Friday, June 15, 2012

వైశేషిక దర్శనం (1) - ఆస్తిక దర్శనం

వైశేషిక దర్శనానికి మూలపురుషుడు కణాద మహర్షి. ఈయనను  ఉలూకుడని కూడ పిలుస్తారు. వీరి సిద్ధాంతం  న్యాయ దర్శనానికి దగ్గరలో ఉంటుంది. ఏడు పదార్ధాల ఉనికిని  జ్ఞానవిషయాలుగా వీరు అంగీకరిస్తారు. ఈ ప్రపంచంలోఉండే వస్తు సముదాయంగాని , విషయాలు గాని ద్రవ్యము, గుణము,  కర్మ, సామాన్యము,  విశేషము, సమవాయము, అభావము అనే  ఈ ఏడు పదార్ధాల కోవకే చెందుతాయి. వీటిని సరిగ్గా పరిశీలించి తెలుసుకుంటే ; తత్వం అవగతమై , రాగ, భయాలకు దూరమవడంచేత జీవుడు  సుఖ దుఃఖాలకు లోనుగాడు.

వైశేషికులు అభ్యుదయాన్ని కల్గించే ధర్మాన్ని చెప్పి , మోక్షానికి దారి చూపిస్తారు.
ఈ ప్రపంచం కొన్ని పరమాణువుల సముదాయంతో నిర్మించ బడింది. భిన్నమైన పరమాణువుల  కలయిక  చేత  పదార్ధం ఏర్పడుతుంది. ఆత్మల కర్మానుసారాన్నిబట్టి పరమాణువులలో చైతన్యం కల్గించి పరమాత్మయే ఈ జగత్తు యొక్క సృష్టి , స్థితి, లయాలకు కారణమవుతాడు. పదార్ధం యొక్క గుణ స్వభావం దాన్లో కలిసే పరమాణువులపై ఆధారపడి ఉంటుంది. ఇపుడు మనం ఒక్కొక పదార్ధం గురించి విచారణ చేద్దాం.

1) ద్రవ్యము

ద్రవ్యాన్ని ఆశ్రయించుకొని గుణములు, కర్మలు ఉంటాయి.
ఇలా తొమ్మిది ద్రవ్యాలు ఉన్నాయి.
పృథ్వి, తేజస్సు,  జలము, వాయువు  అనే నాలుగు భూతములు మరియు  ఆకాశము , కాలము, దిశ ,ఆత్మ, మనస్సు అనేవి అన్నీ కలసి తొమ్మిది.
వీటిలో మొదటి మూడూ బాహ్యంగా  ప్రత్యక్షానుభవంలోకి వస్తాయి.
పృథ్వి, తేజస్సు,  జలము, వాయువు , ఆకాశము , కాలము మన అనుభవంలోకి వస్తాయి.
కాని దిశ,ఆత్మ,మనస్సు అనేవి బుద్దిచేతనే గ్రహించ బడతాయి.
పృథ్వి, తేజస్సు,  జలము, వాయువు  సృష్టికి ముందు పరమాణువులుగా ఉండేవి.
ఆకాశము, కాలము, దిశ/దిక్కు  ,ఆత్మ సర్వవ్యాపకములు. ఇవి అణుసంపర్కం లేనివి.
మనస్సు అణుపరమాణం గలడవడం చేత ఒకక్షణంలో ఒక జ్ఞానాన్ని మాత్రమే కల్గి ఉంటుంది.
ఆత్మ నిత్యము, సర్వ వ్యాపకము , జ్ఞానానికి కారణమూను.
జీవాత్మ మనస్సు చేతనే గ్రహించ బడతాడు. పరమాత్మ అనుమాన ప్రమాణం చేత గ్రహించ బడతాడు.
వైశేషికులు జీవాత్మ  పరమాత్మలను అంగీకరిస్తారు. పరమాత్మఒక్కడేననీ, జీవాత్మలు అనేకం
ఉంటాయని చెబుతారు.
ద్రవ్యంలో ఉండే తొమ్మిది శాశ్వతమైన అంశాలను తెలుసుకుంటే, పరమాత్మ జ్ఞానం కల్గుతుంది అని చెబుతారు.

మౌలికంగా పృథ్వి,  జలము, అగ్ని, వాయువులలో  భేదం చూద్దాం.
భూమికి - వాసన, రుచి, రూపము , స్పర్శ అనే  పరమాణువుల యొక్క విశేషాలు ఉన్నాయి.
జలమునకు - రుచి, రూపము , స్పర్శ అనే  పరమాణువుల యొక్క విశేషాలు ఉన్నాయి.
అగ్నికి - రూపము , స్పర్శ అనే  పరమాణువుల యొక్క విశేషాలు ఉన్నాయి.
వాయువుకు - స్పర్శ అనే  పరమాణువు యొక్క విశేషం మాత్రమే ఉంది.
ఇలా భూమియందు గంధము/వాసన , జలమునందు రుచి, అగ్నియందు రూపము, వాయువు నందు స్పర్శ ఏర్పడ్డాయి.

ఇక శబ్దం సర్వవ్యాపకము, నిత్యము, పరమాణువులతో కూడిన సూక్ష్మాకాశం వల్ల ఏర్పడింది.
ఈ విధంగా పరిశీలిస్తే ఒకదానికన్న మరొకటి సూక్ష్మతమమవుతూ వచ్చాయి.
మనకు వివిధ  జ్ఞానాన్ని కల్గించే ఇంద్రియాలు ఈ పరమాణువుల వల్లనే ఏర్పడి ; ప్రపంచ విషయాలను తెలుసు కుంటున్నాం .
ద్రవ్యమే దానినుంచి ఉత్పన్నమయ్యే విషయాలకు, గుణాలకు, కర్మలకు ఉపాదాన కారణం.
గుణము - ద్రవ్య, గుణ, కర్మలకు మూడిటికీ నిమిత్త కారణం.
గుణము, కర్మ, సామాన్యము, విశేషము అనేవి పదార్ధధర్మాన్ని బట్టి పదార్ధంలో స్వతస్సిద్ధంగా ఇమిడి ఉంటాయి.
ఇలాంటి వివిధపదార్ధాల చేతనే జగత్తు సృష్టించ బడుతోంది.
ద్రవ్యం నుంచి ఏర్పడ్డ తొమ్మిది విషయాలను తెలుసుకుంటే సత్యం తెలుస్తుంది.


No comments:

Post a Comment