Thursday, June 14, 2012

న్యాయ దర్శనం - ఆస్తిక దర్శనం

దీనికి మూలపురుషుడు గౌతమముని. గౌతమముని రచించిన న్యాయ సూత్రాల ఆధారంగా నిశితంగా పరిశీలించి విషయాలను నిర్ధారిస్తారు. వీరిని నైయాయికులు అంటారు. న్యాయ దర్శనాన్ని తత్వవిద్య అనికూడా అంటారు. ఇది చాల వరకు తర్కం మీద ఆధారపడి ఉంటుంది. వీరు ప్రత్యక్షము , అనుమానము , ఉపమానము , శబ్దము అనే నాల్గు ప్రమాణాలను అంగీకరిస్తారు. ఈ ప్రమాణాల చేత ఆత్మ, శరీరం , జ్ఞానేంద్రియములు , వాటి యొక్క విషయాలు, బుద్ది, మనస్సు, ప్రవృత్తి, దోషాలు, పునర్జన్మ, ఫలం అంటే కష్ట సుఖాల జ్ఞానం , దుఃఖము, అపవర్గము/మోక్షము అనే వాటిని ప్రమేయాలుగా  తెలుసుకుంటారు. ఈ ప్రమాణాల ద్వారా సత్యాన్ని తెలుసుకోవడమే వీరి  లక్ష్యం.  
నైయాయికులు ప్రమాణాలు, ప్రమేయాలు, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం , జాతి , నిగ్రహస్థానం  అనే పదహారు పదార్ధాలను అంగీకరిస్తారు.

నైయాయికుల లక్ష్యం కూడ మోక్షమే. వీరు ఆత్మ, పరమాత్మలను అంగీకరిస్తూ తత్వజ్ఞానం చేత మోక్షం లభిస్తుందని చెబుతారు. మనస్సు అణుపరిమాణం కల్గి ఉంటుందనీ, అత్మకిది సుఖ దుఃఖానుభవాన్ని కల్గిస్తుందనీ అంటారు.  ఇంద్రియాల ద్వారా విషయాలతో ఆత్మకు సంపర్కం కలిగినపుడు జ్ఞానం  పుడుతుంది. మిధ్యాజ్ఞానం వల్ల రాగము, ద్వేషము, మోహము ఏర్పడి వాటివల్ల కర్మలు చేస్తూ జీవుడు సంసార బంధంలో చిక్కుకుంటాడు.  నిజానికి  ఆత్మ; మనస్సు, బుద్ది, ఇంద్రియాదుల కన్నభిన్నమైనా అజ్ఞానం వల్ల ఒకటిగానే తోస్తుంది. తత్వజ్ఞానం కలగగానే యదార్ధ స్వరూపం తెలిసి బంధం తొలగి మోక్షం లభిస్తుంది. దుఃఖం లేకపోవడమే మోక్షం అంటారు.

వీరు అంగీకరించే  16 పదార్ధాలతో సత్యాన్ని  తెలిసుకుని దుఃఖవిముక్తి చెంద వచ్చని చెబుతారు. వీరు కూడాప్రపంచం పరమాణువులతో ఏర్పడిందని వైశేషికుల లానే నమ్ముతారు. ఈ భౌతిక ప్రపంచం పృథ్వి, నీరు, వాయువు, అగ్ని అనే భూత చతుష్టయం  వీటి  పరమాణువుల నుంఛి ఏర్పడిందని , వీటితోబాటు  దిక్కు , కాలము, ఆకాశము, మనస్సులు, ఆత్మలతో ఈశ్వరుడే  స్థూల , సూక్ష్మ పదార్ధాలతో ఆత్మల కర్మలననుసరించి ఈ సృష్టిని జరుపుతాడని విశ్వసిస్తారు. ఈవిధంగా పరమాత్మ నిమిత్త కారణమైన వాడే గాని ఉపాదాన కారణం గాడు. ఇలా పరమాత్మసృష్టి , స్థితి, లయములకు కారణమవడం చేత సర్వజ్ఞుడుగా చెబుతారు . జీవాత్మలు అనేకం ఉంటాయి . అవి నిత్యమైనవి. సర్వ వ్యాపకము కూడా. మనస్సు అణుపరిమాణం గలది. జీవులకు చైతన్యం మనస్సు చేతనే  కల్గుతుంది గాని మౌలికంగా జీవాత్మలకు చైతన్యం లేదని అంటారు.  తత్వజ్ఞానం - శ్రవణ, మనన, నిదిధ్యాసలను  సాధనగా చేసుకోడం వల్ల కల్గుతుంది. తత్వజ్ఞానం కల్గినపుడు మిధ్యాజ్ఞానం తొలగి మోక్షం లభిస్తుంది. మోక్షమంటే సంసారబంధం నుంచి విడివడటమే.

ఈ ప్రపంచం అనేక అవయవాలు గల కార్యం. దీన్ని నిర్మించడానికి ఒక సమర్ధుడైన వాడు లేకపోతే ఈ నిర్మాణం కుదరదనీ , ఆ సమర్ధమైన వాడే ఈశ్వరుడని యుక్తిచేత సాధిస్తారు. ఇలా భూత పరమాణువుల  సహాయంతో వారి వారి పాప పుణ్యాలను బట్టి ఫలాలను అనుభవించడానికి జగత్తును, జీవ రాసులనూ సృష్టిస్తాడు. ఎప్పటికైనా ప్రతీ జీవుడు తత్వజ్ఞానం సంపాదించుకొని మోక్షం పొంద వచ్చునని చెబుతారు.
 


No comments:

Post a Comment