Wednesday, June 6, 2012

బౌద్ధ దర్శనం (2) నాస్తిక దర్శనం

సమ్యగ్ దృష్టి , సమ్యగ్ సంకల్పం , సమ్యగ్ వాక్కు , సమ్యగ్ కర్మాంతం , 
సమ్యగ్ జీవనం , సమ్యగ్ వ్యాయామం , సమ్యగ్ స్మృతి , సమ్యగ్ సమాధి 
అని చెప్పబడే అష్టాంగమార్గం ద్వారా దుఃఖాన్ని తొలగించుకోవచ్చు. 
ఇక్కడ చెప్పబడిన అష్టాంగమార్గం యోగాచార్యుడైన పతంజలి  అష్టాంగమార్గం కాదు. 
దీనిలో చెప్పిన విషయాలను ఆచరించడంవల్ల మనస్సు ఏకాగ్రమై, ధ్యానస్థితి కల్గి 'నిర్వాణం' లేక మోక్షం అనేది లభిస్తుంది. అపుడిక దుఃఖం ఉండదు.  
బుద్ధుడు తాను గ్రహించిన సత్యాలను ఉపదేశరూపంలో బోధించాడేతప్ప గ్రంధరూపంలో కాదు. 
కాలాంతరంలో బౌద్ధులు అర్ధం చేసుకున్న విధానాన్నిబట్టి , కొన్ని శాఖలుగా రూపుదిద్దుకున్నాయి.

వాటిలో మొదటిది - మానసిక, భౌతిక ప్రపంచాలు  అజ్ఞానంచేత కల్పించ బడ్డాయేగాని,  అవి వాస్తవంగా లేవు. వీరు సర్వమూ శూన్యం అని చెప్పడంవల్ల, దీన్ని శూన్యవాదం అంటారు. దీన్నే మాధ్యమికమతం అనికూడా అంటారు.

రెండవది - బాహ్యప్రపంచం లేదు గాని మానసికభావాలే విజ్ఞానరూపంలో బయట కన్పిస్తుందని వాదించేవారు అవడంవల్ల, విజ్ఞానవాదం లేక యోగాచారమతం అని అనబడుతోంది.

ఇక మూడవది - బాహ్య, మానసిక ప్రపంచాలు రెండూ సత్యమే. బాహ్యప్రపంచం, అంతరంగిక విజ్ఞానం వల్ల ,  మనం  ఎదుట ప్రపంచాన్నిఊహిస్తున్నాం. అంచేత బయటి పదార్ధాలన్నీ అనుమేయాలే. ఇలా చెప్పడంవల్ల దీన్ని అనుమేయవాదం లేక సౌత్రాంతికమతం అంటారు. 

ఇక నాల్గవది - వైభాషిక మతం . దీన్లో బాహ్య , మానసిక ప్రపంచాలు రెండూ సత్యమే. అనుమేయం కాదు. అంచేత దీన్ని బాహ్య ప్రత్యక్షవాదం అంటారు.

మళ్ళీ, వీరిసిద్ధాంతాలనూ, ఆచారవ్యవహారాలను బట్టి, మాధ్యమిక , యోగాచారమతాలవారిని హీనయానమనీ , సౌత్రాంతిక వైభాషిక  వాదులను మహాయానం అనీ రెండు శాఖలుగా  బౌద్ధం ప్రచారంలోకి వచ్చింది.  
బుద్ధుడు  దుఃఖనివారణకు ఉపకరించని వాటిని గురించి మౌనం వహించడంవల్ల , ఈ ప్రపంచం అనేదాన్లో భిన్నాభిప్రాయాలు తరువాతి వారిలో  వచ్చాయి. 
మౌలికంగా బుద్ధుడు  బోధించిన విషయాలలో భేదంలేదు. 
బౌద్ధులు అనాత్మవాదులు. దైవాన్ని అంగీకరించక, తమ స్వప్రయత్నం మీదనే మోక్షం పొందటం జరుగుతుందని నమ్ముతారు. ప్రతీ కార్యానికీ ఒక కారణమనేది ఉంటుందని చెబుతారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. పునర్జన్మలు వాంఛలవల్ల కలుగుతాయని చెబుతారు. ఇదీ సంక్షిప్తంగా బౌద్ధం. 





No comments:

Post a Comment