Monday, June 18, 2012

వైశేషిక దర్శనం (2) - ఆస్తిక దర్శనం

2) గుణం - గుణం ఎపుడూ ద్రవ్యంతోనే ఉంటుంది.
ఒక గుణంలో మరొక గుణం గాని , కర్మగాని ఉండదు.
ఇలాంటి రసాది గుణాలు ఇరవై నాలుగు ఉన్నాయి.
అవి స్పర్శ , రస,రూప, గంధాలనేవి ,సంఖ్య, పరిమాణం, ప్రుతక్త్వ (ప్రత్యేకత్వం), సంయోగ
విభాగ, పరత్వ , అపరత్వ , గురుత్వ, ద్రవత్వ , స్నేహ, శబ్ద, బుధ్ధి
సుఖ, దుఃఖ, ఇచ్ఛ ,ద్వేష , ప్రయత్న, ధర్మ, అధర్మ, సంస్కారాలనేవి.
పదార్ధాలకు ఉనికి ఉంటుంది గాని గుణాలకు లేదు.

3) కర్మ - కర్మలు నాల్గు విధాలు. అవి
ఉత్క్షేపణం (పైకి విసరడం )
అవక్షేపణం (క్రిందికి విసరడం)
ఆకుంచనం (ముణవటం )
ప్రసారణం (చాపటం) అనేవి.
కర్మలకు ప్రత్యేకమైన ఉనికి లేదు. ద్రవ్యాన్ని ఆశ్రయించే ఉంటుంటాయి.

4) సామాన్యం - అంటే జాతి. ఉదాహరణకు గోవులు ఉంటే , వాటి అన్నిట్లోనూ' గోత్వం' అనే జాతి ఉంటుంది.
అది గోవు పుడితే పుట్టదు, అది మరణిస్తే నశించదు.
అంచేత సామాన్యం అనేది నిత్యమైనది. అనేక వస్తువులను ఆశ్రయించుకొని ఉంటుంది.

5) విశేషం - ఒక వస్తువును అవయవ విశేషాలను, గుణాలను బట్టీ మరొక వస్తువుకన్న భిన్నమైనదని చెబుతాం.
కాని సమాన గుణాలు ఉండే రెండు పృధ్వీ పరమాణువులలో అవి భిన్నమైనవని చెప్పే కారణం ఏదీ కన్పించదు. అందుచేత ఈ పరమాణువులో ఒక విశేషము, ఆ పరమాణువులోమరో  విశేషము ఉందని; ఆ విశేషాన్ని బట్టి ఆ రెండూ భిన్నమైనవని చెప్పాలి. ఇలాంటి విశేషం నిత్యాలైన పరమాణువులలో ఉంటుంది. 
ఇట్టి విశేషాలను అంగీకరించడం చేత వీరిని వైశేషికులు అని అంటారు.

6) సమవాయం - అంటే స్వాభావికంగా పదార్ధంలో ఉండే విడదీయరాని సంబంధం. అది నిత్యమైనది.
ఉదాహరణకు ఎర్రదనం ఎర్రని వస్తువునుంచి ఎలా విడదీయలేమో అలాంటి సంబంధం.
అలాగే మట్టిని కుండనుంచి విడదీయరాని సంబంధం కూడా సమవాయం.

7) అభావం - మనం రాత్రిపూట ఆకాశంలోకి రాత్రులలో చూస్తే , సూర్యుడు కన్పించడు కాని చంద్రుడిని  నక్షత్రాలనీ చూస్తాం. ఇలాంటి వ్యతిరేక భావాన్ని అభావం అంటాం. ఈ అభావం నాలుగు విధాలు.

అ ) ప్రాగభావం - ఒక వస్తువు పుట్టడానికి పూర్వం లేకపోవడాన్ని ప్రాగభావం అంటారు. ఉదాహరణకు ఘటం తయారు చెయ్యడానికి ముందు ఘటం లేదు కాబట్టి ఈ అభావం ప్రాగభావం.

ఆ ) ప్రధ్వంసాభావం - పుట్టిన వస్తువు కొంతకాలం ఉండి, నశించిన తర్వాత ఏర్పడే అభావం ప్రధ్వంసాభావం. ఉదాహరణకు ఘటం బ్రద్దలైపోడం చేత ఏర్పడిన అభావం ప్రధ్వంసాభావం.

ఇ) అత్యంతాభావం - ఒక వస్తువు ఎన్నాడూలేకపోడం అత్యంతాభావం. ఉదాహరణకు వాయువునందు ఎన్నడూ రూపం ఉండదు. దాన్లో రూపం లేకపోవడం అత్యంతాభావం.

ఈ) అన్యోన్యాభావం - ఘటం పటం కాదు , పటం ఘటం కాదు అనే పరస్పర భేదం  అన్యోన్యాభావం . 

సామాన్య ధర్మములుండే పరమాణువులను బట్టి గంధ,రస,రూప,స్పర్శ  లనేనాల్గు విశేషాలుగా  చెప్పబడ్డాయి.
పదార్ధ విశేషాలను బట్టి పరమాణువులతో ఇవి ఏర్పడటం వల్ల నిత్యమైనవి. గంధ,రస,రూప,స్పర్శ లనేనాల్గు విశేషాలూ క్రమంగా పృథ్వికి - గంధము, జలమునకు - రుచి, అగ్ని యందు - రూపము , వాయువునకు - స్పర్శ అనే గుణాలు ఉన్నాయి. 
ఇదివరలో చెప్పుకున్నట్లు ఆకాశమందు - శబ్దం ఉంది. శబ్ద, గంధ,రస,రూప,స్పర్శ లనే జ్ఞానేంద్రియాలు ఈ పరమాణువుల తోనే  ఏర్పడుతున్నాయి. ఈ ఇంద్రియ జ్ఞానం కలగడానికి  మనస్సు కారణం. ఆత్మ అన్ని అనుభవాలకీ  మూలం. మనస్సు ఈ విషయ జ్ఞానం కలగడానికి సాధనం.

వైశేషికులు ఎన్ని ఆత్మలు ఉంటాయో  అన్ని మనస్సులూ ఉంటాయంటారు. దుఃఖం లేకపోడమే మోక్షమని అంటారు. ఈశ్వరుడు, జీవాత్మ, మోక్షం అనే విషయాల్లో వీరు నైయాయికుల మతాన్నే అంగీకరిస్తారు. ఈశ్వర ప్రోక్తమైన వేదాలను   ప్రామాణికంగా ఇరువురూ అంగీకరిస్తారు.



No comments:

Post a Comment