Friday, June 1, 2012

వేదములు (Vedas)

వేదాలు అపౌరుషేయాలని చెప్పుకున్నాం. అనాదికాలం నుంచీ, అవిచ్చిన్నంగా గురుశిష్య పరంపరగా మనకు అంది వస్తున్నాయి. అవి శాశ్వతాలని కొందరు నమ్ముతారు. ఇవి ఎలామొదలయ్యాయి అనే దాన్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చరిత్రకారులు  క్రీస్తు పూర్వం 1500 సవత్సరాల నాటివి అని కొందరు, క్రీ.పూ 3000 నాటివని కొందరూ అభిప్రాయ పడుతున్నట్లు చెబుతారు.

జగత్తును సృష్టించిన పిదప శ్రీమన్నారాయణుడే వేదాన్ని, మరీచ్యాదిఋషులకు ప్రవృత్తి ధర్మంగాను, సనకాదులకు నివృత్తిధర్మంగాను ఉపదేశించగా, వారిద్వారా వేదం ప్రచారమైనట్లు ఆదిశంకరులు వ్రాశారు. 
వేదములు ఈశ్వరప్రతిపాదితములై, బ్రహ్మకు అధీనములో నుండగా,సోమకాసురుడు బ్రహ్మ నిద్రించుచుండగా వీటిని అపహరించి సముద్రమున దాచెను. అపుడు విష్ణువు మత్స్యావతారమును దాల్చి , సోమకాసురుని చంపి వేదములను బ్రహ్మకు ఇచ్చెను. అటుపిమ్మట విష్ణువే, వ్యాసుని అవతారమునెత్తి, అనంతములైన వేదములను నాలుగుభాగములుగా విభజించి వేదవ్యాసుడుగా ప్రసిద్ధి చెందెను.     

వేదంలో జ్ఞానం, పరా విద్య, అపరా విద్య అని రెండువిధాలుగా  ఉంది. పూర్వభాగంలో కర్మకాండ ప్రతిపాదించ బడింది. ఇది  అపరావిద్య- దీన్నే ప్రవృత్తిధర్మం అనికూడా అంటారు. చివరిభాగంలో ఆత్మజ్ఞానాన్ని బోధించే పరావిద్య గలదు. దీన్నే నివృత్తిధర్మం అంటారు. ఇది ఆదికాలం నుంచీ అందివస్తున్న మూలగ్రంధం అవడంచేత - 'నిగమం' అనీ, గురుశిష్య పరంపరగా వినే దివ్యవాణి గనుక - 'శృతి' అనీ , మననం చేసుకోడం ద్వారా నేర్చుకోబడేవిద్య అవడంచేత - 'ఆమ్నాయం 'అనీ    పేర్లు ఉన్నాయి.

వేదంలో కర్మకాండ ధార్మిక క్రియలనూ, విధులను ఆచారాలనూ చెబుతుంటే, జ్ఞానకాండ ఆత్మ పరమాత్మలను, ప్రకృతి స్వరూపాలను గురించీ చెబుతుంది. మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది.  కాల క్రమేణా విద్యార్ధులు అర్ధంచేసుకొని వల్లి౦చడానికి కష్టమవడంవల్ల ద్వాపరయుగం ప్రారంభంలో కృష్ణద్వైపాయనుడు అనబడే వ్యాసమహర్షి దాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగుభాగాలుగా విభజించేరు. అలా విభజించిన వేదాలను తన శిష్యులకు బోధించగా, కాలక్రమంలో ఈగురువుల శిష్యులు వర్ధిల్లి, పరస్పరమూ విడిపోగా అనేకశాఖలు మొదలయ్యాయి. అలా ఏర్పడిన శాఖలు  కఠ, కౌతుమ, వాజసనేయ, మాధ్యందిన అనే పేర్లతో పిలువబడుతున్నాయి.

 ప్రతీ వేదాన్నీ తిరిగి నాలుగుభాగాలుగా తీర్చిదిద్దేరు. వీటిలో మంత్రభాగాన్ని సంహిత అనీ, సంహితలో మూలవిషయాన్ని వివరించడానికి ఉద్దేశించబడిన భాగాలకు బ్రాహ్మణములు అనీ అంటారు. వీటిలో యజ్ఞాలు మొదలైన కర్మకాండ, ఎలాచెయ్యాలో తెలుపబడింది. ఇక మూడవభాగాన్ని అరణ్యకాలు అని అంటారు. ఇవి కర్మప్రతిపాదితమైనా కర్మల భౌతికభాగానికిగాక యజ్ఞనిర్వహణలో ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇవి ఏకాంతవ్రతాన్ని స్వీకరించి వనాలలోనివసించే వానప్రస్థులు వల్లించడంకోసం ఉద్దేశించబడ్డాయి.  ఇక వేదాల్లో చివరిభాగాలకు ఉపనిషత్తులని పేరు. ఇవి వేద విజ్ఞతకంతకూ సారం. వేదాల చివరిభాగం అవడంచేతనూ, వీటిని తెలుసుకుంటే ఇక తేలుసుకోవలసినదేదీ ఉండని కారణంగాను - వేదాంతం అని  అంటారు.  వేదశాఖలకు అనుగుణంగా అనేక ఉపనిషత్తులు వెలిశాయి. వీటిలో 108 చదువదగ్గవని నిర్ణయించడం జరిగింది. వీటిలో 10 - 12 ఉపనిషత్తులు మాత్రమే ముఖ్యమైనవిగా పరిగణించ బడుతున్నాయి. 
 వేదాలకు అంగములు ఆరు. అవి శిక్ష , వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము , జ్యోతిషము , కల్పము. శిక్షయందు వేదముయొక్క స్వరము మొదలైన లక్షణములు చెప్పబడును. స్వరము వేదమునకు ముఖ్యము . స్వరముతప్పిన, దాని అర్ధమే మారిపోవును. వ్యాకరణమునందు శబ్దలక్షణము చెప్పబడును. ఛందమున శ్లోకలక్షణములు వివరించబడును. నిరుక్తమున వేదమంత్రోక్త శబ్దములకు అవయవార్ధులతోడ అర్ధము చెప్పబడును. జ్యోతిషమున వేదముచే విధింపబడిన కర్మలకు ఉచితమైన కాలములను ఎరుగు మార్గము చెప్పబడును. కల్పమునందు యాగాదిక్రియలను చేయవలసిన రీతులు బోధింపబడును. 
ఇవిగాక ఆయుర్వేదము, ధనుర్వేదము , గాంధర్వవేదము , అర్ధవేదము అను నాలుగు ఉపవేదములు గలవు. ఆయుర్వేదము ఆరోగ్యమునకు, ధనుర్వేదము ధనుర్విద్యాకౌశలమునకు, గాంధర్వవేదము నృత్యగీతావాద్యాభినయాదులను వివరించు ఉపవేదము. అర్ధవేదమున నవరత్నములకు కలుగు జన్మస్థానములు , జాతులు, గ్రహములు వీని దోషములను ఎరిగించుచు ఆరత్నధారణమున కలుగు ఫలితములను దెలుపునది.
        

No comments:

Post a Comment