి. పురుషుడు- మనస్సు మొదలుకొని స్థూల భూతాల వరకు ఉన్న ప్రకృతిని దృశ్యాలుగా చూస్తాడు. స్వతఃగా శుద్ధుడైన పురుషుడు ఈదృశ్యాల సంయోగంతో సుఖ దుఃఖాలు తనమీద ప్రతిబింబించే సమయంలో వాటిని తనే అనుభవిస్తున్నట్లు భావిస్తాడు. పురుషుడు ప్రకృతితో సంయోగం వల్ల తన దివ్యత్వాన్ని మరచి ఉన్నాడు. పురుషునికి అనుభవాన్ని కూర్చడమే ప్రకృతి ప్రయోజనం.

ఈ దుఃఖమయమైన ప్రపంచంలో కొన్ని బంగారు బంతులు దొర్లుతుంటే , లోకం వాటి వెంట పడుతుంది. ఐహిక జీవితం క్షణభంగురం. ఇది తాత్కాలిక అనుభవం మాత్రమే.  సంసారాన్నుండి తరించాలన్నది గుర్తించండి. మన స్వస్వరూపాన్ని మరువకుంటే సమస్త బంధాలూ తొలగి పోతాయి. మనంత మనమే ఈ ప్రకృతితో సంయోగమనే వలలో చిక్కుకొని దీనులమను కొంటున్నాం.
పురుషుడు ప్రకృతికన్న అతీతుడు,వాటి తత్వాలకన్నభిన్నుడు. బుద్దికన్న, మనస్సుకన్న,తన్మాత్రల కన్నస్థూల భూతాలకన్నను వేరైనవాడు. కేవలుడై ఉండటం వల్ల శాశ్వతుడని సాంఖ్యులు చెబుతారు. సంయోగ జనితం కాని వస్తువుకు ఎట్టి వికారాలూ కలుగవు. ఇలాంటి పురుషులు /లేక ఆత్మలు అనేకం ఉన్నాయంటారు.

బుద్దితత్వం స్వయం ప్రకాశం కాదు. అత్మవల్ల ఇది ప్రకాశవంతమవుతుంది. సాక్షి పురుషుడు చైతన్య మాతృడై , శుద్దుడై ఉన్నప్పటికీ బుద్ధిలో భాసించే వృత్తులననుసరించి చూస్తుంటాడు. స్పటికం ఎదుట ఎర్రని పూవును ఉంచితే ఎలా ఎర్రగా స్ఫటికం కన్పిస్తుందో, అలాగే సుఖదుఃఖాలు కూడ పురుషునిలో కేవలం ప్రతిబింబాలు మాత్రమే. స్వయంగా పురుషుడు నిర్వికారుడు.బుద్దితత్వం వృద్ది క్షయాలను చెందుతూ వికారాలను కలిగి ఉండటం వల్ల అది శాశ్వతమైనది కాదు. బుద్ది స్వతంత్రమైనది కాదు.ప్రకృతితో సంబంధపడి  ఉండేవన్నీ ప్రకృతి యందే ఉండటంవల్ల బద్దమై ఉంటాయి. వివిధ ఇంద్రియానుభవాలు, సుఖదుఃఖాలు దేన్లో ఏకత్వం పొందు తున్నాయో ఆ పురుష తత్వం బుద్ధికి అతీతమై ఉంది.

ఇంద్రియాలన్నిటికీ పురుషుడే కేంద్ర స్థానం. బుద్దితత్వం నుండి భాసించే సమయంలో జ్ఞాన రూపం పొంది దేశ
, కాల, నిమిత్తాల వల్ల బధ్ధమవుతుందని యోగులు  గ్రహిస్తారు.
పురుషునికోసం ఏర్పడిన ప్రకృతి స్వయం ప్రకాశం కాదు. పురుషుని సంపర్కం ఉన్నంత కాలం మాత్రమే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. తాను ప్రకృతి కన్న అతీతుడననే నిజాన్ని గ్రహించిన ముక్తుడుని, ప్రకృతి మోహింప చెయ్యదు. కాని మిగిలిన బధ్ధజీవులకు యధాతధంగానే ఉంటుంది. అంచేత సాంఖ్యులు ప్రకృతి నిత్యమైనది అంటారు. నాకో శరీరము, నీకో శరీరమూ ఉందనుకోవడం మిధ్య. జగత్తంతా ఏక పదార్ధ రాశి. దాన్లో నువ్వొక కణం, నేనొక కణమూను.

జగత్తు ఎపుడూ మార్పు చెందుతూనే ఉంటుంది. అవిద్యయే ఈ శరీర భ్రాంతికి కారణం. సత్యాన్ని తెలుసుకొని ప్రకృతి అధీనం నుంచి తొలగటమే యోగానికి ప్రధాన ఆశయం. బాహ్య, అంతర ప్రకృతిల నంతా నిరోధించి, దివ్యత్వాన్ని వ్యక్తం చెయ్యడమే జీవిత ఆశయం. అంతర ప్రకృతిని నిరోధిస్తే బాహ్య ప్రకృతిని నిరోధించడం సులభం. దృశ్య ప్రపంచమంతా సూక్ష్మప్రపంచం యొక్క వ్యక్తీకరణ. అలాగే భౌతిక శక్తులు సూక్ష్మ శక్తుల వ్యక్తీకరణ.

పురుషుడు ఎట్టి వికారాలు పొందడని గ్రహించటమే మన పరమావధి. ఉత్పత్తి ప్రళయాలను పొందుతూ నిరంతరం మార్పు చెందేది ప్రకృతే. నిశ్చలమైన దీక్షతో నితానిత్య వివేకం చెయ్యడం మొదలు పెట్టగానే అజ్ఞానం తొలగి, పురుషుడు స్వయం జ్యోతిగా ప్రకాశిస్తాడు. ఈ స్థితిలో జ్ఞానం నిరాశ్రయమై ఉండటం వల్ల అన్ని విషయాలూ జ్ఞానతేజం వల్లనే భాసిస్తుంటాయి. ఇదే చరమావస్థ.

యోగాచార్యుడైన పతంజలి ; యమము, నియమము, ఆసనము, ప్రాణయామము, ప్రత్యాహారము అనే అయిదు బహిరంగ యోగమార్గాలనీ ; ధారణ , ధ్యాన, సమాధి అనే మూడు అంతరంగిక యోగమార్గాలనీ బోధించాడు. వీటిలో మొదటి అయిదూ మనసులో నాటుకుంటే సమాధి స్థితికి చేరుకోడం సులభమవుతుందని అంటారు.యమము లో అయిదు దీక్షలు చెప్పబడ్డాయి.
అవి అహింస , సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. ఇక శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము , ఈశ్వర ప్రణిధానము అనేవి నియమాల్లోకి వస్తాయి. ఇలా యోగ దర్శనానికి ఎనిమిది సాధనా౦గాలు చెప్పబడటం వల్ల దీన్ని అష్టాంగ మార్గంగా చెబుతారు.






No comments:

Post a Comment