Friday, June 22, 2012

ఉత్తర మీమాంస దర్శనం (2) – ఆస్తిక దర్శనం

ఈ అద్వైత సిద్ధాంతానికి అధ్యాస అనేది ఆయువుపట్టు. ఉన్నది ఒక వస్తువైతే దాన్ని మరో వస్తువుగా గ్రహించడం భ్రమ/ అధ్యాస. అంటే లేనిచోట ఉన్నట్లుగా భావించబడే వస్తువు. ఎండలో తళతళ లాడుతూ తెల్లగా  మెరిసే ముత్యపు చిప్పను వెండి అనుకుంటాం. దూరంగా పడిఉన్న వంకర టింకరగా పడిఉన్న త్రాడును చూచి పాము అనుకుంటాం. అక్కడ పామూ లేదు, వెండీ లేదు. అవి లేని స్థలంలో ఉన్నట్లుగా భాసించే వెండికీ, పాముకీ అధ్యాస అని పేరు. పూర్వం వెండినీ పామునూ చూసిన సంస్కారం మనసులో ఉండటం వల్ల నేత్రాది దోషం వల్ల ఆ రెండూ భాసిస్తున్నాయి. అద్వైతుల ప్రకారం వెండి, త్రాడులమీద కనపడుతున్న రజిత సర్పాదులు ఉన్నవని చెప్పడానికి వీలు లేదు; లేవని చెప్పడానికీ వీలు లేదు. అవి నిజంగా ఉంటె క్షణా౦తరంలో  కల్గే జ్ఞానం వల్ల లేవని చెప్పకూడదు. పోనీ లేవని చెబుదామంటే ఆ క్షణం లోఅవి ఉన్నట్లు కనబడుతున్నాయి కదా! అందు చేత అక్కడ కన్పించిన రజతాదికం ఉంది అని కాని, లేదు అనికాని నిర్వచించడానికి శక్యం కాదు. ఇలా భ్రమ స్థలంలో అద్వైతులు అనిర్వచనీయ౦ అని అంగీకరించారు .ఈ అధ్యాసనే పండితులు అవిద్య అంటారు.

వేదాంత వాక్యాల సహాయంతో అద్వైతాత్మ విచారణ చెయ్యాలి. ఈ శాస్త్ర విచారణ వల్ల నేను కర్తను, నేను సుఖ దుఃఖాది భోక్తను మొదలైన భ్రాంతి కల్పితాలైన అనర్ధం తొలగి మోక్షం కల్గుతుంది. వాస్తవానికి ఆత్మచైతన్యరూపమైనది. దేహము, ఇంద్రియములు జడములు. దేహమే ఆత్మ ,ఇంద్రియాలు ఆత్మకు సబంధించినవి , దేహానికి చైతన్యం ఉంది అనే ఆత్మా అనాత్మల పరస్పర అధ్యాస అనాదిసిద్ధంగా వస్తుంది.
ఈ యాగాది కర్మలు చెయ్యాలి,ఇవి చెయ్యకూడదు , ఇలా సాధన చేస్తే మోక్షం కల్గుతుంది అనేటి లోకవ్యవహారమంతా నడుస్తోంది. ఈ అధ్యాస ఉన్నంత వరకే ఇవన్నీ. అధ్యాస తొలగిపోతే ఇక లోకవ్యవహారం ఏమీ ఉండదు. వేదాంత శాస్త్రమంతా ఆత్మతత్వ జ్ఞానాన్ని కలిగించి అధ్యాస తొలగడానికి ఉపకరిస్తుంది.

అందుచేత చిత్తశుద్ధి లేనివాడు బ్రహ్మచర్యం పూర్తిచేసుకొని గార్హస్థ, వానప్రస్థాలు స్వీకరించి కర్మాలనాచరించి చిత్తశుద్ధిని సంపాదించుకొని సన్యాసియై బ్రహ్మజిజ్ఞాసకు పూనుకోవాలి. మొదటినుంచీ చిత్తశుద్ధి ఉంటే కర్మలజోలికి పోనవసరం లేదు. ధర్మాన్ని తెలిసికొని ఆచరించడం వల్ల కలగే ఫలితం విషయాది సుఖం. బ్రహ్మజిజ్ఞాసకు ఫలం మోక్షం. బ్రహ్మ జ్ఞానం తర్వాత ఇక అనుష్టించాల్సిందేమీ లేదు.

ఈ లోకంలో కృషిచేసి సంపాదించేదంతా వస్తువుగాని, కర్మ సంపాదితమైన పరలోక భోగాలుకాని  నశించేవే. నిత్యము, అనంతము, శుద్ధము, సర్వజ్ఞము అయిన బ్రహ్మముందనేది అందరికీ తెలిసనదే.  ఆత్మయే బ్రహ్మము. అట్టి ఆత్మయొక్క విశిష్ట స్వరూపాన్ని గురించి అభిప్రాయభేదాలున్నాయి. అలాంటి పరిస్థితులలో జాగ్రత్తగా విచారించకుండా ఏదొక మతాన్ని అనుసరిస్తే మోక్షానికి దూరమవ్వుతాం. 

బ్రహ్మను సూచించడానికి జగత్తుయొక్క  సృష్టి  స్థితి లయాలనే సాధనంగా చెప్పాలి. బ్రహ్మ ఇంద్రియగోచరమైనది  కాదు కాబట్టి జగత్తుకూ బ్రహ్మకూ ఉన్న సంబంధం జగత్తు రూపమైన కార్యం మాత్రమే, ఇంద్రియాలచేత గ్రహించబడుతుంది. జన్మ స్థితి లయాలను బట్టి ఈశ్వరుడిని ఊహించాలి. శాస్త్రం ఆధారంగా తెలిసికోవాలి. అన్ని ఉపనిషద్వాక్యాలూ ఆ బ్రహ్మను ప్రతిపాదించడానికే.

అవిద్య, అస్మిత(అహంకారం), కామం , క్రోధం, భయం అనే దోషాలు ఉండటంవల్ల తదనుగుణంగా శరీరాలు పొంది మానవులు సుఖదుఃఖాలను అనుభవిస్తున్నారు. ఈ సుఖదుఃఖాల భేదానికి కారణం ధర్మాధర్మాల ఆచరణే. శరీరం ధరిస్తే సుఖదుఃఖాలతో (ప్రియాప్రియాలతో) సంబంధం లేకుండా ఉండదు. ఈ శరీర సంబంధం లేకుండా ఉండాలంటే ధర్మాధర్మాలు చెయ్యకూడదు. శరీరం లేకపోవడం అంటే మోక్షం. అది జీవునికి  స్వభావసిద్ధమైనది.

 నేను శోకంతో ఉన్నాను. శోకానికి అవతలి ఒడ్డుకు చేర్చమని నారదుడు ప్రార్ధించగా , పూజ్యుడైన సనత్కుమారుడు ; తపస్సుచే పాపాలన్నీ దగ్ధమైన నారదునికి అజ్ఞానం యొక్క అవతలి  ఒడ్డైన బ్రహ్మమును చూపినట్లు శృతి చెబుతోంది. మిధ్యాజ్ఞానం నశిస్తే రాగ, ద్వేష ,మొహాలు తొలగిపోయి ధర్మాధర్మరూప ప్రవృత్తి నశిస్తుంది. అపుడిక జన్మ ఉండదు. జన్మలేకపోతే దుఖముండదు. అదే మోక్షం. బ్రహ్మాత్మైకత్వ జ్ఞానమే తత్వ జ్ఞానం. ఇదే వేదాంతం. ఇదే ఈ దర్శనంలో  బోధించబడే విషయం.


No comments:

Post a Comment