Wednesday, June 20, 2012

పూర్వ మీమాంసా దర్శనం – ఆస్తిక దర్శనం


వేదాలు అపౌరుషేయాలు. అంటే ఎవరో మానవ మాత్రుడు వ్రాసినవి కావు. వీరు వేద ప్రమాణాన్ని అంగీకరిస్తారు . కాని ఈశ్వరత్వాన్ని అంగీకరించరు. వేద ప్రమాణాన్ని అంగీకరించడం వల్ల ఆస్తికులుగా పరిగణించ బడుతున్నారు. వేదాల యొక్క పూర్వ భాగాల ఆధారంగా ఉన్దేడవడం వల్ల దీనికి పూర్వ మీమాంస దర్శనం అని పిలువబడుతోంది.

ఈ పూర్వ మీమాంసా దర్శనానికి జైమిని మహర్షి మూలపురుషుడు. జైమిని వ్రాసిన సూత్రాలకు శబర స్వామి భాష్యం రచించడం జరిగింది. ఈ భాష్యానికి ప్రభాకరుడు, కుమారిల భట్టు వ్యాఖ్యానాలు వ్రాశారు. వీరిరువురిలో ముఖ్యవిషయాలలో భేదం లేపోయినా , కొన్ని అంశాలలో అభిప్రాయ భేదాలున్నాయి. వీట్లో భట్ట మతానికే అధికంగా ప్రాధాన్యత లభించింది. ప్రభాకరులు ప్రత్యక్షం, అనుమానం , ఉపమానం , శబ్దం , అర్ధాపత్తి అనే అయిదు ప్రమాణాలను అంగీకరిస్తే, కుమారిలభట్టు అనుపలబ్ది అనే ఆరవ ప్రమాణాన్ని కూడ తీసుకున్నారు. 

ఒక ఫలితాన్ని బట్టి దాని కారణాన్ని ఊహించడం – అర్ధాపత్తి.
ఉదా – ఒక వ్యక్తి పగలు భోజనం చెయ్యడు కాని బలిసి ఉన్నాడు అంటే రాత్రి పూట గుప్తంగా భోజనం చేస్తాడు అనేది గ్రహిస్తాం . ఇదీ అర్దాపత్తి అంటే.

 అనుపలబ్ది - ఇక్కడ ఘటం లేదు . ఉంటె కనపడేది కదా అన్నపుడు , ఘటం లేదని చెప్పడానికి ప్రమాణం అది అక్కడ లేపోవడం. ఇది అనుపలబ్ది ప్రమాణం అంటే. 

ఈ శాస్త్రం కర్మకాండను సమర్ధిస్తుంది . ఇలా చెయ్యాలి అని వేదంలో చెప్పినదంతా ధర్మం. ఇలా చెయ్యకూడదని నిషేధించినదంతా అధర్మం. అంచేత వేద విహితాలైన కర్మలను స్వధర్మంగా ఆచరిస్తుండాలి. ఇలా స్వధర్మాన్ని అనుష్ఠానం చేస్తే క్రమంగా చిత్త శుద్ది కల్గి  కర్మబంధం నశించి మోక్షం లభిస్తుందని చెబుతారు. ప్రస్తుతం జరుగుతున్న జన్మ, ప్రారబ్ధ కర్మ వల్ల లభించిందనీ శరీరం పతనమైన పిదప ఇక మిగిలి మరోజన్మను కలిగించేది ఏదీ ఉండదని, అదే మొక్షంగా పరిణమిస్తుందనీ కొందరు నమ్ముతారు. మరి కొందరు మోక్షమంటే అవిచ్చిన్నమైన ఆనందరూమైనదని చెబుతారు.

ఆత్మ నిత్యము , మరణ రహితము . దానికి జ్ఞానం సహజం కాదు. ఆత్మ దేహేన్ద్రియాదులతో సంబంధ పడినపుడే అవి విషయాలను గ్రహించే సమయంలో మాత్రమే జ్ఞానం కల్గుతుంది. దేహ భేదాలను బట్టి జీవులు అనేకులుగా ఉంటారు. అలా ఆత్మలు కూడ అనేకం ఉంటాయి. ఆత్మ నిత్యమైనదైనా కర్మల ఫలితాల వల్ల వివిధ శరీరాలను పొంది ఈ సంసారంలో చిక్కుకొని ఉంటుంది. జీవుల కర్మలననుసరించే ప్రపంచంలో పదార్ధాలు పుడుతున్నాయి.కర్మయే సర్వ శక్తిగా లోకవ్యవహారాన్ని నడుపుతూ ఉంది. మానవుడు ఇక్కడ చేసిన కర్మలచేత అతని ఆత్మలో ఒక శక్తి పుడుతుంది. దీన్ని అపూర్వం అని అంటారు వీరు. చేసిన కర్మ నశించి పోయినా , ఈ అపూర్వం జీవుణ్ణి అంటిపెట్టుకుని దేశాంతర , కాలాంతరాలలో జీవునికి తగిన ఫలాలను ఇస్తుందని పూర్వ మీమాంసకులు అంటారు.
 
వీరు ఈ కన్పించే జగత్తంతా సత్యమని, ఆద్యంతాలు లేనిదనీ, అన్ని కాలాలలోనూ జగత్తు యొక్క వ్యవహారం ఇలా సాగుతున్నదనీ , అంచేత భగవంతుడిని అంగీకరించా వలసిన పని లేదని చెబుతారు. ప్రాచీన మీమాంసకులు స్వధర్మానుష్టానం చేత స్వర్గం లభిస్తుందని అంగీకరిస్తే, తర్వాతి వారు నిష్కామ కర్మ చేత మోక్షం కలుగుతుందని చెబుతారు.

No comments:

Post a Comment